Tuesday, April 16, 2024

కపిలవాయి లింగమూర్తి(కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు.)

కపిలవాయి లింగమూర్తి
(కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు.)
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

కలం అతడిదే.... కాలం అతడిదే.... 
అక్షరం అతడిదే... అర్థం అతడిదే... 
అనంతానంత విశ్వంలో రెపరెపలాడుతున్న 
సాహితీ కేతన వర్ణమతడిదే 
అతడు..... 
పాలమూరు సాహితీ దిగ్గజం కపిలవాయి లింగమూర్తి !

పరిచయం : 

1928 మార్చి 31
ఉమ్మడి పాలమూరు జిల్లా, అచ్చంపేట తాలూకా, బల్మూర్ మండలం జినుకుంట గ్రామంలో జన్మించారు. 
మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులు వీరి తల్లిదండ్రులు. 1930- 31 ప్రాంతంలో వెంకటాచలం గారు మరణించారు. ఈ పరిస్థితిలో మేనమామ పెద లక్ష్మయ్యగారు కపిలవాయిని చేరదీసాడు.  

ఆనాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కపిలవాయి పాఠశాల విద్య ఉర్దూ మాధ్యమంలో కొనసాగింది. కానీ ఒక వయసు, ఒక ఆలోచన, వచ్చాక గుండె నిండా తెలుగు భాషమీద అభిమానం అనివార్యంగా ఏర్పడింది. ఈ క్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి తెలుగు విశారద ప్రమాణ పత్రాన్ని పొందాడు. 
తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ. పట్టా పొందాడు. 

సంస్కృతాంధ్ర నిఘంటువులు, పురాణేతిహాసాలు, కావ్యనాటకాలు, జ్యోతిషశ్రౌతాదిభాగాల్లో కపిలవాయి ఆరితేరారు. 

👉విధి నిర్వహణ :

వీరి ఉద్యోగ జీవితం 26 ఏండ్ల వయసు నుండి కొనసాగింది. 11.7.1954 న జాతీయోన్నత పాఠశాల, నాగర్‌కర్నూల్‌ లో తెలుగు పండితునిగా చేరి సేవలు అందించాడు. 
19.8.1972 న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, పాలెంలో ఉపన్యాసకులుగా చేరి చరిత్రోపన్యాసకులుగా సేవలు కొనసాగించారు. 
28.2.1983 న ఉద్యోగ విరమణ పొందారు. 

వృత్తిలో కొనసాగుతూనే ప్రవృత్తిని కొనసాగిస్తూ శతాధిక రచనలు చేశాడు. 

👉సాహితీ ప్రస్థానంలో 

కపిలవాయి పద్య రచనతో తన ప్రస్థానం ప్రారంభించాడు. తర్వాత వచన సాహిత్యం, 
కావ్యాలు, గీతాలు, శతకాలు, బాల సాహిత్యం, 
స్థల చరిత్రలు,దేవాలయ చరిత్రలు, విమర్శ, జనపదం, తదితర సాహిత్య ప్రక్రియలను స్పృశించారు. 

జిల్లా వ్యాప్తంగా శ్రమకోర్చి పర్యటించి మరుగున పడిన శాసనాలను పరిశీలించాడు. . చరిత్రను గ్రంధస్థం చేసాడు. జానపదుల నోళ్ళలో కదలాడే మౌఖిక సాహిత్యాన్ని సేకరించి రికార్డు చేసాడు. ఇవి వీరి జీవితంలో "వేయిపున్నమల వెలుగు ".

వీరి రచనలపై విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి రచనలు - జీవితం ఆధారంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం , తెలుగు విశ్వవిద్యాలయం , మధురై యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో ఆరు సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి. 

1. డా. అనంత రాములు (ఉస్మానియా యూనివర్సిటీ) కపిలవాయి శతకాలు - పరిశీలన
2. డా. అనంత రాములు (ఉస్మానియా యూనివర్సిటీ) కపిలవాయి జీవితం - సాహిత్యం
3. యాదగిరిచారి (మధురై యూనివర్సిటీ) శ్రీమత్ప్రతాపగిరి ఖండం - పరిశీలన
4. రామాచారి (యస్‌.వి. యూనివర్సిటీ) చక్రతీర్థ మహాత్మ్యం - పరిశీలన
5. రామాచారి (తెలుగు యూనివర్సిటీ) కపిలవాయి జీవితం - సాహిత్యం
6. జి. వెంకటరాజం (ఉస్మానియా విశ్వవిద్యాలయం) కపిలవాయి లింగమూర్తి సాహిత్యంలో చరిత్ర - సంస్కృతి

వీరు మొత్తం 100కు పైగా రచనలు చేసారు. కొన్ని అముద్రితాలు. వీరి కొన్ని ముఖ్యరచనలు, వాటి వివరాలు గమనిస్తే... 

1)భాగవత కథాతత్వం 
(భాగవతంలో 10 కథలకు వ్యాఖ్యానం )
2)సాలగ్రామ శాస్త్రం 
(సాలగ్రామం దానిపుట్టు పూర్వోత్తరాలు, చరిత్ర), 
3) శ్రీ మత్ప్రతాపగిరి ఖండం 
(అమరాబాదు స్థల చరిత్ర)
4)కుటుంబగీత (కుటుంబ నియంత్రణను చాటి చెప్పే ఏకైక కావ్యం)
5)మాంగళ్య శాస్త్రం
 (మాంగళ్యం ధరించడంలోని గూడార్థాలు, విశేషాలు), 6)దుర్గా భర్గా శతకాలు
 (అలంకార యతి లక్షణాలు)
7) ఆర్యా శతకం
 (చిత్ర పద్యాల గారడి)
8) స్వర్ణశకలాలు 
(90 కావ్యాలలోని స్వర్ణశిల్పి ప్రశస్తి)
9)గీతాచతుష్పథం 
(భ్రమరగీత, భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవగీతల సారాంశము)
10)రుద్రాధ్యాయం 
(సామాజిక చారిత్రక వ్యాఖ్యానం) 
11)పాలమూరు జిల్లా మాండలికాలు (పామర సంస్కృతం)

వీరి ఆత్మకథ " సాలగ్రామం "

👉పాలమూరు జిల్లా దేవాలయాలు 

"పాలమూరు జిల్లా దేవాలయాలు" పరిశోధనాత్మక రచన కపిలవాయి జీవన సాఫల్య గ్రంధం. జిల్లావాసులకు ఉపయుక్త గ్రంధం. తిరుమల తిరుపతి దేవస్థానములు - తిరుపతి వారు 2010 లో ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకంలో మొత్తం 30 శీర్షికలతో జిల్లా దేవాలయాల సమాచారాన్ని పొందుపర్చారు. 

1.పాలమూరు జిల్లా పుట్టుక
2.అచ్చంపేట తాలూకా ఆలయాలు
3.అచ్చంపేట మండలంలోని అరణ్యకాలు
4.అమరాబాదు పట్టీలోని ఆలయాలు
5.అమరాబాదు సీమలోని అరణ్యకాలు
6.ఆలంపురం సీమలోని ఆలయాలు
7.కలువకుర్తి తాలూకాలోని గుడులు
8.వెలిదండలో వెలసిన ఆలయాలు
9.కొల్లాపురం తాలూకా కోవెలలు
10.కోడంగల్ తాలూకాలోని గుడులు
11.నాగర్ కర్నూలు తాలూకాలోని గుడులు
12.వడ్డవాని సీమలో వర్ధిల్లిన ఆలయాలు
13.పాలమూరు తాలూకాలోని ఆలయాలు
14.మక్తల్ తాలూకాలోని మందిరాలు
15.లోకయ్యపల్లె దొరలు కట్టించిన గుడులు
16.వనపర్తి యిలాకా ఆలయాలు
17.నాయక్ వంశీయులు కట్టించిన గుడులు
18.గోపాలపేట యిలాకా కోవెలలు
19.ఈ జిల్లాలోని కొన్ని వెంకటేశ్వరాలయాలు
20.వాసవీ కన్యకాంబ ఆలయాలు
21.వీరబ్రహ్మేంద్రుని ఆలయాలు
22.మన గ్రామదేవతలు
23.ఇదమ్మ జాతరలు
24.ఎల్లమ్మ జాతరలు
25.మైసమ్మ జాతరలు
26.ఇతర దేవతలు జాతరలు
27.ఆశ్రమాలు - మఠాలు - సమాధులు
28.మఠాలు
29.సమాధులు
30.మా జిల్లాలో కొన్ని దర్శనీయ స్థలాలు

👉నలుగురు ముఖ్యమంత్రులతో సన్మానం 

సాహిత్యరంగంలో వీరి కృషి, సంకల్పం, వెలకట్టలేనిది. 
 వీరి విశిష్ట రచనలు వీరికి పురస్కారాలతో విశిష్ట స్థానాన్ని ఆపాదించి పెట్టాయి. వాటిలో విశేషమైన వాటి వివరాలు చెప్పుకుంటే....... 

1983లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు కపిలవాయి వారిని సన్మానించి గౌరవించారు. 
నారాచంద్రబాబు నాయుడు, వై.యస్. రాజశేఖరరెడ్డిలు కూడా తమ పాలనాకాలంలో కపిలవాయిని సన్మానించారు. 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సైతం వీరిని సన్మానించారు. నలుగురు ముఖ్యంత్రులచే సన్మానింపబడిన ఏకైక సాహిత్యకారుడుగా కపిలవాయి చరిత్ర విశిష్టమైనది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన మొదటి వ్యక్తిగా కపిలవాయి ఘనత దక్కించుకోవడం
విశేషం. 

తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభాపురస్కారం -
బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం- 
బ్రౌన్ సాహిత్య పురస్కారం -
నోరి నరసింహశాస్త్రి పురస్కారం -
కందుకూరి రుద్రకవి పురస్కారం -
పులికంటి సాహితీ పురస్కారం -
 బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారం -

1992లో కవితా కళానిధి, పరిశోధనా పంచానన
1996లో కవికేసరి
2005లో వేదాంత విశారద
2010లో గురు శిరోమణి
2012లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి, సాహితీ విరాణ్మూర్తి
2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌

👉వ్యక్తిత్వం :

కపిలవాయి !
మూర్తీభవించిన మహాతత్త్వం ... 
తెలుగు భాషను, తెలుగు ప్రజలను మనసారా ప్రేమించిన భాషా యోగి....... 
తెలంగాణ ప్రాంతం తన గుండెకాయగా జీవించిన అభిమాన ధనుడు.... 

తాను నడిచే గ్రంధాలయం అయినప్పటికీ, వహించిన విజ్ఞానం అయినప్పటికీ అందరినీ కలుపుకు పోయిన నిగర్వి..... 

👉కుటుంబం 

వీరి జీవిత భాగస్వామిమీనాక్షమ్మ. ఈ పుణ్య దంపతులకు కిశోర్ బాబు, Kapilavai Ashokbabu ఇద్దరు సంతానం. 

👉శివైక్యం 

కపిలవాయి నవంబర్ 6, 2018 న తన 90 ఏండ్ల వయసులో దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రి హైదరాబాదులో కాలధర్మం చెందారు. 

ఎందరో మహానుభావులు 
అందరికీ వందనాలు 🙏
____________________________________________
 విజ్ఞాన సర్వస్వం కపిలవాయి లింగమూర్తి గారికి జయంతి నివాళులతో.....

No comments:

Post a Comment