Monday, April 15, 2024

సై సైరా గాదె చిన్నపరెడ్డి

సై సైరా చిన్నపరెడ్డి
(1864 - 1910)
(భారత స్వాతంత్ర తొలి పోరాట యోధుడు )
°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

అది.... 
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం భరతగడ్డపై దురహంకారంతో చెలరేగుతున్న రోజులు.... 
భారతమాత కన్నీటి బొట్లు మాతృనేలను చిత్తడి చేస్తున్న దయనీయమైన రోజులు ... 
ఈ సమయంలో -
దాస్య శృంఖలాల విముక్తి కోసం.... 
స్వేచ్ఛావాయువుల సంచారం కోసం.... 
కుదేలవుతున్న జాతి చైతన్యం కోసం... 
ప్రాణాలకు తెగించి.. సమరోత్సాహంతో ముందుకు నడిచాడు ఒక యువకుడు.. ! 
అతడు.... గాదె చిన్నపరెడ్డి !
వందేమాతరం అంటూ ఎందరో యువతీ యువకులను ముందుకు నడిపించి....పల్లె పల్లెని తట్టిలేపి.... గుండె గుండెలో ఫిరంగులు మోగించి.... ఆత్మస్థయిర్యమే ఆయుధంగా పిడికిలెత్తి నినదించిన కదన కేసరి చిన్నపరెడ్డి ! 

ఉరికొయ్యకు వేలాడి సైతం శత్రువును ఉరిమి చూసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తర్వాత, అంతటి వీరత్వాన్ని చూపిన మరో ధీరోదాత్తుడు చిన్నపరెడ్డి !

భారత స్వాతంత్ర చరిత్రలో తిరుగులేని వీరుడిగా బ్రిటిష్ దొరలకు సవాల్ గా నిలిచిన అసలు సిసలు తెలుగు తేజం గాదె చిన్నపరెడ్డి పౌరుషం పెద్దగా వెలుగు చూడలేదు. త్యాగం - ధర్మం కలయిక తన పతాకగా ప్రజా సైన్యాన్ని నడిపించిన చిన్నపరెడ్డి వీరగాథ చరిత్రలో పెద్దగా కనబడకపోయినా జానపదుల గాథల్లో మాత్రం నేటికిని మార్మోగుతున్నది. 

మరి ఎవ్వరి చిన్నపరెడ్డి? 
ఏమిటా పోరాట గాధ? 

👉పరిచయం :

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం మోతుబరి రైతు కుటుంబానికి చెందిన గాదె సుబ్బారెడ్డి లింగమ్మ దంపతులకు రాయపరెడ్డి, రామిరెడ్డి, చెన్నారెడ్డి, కోటిరెడ్డి, నాగిరెడ్డి తర్వాత ఆరవ సంతానంగా 1864లో చిన్నపరెడ్డి జన్మించాడు.

చిన్నపరెడ్డికి చదువు పెద్దగా అబ్బలేదు. కానీ కత్తిసాము కర్రసాము గుర్రపు స్వారీ వంటి అస్త్ర విద్యల్లో ఆరితేరాడు. రామాయణ మహాభారతం కథల్ని సమూలంగా ఔపాసన పట్టాడు. 

రూపానికి వస్తే... చిన్నపరెడ్డి ఆజానుబాహుడు. ఇప్పటికి వీరి తరం ఆరడుగుల ఎత్తు వరకు ఉంటుంది. రూపానికే కాదు మంచితనం మానవీయతలకు, పోరాటపటిమకు కూడా చిన్నపరెడ్డి పెట్టింది పేరు. అందుకే ప్రజలమనిషిగా ఎదిగాడు..

▪️సై సైరా చిన్నపరెడ్డి 

మంచితనం... మానవత్వం... పుష్కలంగా కలిగివున్న చిన్నపరెడ్డి తన చిన్నతనం నుండే పేదలను ఆకట్టుకున్నాడు. ప్రజల బాగుకోసం ఉన్నతి కోసం జీవితాన్ని ధారపోసాడు.

చుట్టుపక్కల గ్రామాలను అధీనంలో ఉంచుకుని,తమ ప్రాంతంలో పాలేగార్ వ్యవస్థ లేకపోయినా, తాను పాలేగార్ కాకపోయినా, "#పాలెగార్ " గా ప్రజలచేత పిలవబడి, పాలనా దక్షతకు పరోపకారానికి ప్రతీకగా మిగిలిన ఇతడే .... ఇదే ప్రజల చేత సై సైరా చిన్నపరెడ్డి....అనిపించుకున్నాడు కూడా! 

ఇక్కడ #పాలెగార్ అంటే పాలించేవాడు అని అర్థం. పరాక్రమవంతులకు, వ్యూహప్రతివ్యూహాలు నడిపే రాజనీతిజ్ఞులు ఈ పదవికి అర్హులుగా చెప్పవచ్చు. 

 క్రీ.శ.17, 18వ శతాబ్దాల్లో చారిత్రాత్మక పాత్రను పోషించిన పాలెగాళ్లు దక్షిణ భారతదేశంలో కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి దత్తమండలాలను ప్రతిష్టాత్మకంగా ప్రాంతాలను పాలించారు. తమిళ కన్నడ ప్రాంతాల్లోనూ వీరి ఉనికి ఉన్నది. తమిళంలో వీరిని పాలైయాక్కరర్ అని, కన్నడంలో పాళెయగరరు అని అంటారు. 

విజయ నగర రాజ్య పతనానంతరం పాలెగాళ్ల పాలన ప్రారంభమైంది. విజయనగర రాజుల కాలంలోనే పాళెగార్ల వ్యవస్థ ఏర్పడి... రాజ్య భారంలో భాగంగా పన్నులు వసూలు చేయడంలోనూ, రాజులకు వారి కుటుంబాలకు అంతర్గత రక్షణ కల్పించడంలోనూ, యుద్ధ సమయాల్లో సైన్యాన్ని సమీకరించడంలోనూ సహాయపడేవారు. బ్రిటిష్ కాలానికి వచ్చేసరికి..... బలవంతులు దేశభక్తులు ప్రజాబంధువులు అయిన పాలెగాళ్లను అణిచివేయడానికి ఆక్రమించుకోడానికి బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టింది. 
ఈ క్రమంలో బ్రిటిష్ సైనిక చట్టాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా ఎదిరించిన ఘనత దత్త మండలాల పాలెగార్లదే.

దత్తమండలాలు ప్రాంతంలో ప్రధానంగా పాలెగాళ్ళ వ్యవస్థ ప్రతిష్టాత్మకంగా కొనసాగింది. ఈ ప్రాంతంలో మొత్తం 80మంది పాలెగాళ్ళు ఉండేవాళ్ళు. ఈ వ్యవస్థ ప్రభావం పలనాడు ప్రాంతంలో చిన్నపరెడ్డిలో కనబడింది. పాలే గారి వ్యవస్థ మీద, పాలెగార్ విధి విధానాల మీద, ఆసక్తిని పెంచుకున్న చిన్నపరెడ్డి వేషధారణలో దాదాపుగా పాలేగార్లను అనుసరించేవాడు .. #చేబ్రోలు #రెడ్డిపాలెం పరిసర ప్రాంతాలను చిన్నపరెడ్డి తన గుప్పిట్లో ఉంచుకున్నాడు.
.
ఆంధ్రరాష్టంలో గుంటూరు జిల్లా 1906 లో ఏర్పాటు చేయబడింది. అంతకు పూర్వం గుంటూరు పరిసర ప్రాంతాలు చిన్న చిన్న రాజ్యాలుగా కొనసాగేవి. ఈ క్రమంలో చిన్నపరెడ్డి అజమాయిషీలో ఉన్నది చేబ్రోలు పరిసర ప్రాంతమే అయినప్పటికీ మద్రాసు నగరం వరకు వీరికి అనుచరులు ఉండేవారు. 

చేబ్రోలు, నాదెండ్ల ప్రాంతాల్లో కొందరు గ్రామ పెత్తందార్లు... తెల్లదొరల అడుగులకు మడుగులు ఒత్తుతూ ప్రజలను కట్టు బానిసలుగా మలుచుకుని నిర్దాక్షిణ్యంగా పీడించేవాళ్ళు. తెల్లదొరల మెప్పుకోసం ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవాళ్ళు. ఈ పరిస్థితిని పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరంకుశత్వంపై కన్నెర్ర జేశాడు చిన్నపరెడ్డి.
ఈ క్రమంలో పెత్తందార్లకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ప్రజాపక్షం వహించాడు. ఇట్లా ఆ ప్రాంతంలో ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా రక్షణ కోసం గుర్తుకు వచ్చేది
చిన్నపరెడ్డి పేరే! 

నిర్ణయాలు :

1) కొందరు పెత్తందార్లు పని చేయించుకుని కూలీ ఎగ్గొట్టడం లేదా లేదా తక్కువ కూలీ ఇవ్వడం చేస్తున్న పరిస్థితుల్లో "శ్రమకు తగిన ఫలితం " అంటూ విప్లవం తీసుకువచ్చాడు. 
2) పెత్తందార్ల ముందు సామాన్యులు గుర్రపు స్వారీ చేయడం, ఎద్దుల బండ్ల మీద ప్రయాణించడం, ఆరోజుల్లో నేరంగా పరిగణించేవారు. పొరపాటున ఎవ్వరైనా గుర్రపు స్వారీ చేసినా....కచ్చరంపై ప్రయాణించినా నేరంగా పరిగణించేవాళ్ళు. ఈ పరిస్థితిని నిరసిస్తూ చిన్నపరెడ్డి సామాన్యులు గుర్రపు స్వారీ నేర్చుకునే అవకాశం కల్పించాడు. ఆపద సమయాల్లో గుర్రపు స్వారీ అవసరాన్ని గుర్తించి మెలిగాడు. అవసరం కోసం కచ్చరం ప్రయాణాన్ని ప్రోత్సహించాడు. 
3) ఆ కాలంలో కరువు కాటకాలు కూడా ప్రజా జీవనాన్ని విపరీతంగా అతలాకుతలం చేసేవి. ఈ విపత్కర పరిస్థితుల్లో చిన్నపరెడ్డి బ్రిటిష్ వారికి అండగా నిలిచిన భూస్వాముల ధాన్యాగారాలపై తన సైన్యంతో దాడి చేసి ధాన్యాన్ని కొల్లగొట్టడం... ఆ ధాన్యాన్ని పేదలకు నిర్భాగ్యులకు పంచిపెట్టడం ఒక బాధ్యతగా కొనసాగించాడు. 

ఇట్లా తమకు సవాల్ గా నిలిచి. తమ ఆగడాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన చిన్నపరెడ్డిని పెత్తందార్లు శత్రువుగా భావించారు. ప్రజల పాలిట ఆపద్బాంధవుడిగా.. తమ పాలిట సింహస్వప్నంగా యువ చైతన్యంతో దూసుకుపోతున్న చిన్నపరెడ్డిని అదును చూసి మట్టుపెట్టాలని పథకాలు రచించడం కూడా మొదలెట్టారు.

👉కొల్లగొట్టడం - 

బాల్యం నుండే నాయకత్వ లక్షణాలతో పాటుగా దానశీలిగా కనిపించేవాడు చిన్నపరెడ్డి. 
ఇతడు పుట్టేనాటికే భారతదేశంలో బ్రిటిష్ పాలన 
కొనసాగుతున్నది. భారత ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతూ నిరక్షరాస్యులుగా నిరుపేదలుగా దీనంగా బతుకులు సాగిస్తున్న పరిస్థితి. ఈ దుస్థితిని ఎదిగి ఎదగని వయసులోనే గుర్తించాడు చిన్నపరెడ్డి. తన భారతదేశం పేదరికానికి ఆకలికి నిలయంగా కనబడటాన్ని బాల్యంలోనే నిరసిస్తూ.... తన ఇంట్లో పండించిన పంటను పేదలకు పంచడం అలవర్చుకున్నాడు. 
ఈ క్రమంలోనే క్రమంగా ఒక వయసుకి రాగానే అక్రమార్కులను కొల్లగొట్టడం.... పేదలకు పంచి ఇవ్వడం... అలవర్చుకున్నాడు. 

👉 గుర్రాల సేకరణ - పశుసంపదపై ప్రీతి 

చిన్నపరెడ్డికి గుఱ్ఱం స్వారీ మీద, గుర్రాల సేకరణ మీద, ఎనలేని మక్కువ. కాబట్టే ప్రత్యేక శ్రద్ధతో చిన్నతనం నుండే గుర్రపు స్వారీలో ఆరితేరాడు. అట్లాగే మంచి మేలు జాతి గుర్రాలను సేకరించడం ఒక అభిరుచిగా అలవర్చుకున్నాడు. అంతే కాదు, తన ఇంటి గోడల మీద కూడా గుర్రాల బొమ్మల్ని రాతితో చెక్కించుకున్నాడు. నేటికిని ఈ నిదర్శనాలు శిథిల జ్ఞాపకాలుగా మిగిలిఉన్నాయి. 

అట్లాగే పశువులపై కూడా చిన్నపరెడ్డికి మక్కువ. తన వ్యవసాయం కోసం.... ప్రయాణ అవసరాల కోసం బలిష్టమైన ఎద్దులను సేకరించుకునే వాడు. బక్కచిక్కిన పశుసంపదను నిర్లక్ష్యం చేయకుండా వాటి కోసం గడ్డి గాదాం ఉచితంగా సరాఫరా చేసేవాడు.

👉రత్తమ్మ - వెంకమ్మ :

రత్తమ్మ అనే ఇతర కులస్తురాలి నమ్రత, తేలివితేటలు, ఆత్మస్థయిర్యం, చిన్నపరెడ్డిని ఆకర్షించాయి. ఆమెపై మనసు పడ్డాడు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ చిన్నపరెడ్డి అభిప్రాయంతో సంబంధం లేకుండా పెద్దలు వెంకమ్మతో పెండ్లి ఖాయం చేసుకుని వచ్చారు. దీంతో పెద్దల పరువుకు మర్యాదకు కట్టుబడి వెంకమ్మను పెళ్లిచేసుకున్నాడు. ఇట్లగని వెంకమ్మను ఏనాడు కూడా బాధ పెట్టలేదు. మనసు నొప్పించలేదు. అట్లాగే రత్తమ్మను వదిలి పెట్టలేదు ప్రియురాలుగా భార్యకు ఇచ్చిన స్థానాన్నే ఇచ్చి గౌరవించాడు.... ప్రేమించాడు  

▪️వేగుగా రత్తమ్మ :

తెలివైన...చురుకైన.... రత్తమ్మ చిన్నపరెడ్డికి వేగుగా పనిచేసింది. ఇందుకు చాకచక్యంగా అవసరమైన చోట్ల మారువేషాలు ధరించింది.

▪️వేగుగా గుఱ్ఱం :

చిన్నపరెడ్డి గుఱ్ఱం తెలివైనది. ఆపదను పసిగట్టేది. తన భావాలను తన శరీర కదలికలు సకిలింపులు భాషగా యజమాని సై సైరా చిన్నపరెడ్డికి తెలియజేసేది. గుఱ్ఱం వ్యక్తపరిచే భావాలను చిన్నపరెడ్డి అర్థం చేసుకునే వాడు.

👉వ్యవసాయం 

మొదటి నుండి చిన్నపరెడ్డి వాళ్ళది వ్యవసాయ కుటుంబం. చిన్నపరెడ్డికి వ్యవసాయంపై విపరీతమైన మక్కువ ఉండేది. ఆనాటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ ఎర్రనేలల్లో నీలిమందు పంటను సాగుచేసేవాడు చిన్నపరెడ్డి. మిగతా రైతులు కూడా ఇదే పంటను సాగుచేసేవాళ్ళు. అందరూ పండించిన నీలిమందును గుర్రాల ద్వారా మద్రాసుకు తీసుకువెళ్లి, అక్కడ కూవం నది ఒడ్డున ఉండే తెలుగువారి విక్రయకేంద్రాల ద్వారా వ్యాపారం నిర్వహించేవాడు చిన్నపరెడ్డి. ఇట్లా తన పంటకే కాకుండా ఇతర రైతుల పంటకు కూడా దళారుల బెడద లేకుండా చేసాడు. ఈ విధానం కూడా ఆనాటి బ్రిటిష్ తొత్తులకు నచ్చలేదు. తమ మనుషులనే దళారులుగా నియమించి రైతుల పంటలు దోసుకునే ఈ తొత్తులకు చిన్నపరెడ్డి తీరు కంటికి కునుకు లేకుండా చేసింది. 

👉వందేమాతరం - మనదే రాజ్యం 

అప్పట్లో కూవం నది ఒడ్డున ప్రకాశం పంతులు, బాలగంగాధరతిలక్, వంటి నాయకులు స్వరాజ్య కాంక్షతో సభలు నిర్వహించి భారత ప్రజల్లో జాతీయోద్యమ స్ఫూర్తి నింపేవారు. ఈ క్రమంలో ఒకానొక రోజు చిన్నపరెడ్డికి ఆ సభలో అనుకోకుండా పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ సందర్బంగా పంతులు గారి నోటి నుండి వందేమాతరం నినాదం విన్నాడు. అంతే ! చిన్నపరెడ్డి నరనరాల్లో నూతనోత్తేజం ఫెల్లుబికింది. అచంచలమైన దేశభక్తితో గుండె వేగం పెరిగింది. ఉడుకు రక్తం మరిగింది. 

అదివరకే చిన్నపరెడ్డి ఒక పాలెగాడుగా బ్రిటిష్ దొరల కిరాతక చర్యలను వ్యతిరేకిస్తున్నారు. వారికి వంత పాడుతున్న భారతీయ పెత్తందార్లను నిరసిస్తున్నాడు. ఇక ఇప్పుడు వందేమాతరం నినాదంతో సమర సైన్యాన్ని ఏర్పాటు చేయాలనీ తనలో తానే శపథం పూనుకుని కంకణం కట్టుకున్నాడు. 

చేబ్రోలు తిరిగివచ్చాక అనుకున్న ప్రకారం జనసమీకరణ చేసి స్వతంత్ర్య పరమార్థాన్ని వివరించాడు. అన్నాళ్ళు తమ హక్కుల గురించి, తమ సంక్షేమం గురించి, తమ ఆకలి గురించి మాట్లాడి ధైర్యాన్ని నింపిన చిన్నపరెడ్డి.... ఇప్పుడు స్వాతంత్య్రం గురించి మాట్లాడగానే ప్రజలు ఎప్పట్లా చైతన్యం పొందారు. అట్లా ""వందేమాతరం - మనదే రాజ్యం " నినాదాన్ని సృష్టించుకుని పెద్దఎత్తున దండును తయారుచేసుకున్నాడు చిన్నపరెడ్డి. 

తన దండుతో స్వాతంత్ర్య కాంక్షను తెలియ జెబుతూ వివిధ సభలు సమావేశాలు కూడా నిర్వహించడం మొదలెట్టాడు. ప్రజలను ఉత్తేజపరిచేందుకు ఆటపాటల కార్యక్రమాలను కూడా కొనసాగించాడు. 
బ్రిటిష్ దొరలకు.... దొరల తొత్తులకు....ఈ పద్దతి కూడా నచ్చలేదు. చిన్నపరెడ్డిని పక్కలో బల్లెంలా భావించి మట్టుపెట్టడానికి పథకాలు మొదలెడుతూ ఆటంకాలు సృష్టించసాగారు. 

👉శివభక్తుడు :

చిన్నపరెడ్డి గొప్ప శివభక్తుడు. ఉపాసకుడు. ప్రతి శివరాత్రికి కోటప్పకొండ మహోత్సవాలకు మంది మార్బలంతో బయలుదేరేవాడు. ప్రతి ఏటా 60 అడుగుల ప్రభను తయారు చేయించి, బలమైన గిత్తలు కట్టిన రాతిగాండ్ల బండి మీద అలంకరింప జేసుకుని, శివదర్శనం చేసుకుని సమర్పించుకునే వాడు. చిన్నపరెడ్డి యుక్తవయసుకు వచ్చిన నాటి నుండి క్రమం తప్పకుండా ఈ ఆనవాయితీ కొనసాగించాడు. 
అప్పట్లో చిన్నపరెడ్డి బండి కోటప్పకొండ బయలు దేరింది అంటే.... ఆ ప్రభను చూడటానికైతేనేం? వెన్నంటిన జన సందోహాన్ని చూడటానికైతేనేం? అన్నింటికీ మించి పట్టు పంచ తలపాగాతో మెరిసిపోయే గుబురు మీసాల చిన్నపరెడ్డిని చూడటానికైతేనేం? జనాలు దారుల వెంబడి గుంపు గుంపులుగా చేరేవారట. చిన్నపరెడ్డి కోటప్పకొండ ప్రయాణాన్ని మరో వారం పది రోజుల వరకు కథలు కథలుగా చెప్పుకునే వారట. 

శివరాత్రి సందర్బంగా గ్రామంలో యువకులకు ఎడ్ల పందేల పోటీలు, కుస్తీ పోటీలు, కర్రసాము, మొదలగు పోటీలు కూడా చిన్నపరెడ్డి సమక్షంలో కొనసాగేవి. గెలుపొందిన వాళ్ళతో పాటుగా పాల్గొన్న అందరికి ప్రోత్సాహక బహుమతులు ఉండేవి. ఇట్లా కూడా చిన్నపరెడ్డి యువతను ఆకట్టుకున్నాడు. అట్లాగే కోటప్పకొండ ప్రాంతంలో శివరాత్రి మహోత్సవాల సందర్బంగా సూదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని స్వంత ఖర్చులతో భోజన సదుపాయం, వసతి సదుపాయాలు ఏర్పాటు చేసేవాడు. చిన్నపరెడ్డి ఏర్పాటుచేసే సౌకర్యాలు దృష్ట్యా ప్రజలు నిర్భయంగా కొండను చేరుకునేవారు. ఆనోటా ఈ నోట సౌకర్యాల గురించి తెలిసి ఏటేటా
భక్తులు పెరిగేవాళ్ళు కూడా. ఇట్లా తనకు సంబంధం లేని దూర ప్రాంత ప్రజల అభిమానాన్ని కూడా చిన్నపరెడ్డి సంపాదించుకున్నాడు. ఇది కూడా పెత్తందార్లకు మింగుడు పడలేదు. 

👉చేబ్రోలు గొడవ :

1908 వ సంవత్సరం. 
అప్పటికి బ్రిటిష్ అధికారులు చిన్నపరెడ్డి మీద ఓ కన్నేసి ఉన్నారు. గ్రామాల్లో ఉన్న బ్రిటిష్ దొరల తొత్తులు చిన్నపరెడ్డి మీద మాటేసి ఉన్నారు. ఈక్రమంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా అల్లరి జరిగినా అది చిన్నపరెడ్డిమీదకి అభియోగంగా మోపబడేది.ఇట్లా చిన్నపరెడ్డిని ఇరుకుల్లో పెట్టాలని ఇట్లాంటి అభియోగాలతో అటు ప్రభుత్వం ఇటు పెత్తందార్లు ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టేవాళ్ళు కాదు. లేదంటే తామే దొంగ దెబ్బగా గొడవలు సృష్టించి ఆ నెపాన్ని చిన్నపరెడ్డి మీదకు నెట్టేవాళ్ళు. ఇటువంటి ఆరోపణల్ని చిన్నపరెడ్డి ఎప్పటికప్పుడు ఎదురించేవాడు. 

చిన్నపరెడ్డి రాటు తేలి ఉన్నాడు.పూర్తిగా ప్రజల మద్దతు పొంది ఉన్నాడు. ఇది బ్రిటిష్ దొరలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో 
చేబ్రోలులో బ్రిటిష్ సైన్యం మకాం వేసింది. చిన్నపరెడ్డిని ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రజలని హింసిస్తూ చిన్నపరెడ్డిని సాధించాలని పన్నాగం వేసింది. 
విషయం చిన్నపరెడ్డికి చేరింది. అయినా భయపడలేదు. 
ధైర్యంగా తలపాగాతో గుఱ్ఱం ఎక్కి చేబ్రోలు వీధుల్లోకి బయలుదేరాడు. రాజవీధుల్లో ఇతరులు గుర్రాలపై స్వారీ చేయరాదని, తలపాగా చుట్టరాదని, అడ్డుకుని ఆంక్షలు విధించింది. చిన్నపరెడ్డి ఈ ఆంక్షలను వ్యతిరేకిస్తూ ముందుకు సాగబోయాడు. కానీ చిన్నపరెడ్డి మీద ప్రతీకారంతో ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలెట్టింది సైన్యం. ఈ పరిస్థితిలో కేవలం ప్రజల కోసం వెనుతిరిగి రెడ్డిపాలెం వచ్చాడు చిన్నపరెడ్డి. 

కానీ అప్పటికి వృద్ధుడుగా ఉన్న చిన్నపరెడ్డి తండ్రి సుబ్బారెడ్డికి తన కొడుకు వెనుతిరిగి రావడం నచ్చలేదు. కొడుకుని తీవ్రంగా మందలించాడు. కత్తి ఇచ్చి తిరిగి చేబ్రోలు వీధుల్లోకి వెళ్ళమని ఆదేశించాడు. 

తండ్రి మాట - ప్రజల పరిస్థితి చిన్నపరెడ్డిని ఇబ్బంది పెట్టింది. ఎటూ తేల్చుకోలేక చివరకు తిరిగి చేబ్రోలు వీధుల్లోకి ఉగ్రనరసింహుడిలా అడుగుపెట్టాడు. పరిస్థితి చుస్తే పెద్ద యుద్ధమే జరిగి ప్రాణ నష్టం జరిగేట్టు ఉందని ప్రజలు గమనించారు. దీంతో ఇక ఆలస్యం చేయలేదు. గొడవ వద్దంటూ చిన్నపరెడ్డికి అడ్డుపడుతూ వేడుకున్నారు.

చిన్నపరెడ్డి ముందుకు కదలలేక నిస్సహాయుడుగా మిగిలిపోయాడు. అది బ్రిటిష్ సైన్యం తమ విజయంగా భావించింది. చిన్నపరెడ్డి ఆత్మాభిమానం 
మాత్రం గాయపడింది. 

ఇక ఆ ఏటి శివరాత్రి ఉత్సవాలకు చిన్నపరెడ్డి యధావిధిగా అట్టహాసంగా బయలుదేరి ఉన్నాడు. 
చేబ్రోలు సంఘటన తర్వాత చిన్నపరెడ్డి మీద మరింత పగ పెంచుకున్న బ్రిటిష్ సైన్యం చిన్నపరెడ్డిని అరెస్టు చేసేందుకు 150 మంది పోలీసులతో కోటప్పకొండ బయలు దేరింది. కొండను చుట్టుముట్టింది. అప్పటికి ప్రభను సమర్పించుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు చిన్నపరెడ్డి. ఎట్టకేలకు విషయం చిన్నపరెడ్డిని చేరింది. 

బండి మీద ప్రభను తీసుకు వస్తూ వెంటే గుఱ్ఱం తెచ్చుకున్న చిన్నపరెడ్డి చాకచక్యంగా పోలిసుల కళ్ళు గప్పాడు. సైన్యం దృష్టి బండి మీద ఉండగా, తన గుఱ్ఱంతో ధూళి రేపాడు. తర్వాత అదే గుర్రం మీద తెలివిగా తప్పించుకున్నాడు. 

👉కోటప్పకొండ కొండ ఘటన :

1909 ఫిబ్రవరి 18 వ తేదీ. కోటప్పకొండ వద్ద మహాశివరాత్రి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి.ఆనవాయితిగా యధావిధిగా ఎడ్ల బండ్లల్లో ప్రభలను అలంకరించుకుని కోటప్పకొండ బయలుదేరాడు చిన్నపరెడ్డి. దారుల వెంబడి జనాలు కూడా ఎప్పట్లా బారులు తీరి ఉన్నారు. అందరికి ముందుగా ఎత్తయిన ప్రభతో సాగిపోతున్న చిన్నపరెడ్డి బండి మీదే అందరి చూపులు ఉన్నాయి. అందరి ఉత్సాహం ఉత్తేజాన్ని నింపుతుండగా ఎడ్ల బండ్లు చేబ్రోలు దాటాయి. 

నాదెండ్ల గ్రామం వద్ద అనూహ్య సంఘటన ఎదురయ్యింది. పెత్తందార్ల అనుచరులుగా కొందరు గ్రామస్థులు చిన్నపరెడ్డి బండ్లను అడ్డుకుంటూ దారికి అడ్డంగా తాళ్లు కట్టి భైఠాయించారు. చిన్నపరెడ్డి బండ్లు ఆగిపోయాయి. అడ్డుతగిలిన గ్రామస్థులు చిన్నపరెడ్డిని వెనక్కి వెళ్ళమని అరవడం మొదలెట్టారు. ఇది చేబ్రోలు కాదని గుర్తు చేస్తూ మరీ అరవడం మొదలెట్టారు.అందుకు చిన్నపరెడ్డి ఎంత మాత్రం జంకలేదు. బండి దిగి, అడ్డు తగిలిన జనాలతో మంతనాలు వెళ్తున్నట్టుగా నటించాడు. అది చూసి జనాలు పక్కకు జరిగారు. ఇంకేం? అదే ఉదుటన బండి మీదకు సింగంలా లంఘించి బండిని ముందుకు ఉరికించాడు. 
దెబ్బకు తాళ్లు తెగిపోయాయి. బండెనుక బండ్లు అదే వరుసలో ముందుకు ఉరికాయి. అడ్డుతగిలిన జనాలు ఏమీ చేయలేకపోయారు.జనాలను ఉసిగొల్పిన పెత్తందార్లు మాత్రం పరిస్థితికి ఒక్కసారిగా ఖంగు తిన్నారు. 
అవకాశం వస్తే చిన్నపరెడ్డిని మట్టుపెట్టాలని లేదా కనీసంగా అవమానించాలని ఎదురుచూస్తున్న తొత్తులకు దుర్మార్గులకు ఈసారి కూడా చిన్నపరెడ్డి తీరు భంగపాటునే కలిగించింది. 

రెట్టించిన జాతర సమీపించిన చిన్నపరెడ్డి జాతరలో అదే బండిమీద తిరుగాడుతూ "వందేమాతరం - మనదే రాజ్యం " అంటూ సింహనాదం చేసాడు. అది చిన్నపరెడ్డే అని బ్రిటిష్ సైన్యానికి తెలియంది కాదు. విషయం వెంటనే కలెక్టర్ కు చేరింది. కలెక్టర్ ఆదేశాల మేరకు తిరిగి 150 మంది పోలీసులు కోటప్పకొండను చుట్టుముట్టారు. ఈ విషయం చిన్నపరెడ్డికి తెలియలేదు. పసిగట్టిన రత్తమ్మ వాయువేగంతో విషయాన్ని చిన్నపరెడ్డికి చేర్చింది. చిన్నపరెడ్డి అప్రమత్తుడయ్యాడు. తప్పించుకునే మార్గంగా గుట్టల్లోకి వెళ్ళిపోయాడు. 

అదే సమయంలో తిరునాళ్లలో తాగుబోతుల గొడవ అనుకోకుండా మొదలయ్యింది. బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్, తిమ్మారెడ్డి అనే రైతు మధ్య సారాయి దుకాణంలో అల్లరి మొదలయ్యింది. సయ్యద్ హుస్సేన్ పోలీసు కాబట్టి, మిగతా పోలీసులు తిమ్మారెడ్డిపై హంతకుడుగా అభియోగం మోపి, ఎటువంటి విచారణ లేకుండా అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించసాగారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ జనాలు పోలీసులను అనుసరించసాగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేయసాగారు. ఆవేశాన్ని ఆపుకోలేక ఒక వ్యక్తి దారిలో శేషయ్య అనే పోలీసుని కర్రతో కొట్టాడు. ఆగ్రహించిన
శేషయ్య తనను కొట్టిన వ్యక్తిని గ్రహించుకోలేని వాడై మరొక వ్యక్తిని తన వద్ద ఉన్న కత్తితో పొడిచి చంపాడు. 
ఇంకేం? పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనాలను చెదర గొట్టడానికి పోలిసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చిన్నపరెడ్డి ఎద్దు ఒకటి మరణించింది. అది చూసి ప్రజలు మరింత ఆగ్రహంతో రగిలిపోయారు. "" శివుడి సమక్షంలో శివుడి వాహనం నందీశ్వరుడిని చంపుతారా... ఇంక ఏ అరిష్టం దాపురిస్తున్నదో " అంటూ జనాలు పోలీసుల మీద తిరగబడ్డారు. పోలీసు శేషయ్యను ఎట్టకేలకు దొరకపుచ్చుకున్నారు. తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన శేషయ్యపై గడ్డి పరిచి నిప్పు పెట్టారు. అంతటితో ఆగని జనాలు పోలీసు ఠాణాకు కూడా నిప్పుపెట్టారు. పోలీసు సూపరింటెండెంట్ సుబ్బారావు అక్కడికి వచ్చేసరికి సగం ఠాణా తగలబడింది. అది చూసి సుబ్బారావు కూడా పారిపోయాడు. ప్రజలు అంతకంతకు రెచ్చిపోతూ.... కలెక్టర్ జవాన్లను కూడా గాయపర్చారు. సైనికుల గుడారాలు తగులబెట్టారు. మొత్తానికి పరిస్థితి అదుపు తప్పింది. ప్రభుత్వ ఆస్తులు నాశనం అయ్యాయి. 
నేల రక్తసిక్తం అయ్యింది. 

చిన్నపరెడ్డిపై నేరారోపణ :

అప్పటికే గుట్టల్లోకి వెళ్లిపోయిన చిన్నపరెడ్డికి ఈ మొత్తం ఘటనతో ఏ మాత్రం సంబంధం లేదు. అయినప్పటికీ జరిగిన మారణకాండ చిన్నపరెడ్డి జనాలను ఉద్దేశ్య పూర్వకంగా ప్రేరిపించడంతో జరిగింది అనే నిర్దారరణకు వచ్చారు పోలీసులు.
బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా ఇదే నివేదించారు. ప్రభుత్వం భగ్గుమంది. చిన్నపరెడ్డిని పట్టుకుని తీరాలిసిందే అని సంబంధిత అధికారులకు హెచ్చరికతో కూడిన ఆదేశాలు జారీచేసింది. 

ఇక ఆ మరుసటి రోజు 19-2-1909 నాడు -

బ్రిటిష్ తొత్తులైన గ్రామ పెద్దలను బ్రిటిష్ ప్రభుత్వం
తరుపున అధికార యంత్రాంగం హెచ్చరించింది. చిన్నపరెడ్డిని అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని భయపెట్టింది. ఈ క్రమం లో కలెక్టర్ ఆదేశం ఇవ్వడం , అందుకు సబ్ కలెక్టర్ కొంత సమయం తీసుకుని మప్పించి చిన్నపరెడ్డిని పట్టుకోవాలని సూచించడం కూడా జరిగింది. 

మొత్తానికి తమ అధికారాలకు ఆస్తులకు భంగం కలుగుతుందని భయపడిన ఆ పెద్దలు ఆగమేఘాలమీద తమ తొత్తులైన ప్రజలను ఏకం చేసారు. పకడ్బందీగా వ్యూహరచన చేశారు. ఈ నేపథ్యంలో వేగుగా పనిచేసే రత్తమ్మ మూడో కంటికి కూడా దొరకకుండా..... చిన్నపరెడ్డి గుర్రాల కంట పడకుండా.....వెన్నంటే అనుచరులకు అభిమానించే జనాలకు అనుమానం రాకుండా.... చిన్నపరెడ్డిని పట్టుకోవాలి అనేది వ్యూహం. ఈ ప్రకారం 
ప్రతికూల గ్రామస్తులు అనుకూలం నటిస్తూ చిన్నపరెడ్డి పక్షం చేరారు. ఈ క్రమంలో తమకు తాము అల్లర్లు సృష్టించుకుని చిన్నపరెడ్డి వర్గాన్ని నమ్మించారు.. కానీ వాళ్ళెవరికీ చిన్నపరెడ్డి ఆచూకీ దొరకలేదు.అట్లాంటివి జరగొచ్చు అనే జాగ్రత్తలో చిన్నపరెడ్డి ఉన్నాడు. 

👉వీరుడి ఉరి 
 
కోటప్పకొండ అల్లర్లకు సంబందించి చిన్నపరెడ్డితో పాటుగా 100 మంది అనుచరులపై గుంటూరు అదనపు సెక్షన్ న్యాయస్థానంలో క్రిమినల్ కేసు నెం 
27/1909 కింద కేసు నమోదు చేయబడింది. కాగా ఈ విషయమై భారతదేశానికి అనుకూలంగా ఉన్న కొందరు విముఖం వహించారు. 

ఐషర్ కార్షన్ అనే న్యాయవాది 21 మందికి ఉరిశిక్ష విధించాడు. 24 మందికి కఠిన కారాగారా శిక్షలు విధించాడు. మిగతావారికి సాధారణ శిక్షలు విధించాడు. 

కాగా చిన్నపరెడ్డి తాము నిరపరాధులం అంటూ మద్రాసు హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. 
 17/1910 అనేది విచారణ నంబరు. . న్యాయమూర్తులుగా శ్రీమున్, శంకర్ నాయర్ లు ఉన్నారు. విచారణ జరిగింది. 

ముద్దాయి తరుపున స్వామినాధన్, ప్రభుత్వం తరుపున రిచ్ మాండ్, వాదోపవాదాలు జరిపారు. 

1910 ఆగస్టు 18 న మద్రాసు హైకోర్టు చిన్నపరెడ్డికి ఉరిశిక్ష విధించింది. 

చిన్నపరెడ్డి పారిపోయే ప్రయత్నం చేయలేదు. తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. తనను దొంగ దెబ్బ తీసి పట్టుకోవాలి అనుకున్న వాళ్లకు తలఎత్తి పొగరు చూపాడు. స్వచ్ఛందంగా లొంగిపోయాడు. 

వేల జనాలు దిక్కులు పిక్కటిల్లేట్టుగా రోదిస్తుంటే...
న్యాయం ధర్మం అనాథలై ఆ కన్నీళ్ళలో ప్రవహిస్తుంటే....  
1910 లోనే వీరుడిని చిన్నపరెడ్డిని ఉరితీస్తూ ఎదురు తిరిగే మిగతా పాలెగాళ్లను ప్రభుత్వం హెచ్చరిక చేసింది. 

చిన్నపరెడ్డిని ఉరి తీసిన తేదీ కోసం వంశస్థులు ఇప్పుడు అన్వేషణ చేస్తున్నారు.

👉చిన్నపరెడ్డి సంతానం :

చిన్నపరెడ్డికి సంతానం లేదు. అన్నదమ్ముళ్ల పిల్లలే వంశస్తులుగా వెలుగొందుతున్నారు. 

👉జానపదగాథలు :

సైరా చిన్నపరెడ్డి 
సై సైరా చిన్నపరెడ్డి 
నీ పేరే బంగారుకడ్డీ 
పుట్టింది రెడ్డిపాలెములో 
పెరిగింది చేబ్రోలున రెడ్డీ.... ""సైరా ""

చిన్నపరెడ్డి మాటలాకు 
చుట్టూనొక పన్నెండామడ 
నిప్పులేక మండిస్తివి రెడ్డీ 
చుట్టును యొక్క నాలుగామడ 
బందిపోటు కొట్టిస్తివి రెడ్డీ..... ""సైరా ""

చిన్నపరెడ్డి ఎక్కే అశ్వానికి 
నాలుగు భాషలు నేర్పినావురా 
చేబ్రోలు నడివీధిలో నిలిచి 
కమ్మవారితో 
ఏమనిరెడ్డీ పలికినావయ... ""సైరా ""

చిలుకలా తలగుడ్డ చుట్టి 
గోరంచు పంచెను గట్టి 
ఏడాది ఒక్క దినంబు 
కోటప్పకొండ వెళ్ళడానికి 
బండిని ప్రభనుగా తయారుజేసే 
ఏభై ముళ్ళా ప్రభను గట్టే 
నాలుగు గాండ్ల ఎద్దులు గట్టే... ""సైరా ""

అంటూ....మరణం తర్వాత కూడా జనాలు చిన్నపరెడ్డిని మరిచిపోలేదు. పాటలుగా పాడుకుంటూ చిన్నపరెడ్డి తమ మధ్యనే జీవిస్తున్నట్టుగా పాటల్లో వెదుక్కోవడం మొదలెట్టారు.  
 చిన్నపరెడ్డి వీరత్వపు కథలను బుడిగజంగాలు, పెద్దింటి గొల్లలు, గుర్రాలు ఆడించేవాళ్ళు , తదితర జానపదులు తమ పాటల్లో నేటికిని స్మరించుకోవడం గుంటూరు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. కోలాటాల పాటల్లో, వరి నార్లల్లో, వినిపించే చిన్నపరెడ్డి పాటలు రాగయుక్తమైనవి. వివిధ బాణీల్లో వివిధ కథాంశాలుగా 
మౌఖిక సాహిత్యంగా వినిపించే చిన్నపరెడ్డి పాటల్ని సమగ్రంగా సేకరించి గ్రంథరూపం తేవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రేడియో కళాకారుడు సి. పుల్లయ్య చిన్నపరెడ్డి బుర్రకథను జన బాహుళ్యంలోకి తీసుకువచ్చాడు. 

👉రగిలిన భారతం 

చిన్నపరెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిన తర్వాత స్వతంత్ర్యోద్యమ జ్వాలలు జనాల్లో మరింత పెరిగాయి. ఆవేశం అగ్గి బరాటాలా వెలిగింది. కాంక్ష భగభగ మండింది. 

నిరసన జ్వాలలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. ఇందులో భాగంగా ముట్నూరి కృష్ణారావు తన ఆధ్వర్యంలో నడుస్తున్న కృష్ణాపత్రికను నిలిపివేశాడు. అందుకు ఆరు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు. 

తెల్లదొరలని దేశం నుండి తరిమి కొట్టేవరకు.... దొరల తాబేదార్లను ఊర్ల నుండి వెలివేసేవరకు.....నిద్ర పోలేమనే శపథాలు ఊరూరున వినిపించాయి. 

ఇది చిన్నపరెడ్డి కథ..... 
జనం కోసం ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగిన వీరుడి గాథ..... 
ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు అని నిరూపించిన మహాయోధుడి గాథ !
జయహో.... 
సై సైరా చిన్నపరెడ్డి !!
____________________________________________
ఆధారం : 
చిన్నపరెడ్డి వంశస్తులు గాదె వెంకటసుబ్బారెడ్డి కొత్తరెడ్డిపాలెం గారి నుండి విషయ సేకరణ చేయడం జరిగింది. సెల్ : 8885812375

No comments:

Post a Comment