Tuesday, April 16, 2024

జయధీర్ తిరుమలరావ్ ( జానపద పరిశోధకుడు )


జయధీర్ తిరుమలరావు
( జానపద పరిశోధకుడు, )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

రేపల్లె తిరుమలరావు.....
అతడే 
జయధీర్ తిరుమలరావు

జానపద సాహిత్యాన్ని గుండె చప్పుడై వినిపిస్తున్నాడు ....
జానపదాల సేకరణ కోసం చెమటలు చిందిస్తున్నాడు.....
జానపదాలు....
జానపద వాయిద్యాలు....
జానపదుల సంస్కృతి....
వీటిని కాపాడటం కోసం తన జీవితాన్నే ధారపోస్తున్నాడు.
▪️నాలుగు దశాబ్దాల కృషి

జానపదం మౌలిక పరిశోధన కోసం అతను తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో,గిరిజన ప్రాంతాల్లో, కొండల్లో కోనల్లో, తండాల్లో పెంటల్లో గూడాల్లో అవిశ్రాంతంగా తిరుగుతున్నాడు. భావి తరాలకు ప్రాచీన పరిజ్ఞానాన్ని సేకరించి పెడుతున్నాడు. వీరి శ్రమకు పట్టుదలకు స్వయంకృషికి పద్మశ్రీ ఎప్పుడో రావలసింది. కానీ
వీరి కష్టం పద్మశ్రీ కమిటీలకి కనిపించకపోవడం శోచనీయం అనుకుందామా? నిర్లక్ష్యం అనివార్యం అనుకుందామా?

వెనుకబడిన కులాలు, ఉపకులాలు,నిర్లక్ష్యానికి గురైన వారి బతుకులు, ఎవ్వరూ పట్టించుకోని వారి సంస్కృతి సాహిత్యం కళలు, వీటి ఆనవాళ్ళను తిరుమలరావు శ్రమకోర్చి సేకరించాడు. భద్రపరిచాడు. ప్రాచీన గిరిజన సంగీత వాద్యాల సేకరణ కోసం, వారి సామజిక జీవితంలో భాగమైన విశ్వాసాలు ఆచార వ్యవహారాలు రికార్డు చేయడం కోసం, గత నలభై ఏండ్ల నుండి అలుపెరుగని పర్యటనలు చేస్తున్నాడు..

ఈ క్రమంలో అట్టడుగు ఉపకులాల నుంచి తాను కష్టపడి సేకరించిన సామాజిక సాంస్కృతిక కళాఖండాలతో 2017 లో ఒక ప్రదర్శన నిర్వహించారు.

అట్లాగే తన కృషి ఫలించి మరుగున పడిపోతున్న వాద్యలను 2000 వరకు సేకరించి, వాటితో 2020లో ' ఆదిధ్వని - ఆద్యకళ ' పేరుతో గిరిజన జానపద సంగీత వాద్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు.


 అంతేకాదు , నిజాం పరిపాలనా కాలంలో నిషేధానికి గురైన సాహిత్యం మీద పరిశోధన గ్రంథాన్ని రాయడం కోసం ఢిల్లీ , చెన్నై, పాండిచ్చేరి మొదలగు ప్రాంతాల్లో ప్రాచీన గ్రంధాలయాలు పర్యటించాడు. 

▪️కిన్నెర చరిత్ర -
తిరుమలరావు పరిశోధన

కిన్నెర ఎవ్వరిది?
దళితులదా ?
ఆదివాసీలదా?

ఈ అంశంపై విస్తృతంగా పరిశోధనలు అనంతరం ‘‘ఆదివాసీల నుంచి దళితులకు అందిన వాయిద్యం... కిన్నెర... " అని తేల్చి చెప్పారు.

ప్రస్తుతం గోండు ఆదివాసీలు ' జతుర్ ' పేరుతో కిన్నెర వాయిస్తున్నారు.చెంచులు వద్ద కూడా కిన్నెర ఉంది. కానీ ప్రస్తుతం చెంచుల నుంచి కిన్నెర పూర్తిగా దూరం అయింది.
మాదిగల్లో ఆశ్రిత కులం డక్కలి కులస్తులు కిన్నెర వాయిస్తున్నారు.

కిన్నెర 4 వ శతాబ్ది నుండి మనుగడలో ఉన్నది. ఇందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. కిన్నెర మెట్ల మీద చెంచులు మల్హరీ రాగం వాయిస్తారు. అ చెంచులు 13 మెట్ల కిన్నెర వాయిస్తారు.

No comments:

Post a Comment