Tuesday, April 16, 2024

మార్చాలా రామాచారి ( చిత్రకారుడు )

మార్చాల రామాచారి
(కవి , సజీవ చిత్రాల చిత్రకారుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాస కూర్పు : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

వెయ్యేళ్ళు వర్ధిల్లడం అంటే ఇదే....
కళ....కలకాలం నిలవడం అంటే ఇదే....
ప్రతిభ....పది కాలాలు పట్టం కట్టు కోవడం అంటే ఇదే.....
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మార్చాల రామాచారి !
అద్భుత అద్వితీయ చిత్రకారుడు..! 
తన బొమ్మలతో దిగ్గజాలను మెప్పించిన చరితార్థుడు!
మీసాల కృష్ణుడి కుంచెకారుడు

▪️వివరాల్లోకి వెళ్తే.....

పూర్వ పాలమూరు కల్వకూర్తి దగ్గర మార్చాలా గ్రామ వాస్తవ్యులు రామాచారి. వీరు 1899 ప్రాంతంలో జన్మించారు. శ్రీనివాసాచార్యులు సోమిదేవమ్మ వీరి తల్లిదండ్రులు. వీరు కారంపూడి వంశస్తులు. కానీ గ్రామ నామంతో ప్రసిద్దులు అయ్యారు. రామాచారి పూర్వికులు తమిళనాడులోని గండికోట నుండి 300 సంవత్సరాల క్రితం పాలమూరు ప్రాంతానిమికి వలస వచ్చారు. మొదట తిమ్మాజిపేటలో నివాసం ఉన్నారు.తర్వాత వారి తాతగారు రంగాచార్యుల హయాంలోనే మార్చాలకు వచ్చి , అక్కడ ఆలయ పూజారులుగా స్థిరపడ్డారు.

▪️సకల కళాకోవిదుడు రామాచారి

పుట్టుకతో రామాచారి వారు బ్రాహ్మణులు. అయినప్పటికీ రామాచారి వారు వివిధ పనుల్లో నైపుణ్యం సాధించారు. కుల వృత్తుల వారికి ఏమాత్రం తీసిపోకుండా సకల వృత్తి పనుల్లో ఆరితేరారు. కమ్మరి పని , కుమ్మరి పని , తీవాచిలు అల్లడం, సిరిచాపలు అల్లడం , మగ్గం పని, చెప్పులు కుట్టడం, వ్యవసాయం వంటి మొదలగు పనుల్లో తన పనితనాన్ని నిరూపించుకున్నారు. తన చెప్పులు తానే కుట్టుకోవడం , తన బట్టలు తానే నేసుకోవడం, చేసేవాడు. వీరు వాస్తుశిల్పి కూడా. తాను నివసించాల్సిన ఇంటికి తానే రూపకల్పన చేసుకుని ఇల్లు కట్టించుకున్నాడు. 

ఈ అన్నీ పనులతో పాటుగా చిత్రలేఖనం కొనసాగించాడు. అసాధారణ ప్రతిభ కనబర్చాడు.

తీవాచిలు అల్లడంలో మంచి నేర్పరిగా ఉన్న రమాచారి గారు, వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలకు తీవాచిలు తయారుచేయడంలో మెళకువలు నేర్పించాడు.

చిత్రాలు గీయడంలోనే కాదు తీయడంలో కూడా రామాచారి గారు మంచి నిపుణులు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే బెస్ట్ ఫోటో గ్రాఫర్. ఈ కళను తన జీవనోపాధికి ఉపయోగించుకుంటూ పాలమూరులో కొన్నాళ్ళు ఫోటో స్టూడియో నడిపారు. ఈ క్రమంలో రామాచారిలో అత్యంత అరుదైన కళ గురించి మాట్లాడితే.... ఫోటోలు తీయడం కోసం అతడు స్వయంగా కెమెరా ఒకటి తయారు చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు.

▪️సురవరం వారి సహచరుడుగా.....
     బాపిరాజు సహభ్యాసకుడిగా......

సురవరం ప్రతాపరెడ్డితో రామాచారి గారికి మంచి స్నేహపూర్వక సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. రామాచారిలో ఉన్న కళ తో పాటుగా, అణుకువ సౌమ్యత సురవరం వారిని బాగా ఆకట్టుకున్నాయి.అందుకే రామాచారిలో ఉన్న చిత్రకళకు మరింత పదును పెట్టాలని సంకల్పిస్తూ..... రామాచారిని బందరు ఆర్ట్స్ కళాశాలలో చేరడానికి ప్రోత్సాహం అందించారు.

బందరు కళాశాలలో చిత్రకారులు అడవి బాపురాజు, గుర్రం మల్లయ్య గార్లు తోటి విద్యార్థులుగా వున్నారు 

▪️మీసాల కృష్ణుడి రూపశిల్పి

సురవరం వారి గోలుకొండ పత్రికాఫీసులో మీసాల కృష్ణుడి చిత్రం ఒకటి వేలాడదీసి ఉండేది.ఈ చిత్రం చరిత్రలో భాగంగా కొనసాగుతున్నది. రామాచారి ప్రతిభ తెలిసిన సురవరం వారు , ఆ చిత్రాన్ని ప్రత్యేకంగా రామాచారి చేత గీయించారు. సురవరం వారి ఆలోచన ప్రకారం మీసాలు లేకుడా కృష్ణుడు కనబడటం ఇష్టం లేదు. పౌరుషానికి యుద్ధతాంత్రానికి ప్రతీక అయిన కృష్ణుడు మీసాలతో ఉండాలి అనేది సురవరం వారి తలంపు. అందుకే రామాచారి చేత తనకు నచ్చిన విధంగా గీయించుకున్నాడు.

▪️గోలుకొండ కవుల సంచికలో

సురవరం ప్రతాపరెడ్డి వారు 1934 వ సంవత్సరంలో 354 మంది కవులతో ప్రకటించిన గోలుకొండ కవుల సంచికలో రామాచారి వారి కవిత 39 వ స్థానంలో ప్రార్థనము శీర్షిక కింద ప్రచురింపబడింది.

శా . శ్రీమంతంబున జెన్ను మీరుధరణీ సీమంతినీభూషణ గ్రామంబౌ మధురాపురంబున దివౌకవ్యూహ సంప్రార్థనన్ భూమేల్ జూప జనించినట్టి కరుణాభూషుండు కృష్ణుండొగిన్ ధామైశ్వర్య సుఖాదికంబొసగి ప్రోచున్ గాత నెల్లప్పుడున్

గీ .భవ్యబృందావనారణ్య భూరుహాళి సాంద్రతరునీడలందు సుశ్రావ్యమహిత
నవసుధారస కలిత మాధుర్య వేణు
గాన మొనరించ గోవులు గ్రాసముడిగి
యే మహాదివ్యమూర్తిని నెలమిగాంచు
నట్టికృష్ణుని సేవింతు ననుదినంబు

మ.కడుమౌగ్యంబున నివ్వటిల్లుపడతుల్ గాసిల్లి నిద్రించగా నడురేయొయ్యన వారి జేరికినుకన్ దద్వేణిబంధంబులన్ వడిలే దూడల దోకలన్ బిగిచి యాహ్లాదించి మోదించు నా తడుగృష్ణుండుకృపామతిన్ గనుటకై ధ్యానింతునశ్రాంతమున్

ఇవి రామాచార్యులుగారి పద్యములు. వీరి కవితలు ఇంకా ఎన్నో ఆముద్రితములుగా మిగిలిపోవడం బాధాకరం.

▪️పత్రికలు ఆదరించిన చిత్రాలు : 

సుజాత , గోలుకొండ పత్రికలో చాలా వరకు వీరి చిత్రాలు ప్రచురింపబడ్డాయి.

▪️రామాచారి గారి ప్రముఖ చిత్రాలు : 
     దివిటపల్లి ఆలయంలో చిత్రాలు : 

రామాచారి చిత్రాలు అన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతాయి. భక్తి , పురాణ పరిజ్ఞానం , వీరిలో జీవనదిలా ప్రవహిస్తూ సజీవ చిత్ర రాజాలకు ఊతం అందించింది. వివరాలు ---

సురవరం ప్రతాపరెడ్డి గారి గోలుకొండ కవుల సంచిక ముఖచిత్రం " వీణాపాణి సరస్వతి " అమ్మవారి చిత్రం

గోలుకొండ పత్రికా కార్యాలయానికి వన్నె తెచ్చిన చారిత్రక మీసాలకృష్ణుడు చిత్రం.

శ్రీరామ పట్టాభిషేకం చిత్రం
విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రాలు

దివిటిపల్లి గ్రామంలో బీంసేన్ రావు అనే ఒక భక్తుడు 1940 - 50 ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించాడు. ఈ దేవాలయంలో బీంసేన్ రావు ఆహ్వానం మేరకి రామాచారి గీసిన చిత్రాలు ఆ తరం భక్తులను అలరించాయి. వీటిలో మీరాబాయి, గీతోపదేశం, సీతారాముల పర్ణశాల, పార్వతి పరమేశ్వరులు, బ్రహ్మదేవుడు ఉన్నారు. కాగా కాలక్రమంలో వర్ణ చిత్రాలు రంగు వెలసిపోయాయి. అంజనేయ భక్తులు 1990 వ సంవత్సరంలో పాత చిత్రాల స్థానంలో కొత్త చిత్రాలు గీయించారు. ఈ కారణంగా రామాచారి చిత్రాలు కనుమరుగు అయ్యాయి. ఒక్క సీతారాముల పర్ణశాల మాత్రం నేటికిని ఉన్నట్టుగా తెలుస్తున్నది.

▪️పరిశోధకుల నిర్లక్ష్యం

సురవరం వారి గురించి , వారి గోలుకొండ పత్రిక గురించి చాలా పరిశోధకులు వెలువడ్డాయి. సురవరం వారి సమగ్ర వివరాలు అందించిన పరిశోధకులు, రామాచారి గురించి మాత్రం నిర్లక్ష్యం వహించారు అని చెప్పవచ్చు. గోలుకొండ పత్రికకు తన చిత్రాలతో ప్రాణం పోసిన రామాచారి చిరస్మరణీయుడు.

▪️చారిత్రక పొరపాటు

సురవరం 
▪️రామాచారి కుటుంబం

రామాచారి గారి సతీమణి కృష్ణవేణి. వీరికి మొత్తం 10 మంది సంతానం. ఆరుగురు కూతుళ్లు, ఐదుగురు
కుమారులు.
----రంగనాయకమ్మ, వెంకటలక్ష్మమ్మ, జానకమ్మ, సుజాత, సౌభాగ్యలక్ష్మి, లీలమ్మ.
----- శ్రీనివాసాచారి, నరసింహాచారి, రాఘవాచారి, శేషాచారి.

▪️సురవరం కూతురు సరోజనమ్మ ఔన్నత్యం

సురవరం ప్రతాపరెడ్డి గారి కూతురు సరోజనమ్మ. రామాచారి గీసిన మీసాల కృష్ణుడు బొమ్మను, తండ్రి తదనంతరం జాగ్రత్తగా భద్రపరిచి చరిత్రకు అపురూప అద్వితీయ ఆనవాలు అందించింది. వీరి స్వంత గ్రామం గంగపురం. సరోజనమ్మ అక్కడే నివసించేది. మీసాల కృష్ణుడిని ఇంట్లో దేవుడి పటాల మధ్య ఉంచి నిత్యం పూజించేది. ప్రస్తుతం ప్రస్తుతం వీరు కాలం చేశారు. కాబట్టి వీరి కూతురు ప్రవీణ మీసాల కృష్ణుడిని తనదైన బాధ్యతగా తన తాతగారి గుర్తుగా భద్రపరిచి ఉన్నది.

▪️రామాచారి వైకుంఠాధన

అతిసామాన్య జీవితం గడిపిన రామాచారి గారి 1974 లో తన 75 వ ఏటా కాల ధర్మం చెందారు. వారు లేకపోయినా వారి చిత్రాల ద్వారా తరతరాలు ఖ్యాతియై వర్ధిల్లుతూనే ఉన్నాడు.

ఎందరో మహానుభావులు
అందరికి వందనాలు
---------------------------------------------------------------------
ఆధారం : పాలమూరు పత్రిక 
              వ్యాసకర్త :గుండోజు యాదగిరి

No comments:

Post a Comment