Tuesday, April 16, 2024

జోలెపాళ్యం మంగమ్మ(ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్‌....

జోలెపాళ్యం మంగమ్మ
(ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్‌.... ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వ్యాసం
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

స్వరమే వరమైన వేళ...
వరమే వార్తయిన వేళ....

"ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నది జోలిపాళ్యం మంగమ్మ” అంటూ ఆనాటి తెలుగు శ్రోతలకు వార్తలు వినిపించిన సుపరిచిత స్వర నీరాజనం జోలిపాళ్యం మంగమ్మ..! వ్యాఖ్యాతగా రచయితగా పరిశోధకురాలిగా సమాజ సేవకురాలిగా ప్రతిభావంతమైన ఆమె జీవన ప్రస్థానం స్ఫూర్తిదాయకమైనది..

▪️వివరాల్లోకి వెళ్తే....

//జననం :

ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ గా ప్రసిద్ధురాలయిన జోలెపాళ్యం మంగమ్మ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపురి అని పిలువబడే మదనపల్లెలో జే లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు ఆరుమంది సంతానంలో రెండవ సంతానంగా 
1925 సెప్టెంబర్‌ 12న జన్మించారు.

// విద్యాభ్యాసం :

ఓనమాలు నేర్చుకునే వయసులో అమ్మినేని వీధిలో గుడి దగ్గర వున్న వీధి బడికి అన్నతో బాటు వెళ్లటం నేర్చుకుంది..
ఇండియన్ బ్రిటిష్ ప్రెసిడెన్షి పాఠశాల హోప్ హైస్కూల్ లో, థియోసాఫికల్ స్కూల్ లో 
పదవ తరగతి వరకు చదువుకున్నారు.
స్థానిక బి.టి.కళాశాలలో ఇంటర్, డిగ్రీ, చదివారు. తర్వాత గుంటూరు బ్రాడీపేటలో హాస్టల్ లో వుంటూ సెయింట్ జోసెఫ్ కళాశాలలో బి.ఎడ్ పూర్తి చేసారు.best student of the year’ పతకం తీసుకున్నారు...బి.ఎడ్ పూర్తి అయిన వెంటనే మంగమ్మ ప్రతిభను గుర్తించిన కళాశాల యాజమాన్యం గుంటూరులోని “ secondary grade training school “ లో హెడ్ మిస్ట్రెస్ గా ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు మంగమ్మ వయసు 22 ఏళ్ళు మాత్రమే. వయసుకు మించిన తెలివితేటలతో
 తన బాధ్యతని విజయవంతంగా కానించింది. తర్వాత మద్రాసు రాష్ట్రం తిరువూరు ఇండియన్ బెనారస్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తిచేశారు.1963లో న్యూఢిల్లీ విశ్వవిద్యాలయంలో బర్ ప్రింటింగ్ ఇన్ ఇండియా అనే అంశంపై పరిశోధన
చేసి డాక్టరేట్ పట్టాను పొందారు .

//క్రీడాస్ఫూర్తి :

 బీటీ కళాశాలలో చదువుకునే సమయంలో పురుషులతో సమానంగా క్రికెట్ క్రీడాకారణిగా
 అందరి మన్ననలు అందుకుంది.

//భాషాప్రావీణ్యం//

తెలుగు, ఇంగ్లీషు, తమిళ, హిందీ భాషలతో పాటుగా ఫ్రెంచ్, ఎస్పెరాంటో భాషల్లో ప్రావీణ్యం ఉంది.
ఎస్పెరాంటో అనేది అంతర్జాతీయ భాష.ఈ భాషలో 28 అక్షరాలుంటాయి. దీనిని 1887 లో లుడ్విగ్ లజారస్ జామెన్ హాఫ్ కనుగొన్నారు . ప్రస్తుతము 20 లక్షల మందికి పైగా ఈ భాషను మాట్లాడుతున్నారు. ఇది అన్ని భాషలకన్నా సులభంగా ఉంటుంది. ఈ భాషను మాట్లాడేవారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్నారు. ఈ భాష రాయటానికి ఆల్ఫాబెట్స్ వాడుతారు.

▪️బోధనా రంగంలో 

విద్యావేత్త జి.వి. సుబ్బారావు , జిడ్డు కృష్ణమూర్తి గార్లు ‘రిషి వాలీ స్కూల్’ ప్రారంభించారు.1948- 49 సంవత్సరాల్లో మంగమ్మ ఈ పాఠశాలలో పనిచేసింది .

తర్వాత మద్రాస్ లో జి.వి. సుబ్బారావు కొంతమంది టీచర్స్ కలిసి ‘బాలభారత్’ స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఈ స్కూల్లో మంగమ్మ మొత్తం సబ్జెక్టులు చెప్పే టీచర్గా కొంతకాలం పని చేసింది..
రిషి వాలీ స్కూల్’ స్కూల్లో పనిచేస్తున్న సమయంలో హిందీ ‘మధ్యమ’ పరీక్ష ఉత్తీర్ణత సాధించింది. బాల భారత్ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు తమిళం నేర్చుకుంది.

పల్లెల్లోనే పని చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో 
గాంధీజీ ప్రవేశపెట్టిన '‘వార్ధా బేసిక్ ఎడుకేషన్ ట్రైనింగ్ స్కూల్స్ " అప్పట్లో అంకితభావంతో పనిచేసేవి. ఖమ్మం దగ్గర ‘తిరువూరు’ లో ప్రారంభమైన ఈ ట్రైనింగ్ స్కూల్లో టీచర్ గా చేరి హాస్టల్ ఇంచార్జ్ గా కూడా కొంత కాలం పనిచేసారు. ఇక్కడ సుమారు పదేళ్లు పనిచేశారు మంగమ్మ.

▪️ స్వాతంత్రోద్యమ సమరంలో..

 మద్రాస్ బాలభారతి పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో స్త్రీ ఆర్థిక ఆవలంబన, కష్టపడే తత్వం , శ్రమైక జీవనం, స్వయం ఉపాధిపై పేదలలో చైతన్యం
కల్పించారు. అదే సమయంలో దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్ముడి పిలుపు అందుకుని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నది. స్వాతంత్రం ఆవశ్యకతను వివరించి, తోటి స్త్రీలను జాతీయ భావాల వైపు మళ్ళించి తన వెంట నడిపించుకున్నది.

▪️రచనలు - 

రచనలు పరిశోధనలు ఆమెకు వ్యాపకం మాత్రమే కాదు.. ఒక జిజ్ఞాస కూడా.ఆసక్తితో తీరని దాహంతో
ఇంగ్లీషు, తెలుగు భాషలలో పలు పుస్తకాలను రచించారు. తన రచనలతో సమాజాన్ని ప్రభావితం చేశారు.

//తెలుగు రచనలు//

1 )ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, మొదలగు వారపత్రికల్లో వ్యాసాలు రాశారు
బద్రినాథ్, హిమాలయాల గురించి kood3 వ్యాసాలు
రాసారు 

2).శ్రీ అరవిందులు; నేషనల్ బుక్ ట్రస్ట్; న్యూఢిల్లీ; 1973

3).భారత పార్లమెంటు (సమాచార మంత్రిత్వ శాఖ)

4).విప్లవవీరుడు అల్లూరిసీతారామరాజు
(Telugu version) ; విశాలాంధ్ర పుబ్లిషింగ్ హౌస్ హైదరాబాదు; 1985

5).ఆంధ్రదేశంలో క్రైస్తవ మిషనరీల సేవ; తెలుగు అకాడమి, 1992.

 6)తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు
 (1746-1856)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; హైదరాబాదు; 2001

7)ఆంధ్రగీర్వాణఛ్ఛందము – సి. పి. బ్రౌన్ తెలుగు భాషాకు చేసిన సేవ; పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; హైదరాబాదు, 2007.

8)పాలెగాళ్లు 
 తెలుగు అకాడమి ప్రచురణ ; 2012

9)అనిబీసెంట్‌

10 )పందొమ్మిది వందల యాబది యేడు

11 ) స్టేషనుకు రండి ( కథ )
 మదనపల్లె రచయితల కథా సంకలనంలో ఈ కథ ప్రచురించబడింది.

//ఇంగ్లీషు రచనలు //

1) Book printing in India:with special reference to the contribution of European scholars to Telugu, 1746-1857

2 ) Alluri Sitarama Raju; A.P. State Archives, Hyderabad; 1983

3)Technical and agricultural education : a study of Madras Presidency; Kumar Publishing House; Delhi; 1990.

4. Last Palegar Encounter with the British in the Seeded Districts of Andhra Pradesh, 1846-1847

5. The Rate Schools 
( Thomas Munro మద్రాస్‍కు గవర్నర్ గా ఉన్నప్పుడు , సెకండరీ ఎడ్యుకేషన్ మొదలుపెట్టినారు. వాళ్ళు స్కూల్లో కొన్ని ప్రింటెడ్ పుస్తకాలు బోధన కోసం ఉపయోగించే వాళ్ళు . ఆ ప్రింటెడ్ పుస్తకాలు ఎప్పుడు మొదలయ్యాయి అనే ఆసక్తితో రిసర్చ్ చేసి, Book printing in India అనే పుస్తకం తయారుచేశారు.. ఆ విధంగా రేట్ స్కూల్స్ పుస్తకం రాసింది )

6. The Historical Papers (Sekhar Pathippagam), Chennai 2009.

7) 1857

▪️పరిశోధనలు :

చరిత్ర పరిశోధనలు అంటే ఆమెకు అత్యంత మక్కువ. చరిత్ర ఆమెకు హృదయ స్పందన వంటిది. 1962 నుండి నేషనల్ ఆర్కీవ్స్, ఢిల్లీలో పరిశోధనలు చేశారు . తన పరిశోధనల్లో భాగంగా దేశంలో అనేక గ్రంథాలయాలను సందర్శించారు అనేక శాసనాలను పరిశీలించారు.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పరిశోధన చేస్తున్నప్పుడు క్షేత్ర పర్యటనలు చేసింది. సంబంధిత ప్రాంతాలు పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడింది చారిత్రక ప్రదేశాలను పరిశీలించింది.
చరిత్ర పరిశోధనలకు సంబందించి రూపొందించిన 30 వ్యాసాలను ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో సమర్పణ చేసింది.. 

▪️ తన పరిశోధన గురించి తన మాటల్లోనే....

 ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మా బులిటెన్ పొద్దున్న ఏడింటికి. అందుకని పొద్దున ఐదుకల్లా వెళ్ళాలి. ఐదుకు వెళ్ళాలంటే, ఏ నాలుక్కో లేచి, తయారై బయలుదేరేదాన్ని. కార్ వచ్చేది, మా కోసం. వెళ్ళగానే మెటిరియల్ ఇచ్చేవారు. దాన్ని చూసుకొని వార్తలు రాసుకోవాలి. ఇలా రాసుకోడానికి రెండు గంటలు పడుతుంది. ఏడింటికి స్టూడియోకి వెళ్ళి, వార్తలు చదవటం. 7:15 కల్లా అయ్యిపోతుది. మళ్ళీ పన్నెండింటి వరకూ పని లేదు. అంటే, ఏడున్నర నుండి పన్నెండున్నర లేక ఒంటిగంట వరకూ నేను ఖాళీయే.

ఆ లీజరు టైమ్‍లో నేను నేషనల్ ఆర్కైవ్స్ కు వెళ్ళేదాన్ని. అది దారిలోనే ఉండేది. అందుకే నడిచే వెళ్ళేదాన్ని. ఢిల్లీలో అంతా, వీథుల్లో నడిచేది ఎవరూ అంటే నన్ను చూపిస్తారు. (నవ్వుతూ) ప్రతీ రోజూ ఉదయం 8:45 కల్లా ఆర్కైవ్స్ కు వెళ్ళేదాన్ని, అప్పటికి అక్కడ వాళ్ళు తుడుస్తూ, ఊడుస్తూ ఉంటారు. వాళ్ళకి తెల్సు, నేను ముందే వచ్చేస్తాననీ, నా రిసెర్చి వర్క్ మొదలెడతాననీ! కనుక రిసర్చ్ రూం తెరిచి పెట్టేవారు. నేను వెళ్ళి కూర్చుంటాను. రికార్డ్స్ అన్నీ ఉంటాయి. టేబుల్ మీద ఆ పక్కన కొన్ని రికార్డ్స్ పెట్టేస్తాను, ఈ సైడ్ నేను వర్క్ చేస్తూ ఉంటాను. అక్కడెందుకు పెడతానంటే, ఇంకొకరు వచ్చి కూర్చుంటారు కద? ఇంకెవ్వరూ రాకూడదు. ఎందుకంటే disturbance.. “hello, how’re you?” అని ఏమో మాట్లాడాలి , అందుకని నా పుస్తకాలు, ఆ రికార్డ్స్ కొన్ని ఆ పక్క పెట్టేస్తాను, అపుడు ఎవరో ఉన్నారనుకొని ఆ టేబుల్ దగ్గరికి ఎవరు రారు… సో, అలా ఒంటిగంట వరకూ పనిజేసి, మళ్ళీ అక్కడ నుండి హాస్టల్ కు.. హాస్టల్ దగ్గరే.. అదే వుమన్ హు వాక్స్ గద? మళ్ళీ అక్కడ నుండి నడిచివెళ్ళి భోజనం చేసేసి, మళ్ళీ మూడున్నరకు రెడీ అయ్యి, మళ్ళీ రేడియో స్టేషన్‍కు ఈవినింగ్ బులిటెన్ కోసం వచ్చేదాన్ని..

అలా ఆర్కైవ్స్ లో చాలా సమయం గడిపేదాన్ని. మధ్యాహ్నాలు వెళ్ళేది లేదు.. కాని ఉదయాలు మాత్రం తొమ్మిందింటి నుండి ఒంటిగంట వరకూ.. continuousగా… లేచేదే లేదు.. అందరూ టీకనీ, దీనికనీ, దానికనీ లేస్తారు, ఎక్కడికీ లేచేది లేదు, అత్తుక్కుపోవడమే.. గమ్ వేసుకొని, ఫెవికాల్ అంటించుకున్నట్టు.. కూర్చొని ఈ రికార్డ్స్ అన్నీ చూసేదాన్ని.

ఈ రికార్డ్స్ అన్నీ చూడడం కూడా according to the subjects I’ve selected.. అన్ని రికార్డ్స్ చూసేదాన్ని, నోట్సులు రాసుకునేదాన్ని.. ఆ రాసుకున్న నోట్స్ అన్నీ ఫైల్స్ ఆ రూంలో పడున్నాయి (గది చూపిస్తూ). Then, I used to do the work. అట్ల చేశానన్న మాట నా రిసర్చ్ వర్క్. నాకెవ్వరూ ఒకరిని ఆదర్శంగా పెట్టుకొని, చేయలేదు నేను. On my own, self made..
▪️వివిధ హోదాల్లో :

కేంద్ర సమాచారశాఖ, విదేశాంగ శాఖల్లో మంగమ్మ
కీలక పదవులను నిర్వహించారు.
//ఆలిండియా రేడియో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై, 10 సంవత్సరాలు రేడియో తొలి మహిళా న్యూస్‌రీడర్‌గా పనిచేశారు.
// బి.టి.కళాశాల పాలకవర్గ సభ్యురాలిగా, రుషీవ్యాలీ పాఠశాలలో పరీక్షల విభాగంలో పని చేశారు.
//ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌లో , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో జీవిత సభ్యురాలుగా కొనసాగారు.
//అనిబీసెంట్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఉపాధ్యక్షురాలిగా కొనసాగారు.
//గాంధీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అధ్యక్షురాలిగా సేవలు అందించారు., 
//లోక్‌అదాలత్‌లో సభ్యురాలిగా సేవలందించారు.
//బోధనా రంగంలో సుమారు పాతిక సంవత్సరాల అనుభవం సంపాదించింది.

.▪️ పురస్కారాలు

న్యూఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి 2002లో ఉగాది పురస్కారం..
2002లో కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం..
సిద్ధార్థ కళాపీఠం విజయవాడ వారి విశిష్ట అవార్డు... మొదలైన సత్కారాలను పొందింది.

▪️విశిష్టతలు

//భారతకోకిల సరోజినీనాయుడుకు మంగమ్మ సన్నిహితురాలు .. ఈ క్రమంలో ఆంధ్రానైటింగేల్ బిరుదును సంపాదించింది.
// సాహిత్యం సమాజ శ్రేయస్సు కాబట్టి మదనపల్లె రచయితల సంఘం ఏర్పాటులో కీలక పాత్ర వహించారు.
// అంకితభావం, క్రమశిక్షణలతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన మంగమ్మను ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్గా ఏడాది కాలం పొడిగించారు. ఇది నిబద్ధత కలిగిన ఉద్యోగ జీవితానికి నిదర్శనం.
// పదవీ విరమణ పొందిన తరువాత ఆమె ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోలేదు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు కష్టపడాలి అనే తనదైన సంకల్పంతో మదనపల్లెలో ఉపాధ్యాయ వృత్తి కొనసాగించారు.
.
▪️జ్ఞానోదయ పాఠశాల నిర్వహణ

84లో రిటైర్మెంట్ తరువాత మదనపల్లి వచ్చేసింది.
1984 నుండి 89 వరకు రిషి వ్యాలికి వెళ్లి అక్కడ పన్నెండో తరగతి హిస్టరీ బోధించేది. తర్వాత . 1989లో జ్ఞానోదయ పాఠశాల కమిటీ ప్రెసిడెంట్గా ఉంటూ.. . పాఠశాలలో ఇంగ్లీష్ బోధించడం మొదలెట్టింది.

▪️ జీవితం మొత్తం అవివాహితగానే 

 మంగమ్మ తమ్ముడు కృష్ణమూర్తి దురదృష్టవశాత్తు చిన్నవయసులో కాలధర్మం చెందారు . అప్పటికి అతడి ముగ్గురు పిల్లలు చాలా చిన్న వయసులో ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. తండ్రిని కోల్పోవడంతో ఆ పిల్లల భవిష్యత్తు అందాకారంలో పడింది. అప్పటికి ఆ పిల్లల నాయనమ్మ తాతలు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తన తమ్ముడి పిల్లల భవిష్యత్తు కోసం మంగమ్మ 
 పెద్ద నిర్ణయమే తీసుకుంది . పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం తీసుకొని ఆ పిల్లల బాధ్యతని తన భుజస్కందాలపై వేసుకుంది. అనుకున్న ప్రకారం తన తమ్ముడి పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించి తన జీవితాన్ని త్యాగం చేసింది.

▪️శివైక్యం
చిత్తూరు జిల్లా మదనపల్లె తన స్వగృహంలో తన 92 వ ఏట 2017, ఫిబ్రవరి 1వ తేదీన అనారోగ్యంతో కాలధర్మం చెందారు.
____________________________________________
ఆధారం :
1. పుస్తకం. నెట్
2. " మహిళా న్యూస్ రీడర్ మంగమ్మ కన్నుమూత "
సాక్షి వ్యాసం, ఫిబ్రవరి 1 2017
3. మాలిక సాహిత్య మాస పత్రిక
ధీర - 4
 రచన : లక్ష్మీ రాఘవ

No comments:

Post a Comment