Tuesday, April 16, 2024

రాజా దీన్ దయాళ్ ( తొలితరం చిత్రగ్రాహకుడు )

రాజా దీన్ దయాళ్ 
( తొలితరం చిత్రగ్రాహకుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
  వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

అతడు - 
కనిపించే జ్ఞాపకాల కానరాని మిత్రుడు.....
అవును !
అందని కాలానికి అతడే అరుదైన సంతకం...!
నిరుడి జ్ఞాపకాలకు నిలువెత్తు సాక్ష్యం...!
నిజం ! 
అతడు పాత రోజుల ప్రాణ స్నేహితుడు ! 
గతాన్ని గంపల కెత్తుకున్న దార్శనికుడు ! 
చరిత్రకు ఊపిరులూదుతున్న చిత్రకౌశలం ! 
నలుపు తెలుపులతో మాట్లాడుతూ నిజాన్ని నిక్కచ్చిగానో... నిర్భయంగానో...చూపెడుతున్న కళాబంధు !
అతడు....రాజా దీన్ దయాళ్ !


      📷 ఎవ్వరీ దీన్ దయాళ్ ? ఏమాకథా ? అని ప్రశ్నించుకుంటే అతడు నిజాం సంస్థానంలో పనిచేసిన మొట్టమొదటి ఫోటోగ్రాఫర్ ! అతడు తన అభిరుచి మేరకు తీసిన చిత్రాలు నేడు ఒకనాటి భాగ్యనగర అందాలను ...పరిస్థితులను ...ఆవిష్కరిస్తున్నాయి. మన 6 వ నిజాం ప్రభువులు అధికారికంగా పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చిత్రాలు తీసింది కూడా ఇతడే ! అంతేకాదు ప్రభువుల వారి కుటుంబ చిత్రాలను...వారి వారి దినచర్యలను ....అలవాట్లను... ప్రతిబింబించే ఎన్నో చిత్రాలను....మాట్లాడే జ్ఞాపకాలుగా భావితరాలకు అందివ్వగలిగాడు. ముఖ్యంగా నిజాం రాజుకు వేట మీద ఎనలేని ఆసక్తి. ఈ క్రమంలో దీన్ దయాళ్ ని తన వెంట తీసుకు వెళ్ళి ఆ తాలూకు దృశ్యాలను రకరకాలుగా చిత్రాలు తీయించుకునే వాడు.


        📷 ఒక్క ఒక్క భాగ్యనగరమే కాదు... భారతదేశం మొత్తం పర్యటించి ఆయా ప్రదేశాలను కూడా తన కెమెరా కన్నుల్లో బంధించి ఇప్పటి తరానికి ఆ పాత మధురాలను అందిస్తున్న ఘనత వీరికే దక్కుతుంది.

       🎥 1844లో ఉత్తర్ ప్రదేశ్ లో జన్మించిన రాజా దీన్ దయాళ్...సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. ఫోటోగ్రఫి అంటే మొదటి నుండి మక్కువ ఉన్నప్పటికీ ....ఫోటోగ్రాఫర్ గా కాకుండా ఇండోర్ లో పబ్లిక్ వర్క్స్ విభాగంలో ఉద్యోగం చేసాడు. ఈ క్రమంలో అతడి అద్భుతమైన అభిరుచిని గమనించిన ఒక బ్రిటిష్ రాజా వారు అతడికి కెమెరాను బహుకరించడంతో అతడి అభిరుచికి మరీంత పదును పెట్టబడిందని చెప్పవచ్చు.
    📷 కళ ప్రాణమైన చోట కలలకు జీవం వస్తుంది. ప్రతిభ నిప్పు వంటిది..... ఎక్కడ ఉన్న రాజుకుని బయట పడుతునంది.దీన్ దయాళ్ విషయంలో ఇదే జరిగింది.ఇండోర్ మహారాజ్ తుకోన్ జీ-2 కోరిక మేరకు 1885లో దీన్ దయాళ్ బొంబాయి & ఇండోర్ లలో ఫోటో స్టూడియోలను ఏర్పాటు చేసాడు. భారతదేశం లోనే ఇతడిది మొదటి ఫోటో స్టుడియో !
   🎥 హైదరాబాద్ పాలకుడు 6 వ నిజాం ప్రభువుల వారికి ఫోటోలు అంటే ఆసక్తి. ఈ క్రమంలో 1891లో బొంబాయి వెళ్ళినప్పుడు దీన్ దయాళ్ స్టుడియోకు వెళ్ళడం జరిగింది. నైపుణ్యాన్ని వెదుక్కుంటూ ప్రభువుల రూపంలో అవకాశమే రాకపోయి ఉంటే భవిష్యత్తు కాలానికి ఒక అద్భుతాన్ని కొల్పోవాల్సి వచ్చేది. కాని అట్లా జరగలేదు .అందుకే ప్రతిభ నచ్చి తన సంస్థానానికి ఆహ్వానించిన ప్రభువుల వారి కోరికను దీన్ దయాళ్ మన్నించాడు. ఫలితంగా 1891లో సికింద్రాబాద్ ప్రాంతంలో ' రాజా దీన్ దయాళ్ అండ్ సన్స్ ' పేరుతో ఒక ఫోటో స్టూడియో నెలకొల్పడం జరిగింది. ఇది ప్రస్తుతం నడుస్తున్న జమ్ జమ్ బేకరీ ప్రాంతంలో ఉండేది.
     📷 దీన్ దయాళ్ నిజాం చేత ' ముస్సవీర్ జంగ్ బహదూర్ ' పేరుతో సత్కరింపభడ్డాడు.ప్రభువుల వారికి ఉన్న ముఖ్య స్నేహితుల్లో దీన్ దయాళ్ ఒకరు అంటే నిజాం ము ఫోటోలపై ఉన్న ఆసక్తిని గమనించ వచ్చు. ఇప్పటి జనాలు వేళా పాలా లేకుండా సెల్ఫిలు తీసుకునే చందానా ప్రభువులవారు దీన్ దయాళ్ ను వినియోగించుకున్నాడు అనేది మాట. ఇదేమైనప్పటికీ ప్రభువుల ఆసక్తి...ఆనాటి పాలనను ఇప్పుడు మనకు చిత్రాలతో చూపెట్టే అవకాశాన్ని కలిగించింది కాబట్టి సంతోషమే ! అట్లాగే దీన్ దయాళ్ అభిరుచి ఆనాటి నగర వీధులను మనకు చూపెడుతున్నది ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. అది ఏంటంటే ప్రభువుల వారు నగరంలో వివిధ ప్రాంతాలను తిరగలేక....,తన నగరాన్ని ఎప్పటికప్పుడు చూసే నెపంతో కూడా చాలా ఫోటోలను దీన్ దయాళ్ చేత తీయించాడు. ఇవే ఇప్పటి మన అపురూప జ్ఞాలకాలుగా విరాజిల్లుతున్నాయి. మొత్తానికి ఇద్దరి చొరవ ఒక చరిత్రను బతికించింది.

       🎥 దీన్ దయాళ్ 1905 లో మరణించాడు. అప్పటికి ఆయన వయసు 61 సవత్సరాలు మాత్రమే ! ఆయన తర్వాత ఆయన కుమారులు ధర్మచంద్...గ్యాన్ చంద్...లు తండ్రి అభిరుచిని కళను బతికించారు. గ్యాన్ చంద్ మునిమనుమడు వినీత్ చంద్ ప్రస్తుతం దీన్ దయాళ్ నెలకొల్పిన స్టూడియోను నడిపిస్తున్నాడు.

ఆధారం : "ఫోటోగ్రఫీలో అద్భుతాలు "

No comments:

Post a Comment