Monday, April 15, 2024

చల్లా కృష్ణ నారాయణరెడ్డి

చల్లా కృష్ణ నారాయణరెడ్డి
 (1925-2013)
( బడుగు బలహీన వర్గాల ప్రతినిధి - పీలేరు గాంధీ )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
సామాజిక సేవ
హితం కోరే సాహిత్యం 
అతడి ఆలోచన......
అభ్యుదయ దృక్పధం
అట్టడుగు వర్గాల ఉన్నతి
అతడి వివేచన....
చల్లా కృష్ణ నారాయణరెడ్డి ! 
పీకే నారాయణరెడ్డి గా సుపరిచితుడు .
పీలేరు గాంధీగా ప్రసిద్ధుడు
సి. కే. గా పిలవబడ్డాడు...

// వివరాల్లోకి వెళ్తే...//

చిత్తూరు జిల్లా పీలేరు దగ్గర చల్లావారిపల్లిలో నారాయణ రెడ్డి ఆగష్టు 1, 1925 న వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వీరి తమ్ముడు చల్లా రఘునాథరెడ్డి. 

మదనపల్లెలో 1915లో డాక్టర్ అన్నీబిసెంట్ స్థాపించిన
బీసెంట్‌ థియొసాఫికల్‌ సంస్థలో బి.ఎ వరకు చదువుకున్నాడు. . విద్యార్థి దశ నుండే ఆదర్శభావాలు కలిగిన నారాయణరెడ్డి, తోటి నిరుపేద విద్యార్థుల సామాజిక ఆర్థిక అవస్థలకు చలించి పోయాడు. ఈ నేపథ్యంలో బిఎ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడే పేద విద్యార్థుల కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని ఒక వసతి గృహాన్ని స్థాపించాడు..

 వీరి వ్యక్తిత్వం, జీవితం, నిండుదనం నిరాడంబరతకి మారుపేరుగా కొనసాగింది .నారాయణరెడ్డి
నిత్యం ఖద్దరు ధరించేవాడు. తాను జీవితంలో ఎంత ఎదిగినా ఆడంబరాలకు పోకుండా ఎక్కడికైనా వెళ్లినప్పుడు బస్సులో వెళ్లేవాడు. దగ్గరికి ప్రాంతాలకు కాలినడకన వెళ్లేవాడు.

హాకీ క్రీడాకారుడుగా - 
క్విట్ ఇండియా ఉద్యమకారుడుగా -
గాంధీయవాదిగా -
బడుగు బలహీన వర్గాల పెన్నిధిగా -
ఆదర్శవంతమైన రాజకీయాలు నడిపిన అజాతశత్రువుగా నారాయణ రెడ్డి జీవితం ఎందరికో ఆదర్శం! 

 //రాజకీయం - ఉద్యమ జీవితం //

 విద్యార్థి దశలో ఉన్నప్పుడు గాంధీయవాదిగా ఉన్నాడు.
జాతీయ ఉద్యమ ప్రభావంతో స్వాతంత్ర సమరయోధుడిగా కొనసాగాడు. స్వాతంత్రం అనంతరం

1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరాడు.

1962- 1967 కమ్యూనిస్టు పార్టీ తరపున పీలేరు ఎమ్మెల్యేగా పనిచేశాడు.

1967 తర్వాత చారు మజుందార్ నేతృత్వంలోని సిపిఐ (ఎంఎల్)లో చేరాడు. సమకాలీన సమస్యలపై ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ 1970లో అరెస్టయ్యాడు.

ఎమర్జెన్సీ సమయంలో మళ్లీ అరెస్టు చేయబడి రెండేళ్లపాటు జైలులో ఉన్నాడు. 1977లో జైలు నుంచి విడుదలయ్యాక, సంఘసేవే దృక్పతంగా జీవితాన్ని ఆరంభించాడు.

 ▪️జీవకారుణ్యం ఉద్యమాలు :

వీధి కుక్కలను చంపకూడదని ఉద్యమం నిర్వహించారు. ఫ్లోరోసిస్‌ సమస్యపై ఉద్యమాలు 

//సంఘసేవ //

 సమస్య ఉన్నచోట కచ్చితంగా నారాయణరెడ్డి ఉంటాడు అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించిన సి కె నారాయణ రెడ్డి గారు తన జీవితకాలం మొత్తం ప్రజోద్యమాలలో గడిపాడు. సంఘసేవ కోసం తన అమూల్యమైన కాలాన్ని వెచ్చించాడు.

▪️ఆర్థులలు అన్నార్తుల కోసం :

 కరువు ప్రాంతాల్లో గంజి కేంద్రాలు నిర్వహించాడు. ఈ కేంద్రాల్లో నిర్వాసితులైన నిరాశ్రయులైన ప్రజలు ఆశ్రయం పొందారు. రాయలసీమ ప్రాంతంలోనూ , సమీప తెలంగాణ పాలమూరు ప్రాంతంలోనూ, ఒకప్పుడు గజ్జి కేంద్రాలు ఎక్కువగా కనబడేవి. 

▪️దళిత పిల్లల కోసం వసతి గృహాలు : 

 సమాజంలో వెనకబాటుతనాన్ని అనుభవిస్తూ , అవమానాలని అస్పృశ్యతని ఎదుర్కొంటున్న దళితుల పిల్లలు చదువుకొని, భవిష్యత్తులో తమ తరాలను ఉద్ధరించుకోవాలనే సంకల్పంతో దళిత విద్యార్థుల కోసం బాకారావు పేట, వాయలపాడు, యెర్రవారిపాలెం, నేలబైలు, పీలేరు, మదనపల్లె మొదలగు ప్రాంతాల్లో వసతి గృహాలను ఏర్పాటు చేశాడు...
 మునివెంకటప్ప, అబ్బన్న వంటి ఐఎఎస్‌ అధికారులు ఈ వసతి గృహాల నుండి వచ్చినవారే .

//ప్రచురణ సంస్థలు - గ్రంథాలయాలు //

స్వతహాగా సాహిత్యాభిలాషి అయిన సి కె నారాయణ రెడ్డి, 1977లో జనతా ప్రచురణలు, తర్వాత అనుపమ ప్రచురణలు ప్రారంభించి పరివర్తనాత్మక సాహిత్యాన్ని ప్రచురించాడు.
 ది స్కాల్పెల్, ది స్వోర్డ్ (రిచర్డ్ అలెన్, టెడ్ గోర్డాన్), ఫాన్‌షెన్ (విలియం హింటన్), మై ఇయర్స్ ఇన్ ఇండియన్ ప్రిజన్ (మేరీ టైలర్), రెడ్ స్టార్ ఓవర్ చైనా (ఎడ్గార్ స్నో) వంటి అంతర్జాతీయ పుస్తకాలు కూడా ఈ ప్రచరణ సంస్థలు ప్రచురించాయి 

 ▪️హైదరాబాద్ బుక్ ట్రస్ట్ స్థాపన :

1980 లో హైదరాబాదు కేంద్రంగా ":హైదరాబాద్ బుక్ ట్రస్ట్" స్థాపించాడు.ఇది పరిమిత ఖర్చులతో కూడుకున్న పుస్తక ప్రచురణ సంస్థ. ఎం. కె. ఖాన్, జి. మనోహర్, శాంతా సిన్హా, గీతా రామస్వామి వంటి సభ్యుల సహకారతో సంస్థ నడుస్తున్నది. ప్రతి సంవత్సరం విభిన్న అంశాలపై పరిమిత ప్రామాణిక పుస్తకాలు ఈ సంస్థ ప్రకటిస్తున్నది.

రాకాసికోర (మహాశ్వేతాదేవి అనువాదం సూరంపూడి సీతారామ్), గ్రహణాల కథ - మహీధర నళినీమోహన్), వేమన మనవాదం - (ఎన్. గోపి ), బతుకుపోరు (బి.ఎస్.రాములు) మొదలగునవి ఈ సంస్థ నుండి వెలువడినవే.నది పుట్టిన గొంతుక (బొజ్జా తారకం,కల్లోల లోయ (కె.బాలగోపాల్) మూగవాని పిల్లనగ్రోవి (కేశవరెడ్డి )
 మొదలగు పుస్తకాలు ఈ సంస్థ నుండి ప్రకటించబడినవే.

▪️గ్రంధాలయం :

ఉత్తేజకరమైన పాటలను రాసిన రచయిత, యువజన, కార్మికోద్యమనేత పులుపుల వెంకటశివయ్య గారి స్వస్థలమైన రొంపిచెర్లలో నారాయణరెడ్డి గ్రంథాలయాన్ని నెలకొల్పారు

//కుటుంబం //

నారాయణరెడ్డి భార్య జయప్రద, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గా పనిచేసారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు డాక్టర్ అరుణ, న్యాయవాది శైలజ. ఇతను ఉస్మానియా యూనివర్సిటీ లెజెండరీ స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డికి వీరు చిన్నాయన. 

 //కాల ధర్మం //

2003 నుండి నారాయణరెడ్డి సంగారెడ్డిలో నివసించాడు.
88 సంవత్సరాల వయస్సులో కింద పడిపోవడంతో సెప్టెంబర్ 5 2013 న నిమ్స్‌లో మరణించాడు. ఆయన ఆఖరి కోరిక మేరకు మృతదేహాన్ని గాంధీ వైద్య కళాశాలకు దానం చేశారు.

 వ్యాసకర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి 
 ( ఆగస్టు 1 సి.కే.నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ వ్యాసం)

No comments:

Post a Comment