గుండోజు యాదగిరి
( కవి, రచయిత, ఉద్యమకారుడు)
~~~~~~~~~~~~~~~~~~~~~~
భాగవతమ్ములో భక్తిచిందించిన పోతన్నవెలసిన పుణ్యభూమి
దుష్టులన్ యుద్ధాన దునిమిన రాణి రుద్రమ యేలిన రాజభూమి
రాజనీతిజ్ఞుడై రాణకెక్కిన యుగం ధరుడు జన్మించిన ధర్మభూమి
శిల్పకళతపస్వియనెడి పేర్గొన్న రామప్ప నెగడిన రమ్యభూమి
యిట్టి ఔన్నత్య సంపదకిక్కయైన ఈ తెలంగాణ భూమితోనేది సాటి?
కనుక భయమేల సోదరా!
కంఠమెత్తి గానమొనరింపరా ! ‘తెలంగాణ ఘనత’ !
అంటూ గళమెత్తి గర్జించిన తెలంగాణ ఉద్యమకారుడు ...ఉద్యమ కవి...
గుండోజు యాదగిరి
//వివరాల్లోకి వెళ్తే....//
కవిగా రచయితగా విమర్శకుడిగా ఉద్యమకారుడిగా చిత్రకారుడిగా బహుముఖి ప్రజ్ఞ కలిగిన విశ్రాంత అధ్యాపకుడు గుండోజు యాదగిరి గారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపురం గ్రామం వీరి స్వగ్రామం. వీరు 1945 ఆగస్టు 21న జన్మించారు.బాలకిష్టమ్మ లక్ష్మయ్య దంపతులు వీరి తల్లిదండ్రులు.
ప్రాథమిక విద్యను ఎల్లమ్మ రంగాపురంలో, హెచ్ ఎస్ సి కల్వకుర్తిలో, వెంకటేశ్వర ఓరియంటల్ కాలేజ్ పాలెంలో తెలుగు డిప్లమా బిఓఎల్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంవోఎల్ చదివారు. 2003లో పదవీ విరమణ పొందారు
//1969 తెలంగాణ ఉద్యమంలో//
1969 తొలి తెలంగాణ ఉద్యమం వీరు బిఓఎల్ చదువుతున్నారు. ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సి నారాయణ రెడ్డి, దాశరథి, సమైక్యాంధ్రను సమర్తిస్తూ కవిత్వాలు రాయడంపై యాదగిరి నిరసన వ్యక్తం చేశాడు . తెలంగాణ ఆత్మగౌరవంతో రుక్ముద్దీన్ తో
కలిసి కలిసి విప్లవఢంకా వినిపించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తేజపరిచారు
//సాహిత్య నేపథ్యం //
యాదగిరి గారి తండ్రి లక్ష్మయ్య గారు పెద్దగా చదువుకోలేక పోయినా, యక్షగానాలను కంఠస్తం చేసి ఉండేవారు. అనేక లోక వ్యవహారాలను , గ్రామ సమాచారాలను, తెలిసి ఉండేవారు. తండ్రి ప్రభావంతో లోక, సాహిత్య, అంశాలపై యాదగిరి గారికి చిన్నప్పటి నుండి ఆసక్తి కలిగింది.
అంతేకాకుండా ఎల్లమ్మ రంగాపురం పట్వారి గోపాలరావు మంచి సాహితీవేత్తగా ఉండేవాడు. సురవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ కవుల సంచిక గురించి తదితర సాహిత్య విషయాల గురించి చర్చించేవాడు. ఆ విధంగా కూడా యాదగిరి గారికి సాహిత్యంపై ఆసక్తి పెరిగింది.
1951 ప్రాంతంలో ఎల్లమ్మ రంగాపురం గ్రామంలో బాలవాణి గ్రంథాలయం ఏర్పాటు చేశారు. 2000 పైగా పుస్తకాలు గ్రంథాలయంలో ఉండేవి. గోల్కొండ కవుల సంచిక కూడా ఉన్నది. విప్లవ అభ్యుదయ సాహిత్యాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా యాదగిరి గారికి సాహిత్యంపై మక్కువ పెరిగింది
//రచనలు//
తెలంగాణ సాహిత్యం ఉద్యమంపై వీరు ప్రామాణిక గ్రంథాలు రచించారు.
1- ఉద్యమ కవితా సంకలనం
🔸జై తెలంగాణ విప్లవఢంకా
1969 తెలంగాణ ఉద్యమంలో ఆచార్య రుక్ముద్దీన్ తో కలిసి విప్లవఢంక కవితాసంకలనం తీసుకువచ్చి ఉద్యమ వాతావరణం లో వేడి రగిలించాడు
2- సంక్షిప్త వ్యాస గ్రంధాలు
🔸తెలంగాణ సోయి
అసామాన్య సామాన్యమాన్యులుగా ఈ గ్రంథం రెండు భాగాలుగా రూపొందించబడింది. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, జానపద, శిల్పకళ, చిత్రకళ,విప్లవ, అభ్యుదయ, ఉద్యమ, సామాజిక సేవ, మొదలగు పది
విభిన్న రంగాల్లో పోరాటాల్ని ఉద్యమాల్ని కృషిని కొనసాగించిన విశిష్ట వ్యక్తుల విజయ గాథల సంక్షిప్త సమాచారాన్ని తెలంగాణ సోయి రెండు భాగాల్లో ప్రకటించాడు. ప్రతి వ్యాసానికి తానే స్వయంగా చిత్రం గీశాడు.
భారత దేశ స్వాతంత్ర్యం కొరకు ఆంగ్లేయులపై తొలి పోరాటం జరిపి మరుగునపడిన పోరాటయోధుడు
రాంజీ గోండు, మలి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన కావలి సువర్ణ, మలి దశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత్ ఆచారి పల్లెటూరి పిల్లగాడా పసుల కాసే మొనగాడా అంటూ గొంతేత్తి పాడిన మాభూమి సంధ్యక్క,
తెలంగాణలో తొలి రామాయణం బతుకమ్మ పాట రాసిన ఎల్లమ్మ రంగాపురం ప్రజాకవి
బుక్క సిద్ధాంతి, 80 ఏళ్ల కిందటి బాలకృష్ణుడి బొమ్మను దాచిపెట్టిన సురవరం సరోజమ్మ, ప్రతిజ్ఞ రచించిన పైడిమర్రి వెంకట సుబ్బారావు, జానపద కళాకారుడు కిన్నెర మొగులయ్య,
హైదరాబాద్ లో తొలి పర్ఫ్యూజనిస్ట్ కేశవరం మధుసూదన్ రావు, (పర్ఫ్యూజనిస్ట్ అంటే, హృదయానికి శస్త్ర చికిత్స చేస్తున్నప్పుడు గుండెను, ఊపిరితిత్తులను సజీవంగా ఉంచే ప్రక్రియను పర్యవేక్షించే నిపుణులు)
చిత్ర కళలో అసమానమైన ప్రతిభ కనబరిచిన లగుసాని గోపి, అలుపెరుగని ఉద్యమ బాటసారి గూల్యం అంపయ్య,
తెలంగాణ ఊర్ల పేర్లపై తొలి పరిశోధకుడు కపిలవాయి కిషోర్ బాబు తదితరుల సంక్షిప్త సమాచారాలు పొందుపరచబడి ఉన్నాయి
3 - పద్య కావ్యాలు
🔸శిల్పిఖండకావ్యం
భారతదేశం అద్భుతమైన శిల్ప సంపదకు పుట్టినిల్లు. చెక్కించిన రాజుల పేర్లు చరిత్రను అలరించాయి కానీ చెక్కిన శిల్పుల పేర్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ పరిస్థితికి వాపోతూ శిల్ప కారుల నైపుణ్యాన్ని శ్రమని ప్రతిభను కీర్తిస్తూ " శిల్పి ఖండ కావ్యం" 1969 లో రచించారు. 101 మంది తెలంగాణ చిత్రకారులను పరిచయం చేశారు.ఇందులో ఒక పద్యాన్ని గమనిస్తే....
అల వేయి స్తంభాల ఆలయనిర్మాణ
చతురిమ గరిమకు శత వినతులు!
శ్రీకాళహస్తి విశిష్టశైలీ స్తంభ
విలసనమునకు వేవేల నుతులు!
బేలూరు హలెబీడు ఆలయ శివ్వాళి
కల్పన కిదె నమస్కారశతము !
జలధి దరిని మహాబలిపుర శిల్పవై
భవమునకు సహస్రువందనములు!
రాత్రి పగలనిఅనక, విరామ మనక,
ఆలు బిడ్డలనక, మరి ఆశలనక,
రాళ్ళు తొలువంగ,మలువ నీరక్తసిక్త
హస్తములు కడుగగనిదె అందుకొనుము
స్తపతి వర్యుడ ! మాఅశ్రుతర్పణములు
🔸 ఫేస్బుక్ శతకం
ఫేస్బుక్ వేదికగా సామాజిక సాంస్కృతిక సాహిత్య రంగాల్లో విశేషమైన కృషి చేస్తున్న వ్యక్తుల వ్యక్తిత్వ చిత్రణగా 100 మంది వివరాలను సమీకరించి,వారిపై తేటగీతి పద్యాలు అల్లి, ఒక శతకంగా రూపొందించడం జరిగింది. తెలుగు సాహిత్య చరిత్రలో ఇటువంటి ప్రయత్నం జరగడం ఇదే ప్రథమం.
4 - సంపాదక రచనలు
🔸తెలంగాణలో తొలి రామాయణం బతుకమ్మ పాట
ఎల్లమ్మ రంగాపురం ప్రజాకవి
బుక్క సిద్ధాంతి
ఈ గ్రంథానికి సంపాదకత్వం వహించారు
బుక్క సిద్ధాంతి జానపద రామాయణ కథను తెలంగాణ మాండలికంలో 90 సంవత్సరాల కిందట 90 పేజీల్లో రచించి ప్రచురించాడు . వాల్మీకి రామాయణంలో లేని రంగనాథ రామాయణంలో ఉన్న గాథలను ఇందుట్లో పొందుపరిచాడు. ఉయ్యాలో వలలో అనే వంతలు ఉన్నాయి.
🔸 నార్ల కంటి బుచ్చయ్య కవితలు, అంపశయ్య కవితలకు సంపాదకత్వం వహించారు
🔸అమరాబాద్ నారాయణ డైరీ గ్రంధానికి సంపాదకత్వం వహించారు.
5 - చరిత్ర రచన
🔸రంగాపురం గ్రామ చరిత్ర
తన సొంత ఊరు రంగాపురం గ్రామ చరిత్రను రచించి ప్రకటించారు.ఈ గ్రంధంలో తన సొంత గ్రామానికి చెందిన 15 మంది మరుగున పడిన కవులను వెలికి తీసి పరిచయం చేయడం జరిగింది.వీరిలో ప్రజా కవి బుక్క సిద్ధాంతి, సురవరం ప్రతాపరెడ్డి ప్రకటించిన గోల్కొండ కవుల చరిత్రలో స్థానం సంపాదించుకున్న వాడాల నరసింహ కవి , ముడుంబై నరసింహాచార్యులు తదితరులు ఉన్నారు.
6. గేయ రచనలు
🔸బతుకమ్మ పాట
సమ్మక్క సారమ్మ ల స్మరిస్తూ బతుకమ్మ గేయ కావ్యం రచించారు.
7. విశ్లేషణ - పరిచయ గ్రంధాలు
🔸డాక్టర్ ముకురాల రామిరెడ్డి సాహితీ సమీక్ష
🔸మార్చాలా రామాచార్యుల జీవిత చరిత్ర తెలంగాణ తొలి తరం చిత్రకారుడు మార్చాల రామాచార్యులు జీవితాన్ని , శిల్పకళా నైపుణ్యాన్ని పరిచయం చేస్తూ గ్రంథం రూపొందించారు.
🔸అజ్ఞాత విప్లవ వీరుడు అమరుడు కొండన్న
8.పరిశోధనగ్రంధాలు
🔸వరవరరావు జీవితం.. సాహిత్యం పై పరిశోధన
9. వీధి బాగోతం నాటిక కూడా రచించారు.
//పురస్కారాలు సత్కారాలు //
సామాజికవేత్తగా పలు సమాజ సేవా కార్యక్రమాల్లో
పాల్గొంటూ వస్తున్న గుంటూరు యాదగిరి గారికి 2015లో తెలుగు విశ్వవిద్యాలయం వారు కీర్తి పురస్కారం అందజేశారు.
//చిత్రకారుడిగా //
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పుట్టపర్తి నారాయణాచార్యులు, తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక, ప్రముఖ చరిత్రకారుడు భిన్నూరి నరసింహ శాస్త్రి, ప్రముఖ సాహితీకారుడు రంగినేని సుబ్రహ్మణ్యం, యువ శిల్పి శివ రామాచారి, నిజాం విమోచన పోరాటయోధుడు మందముల నర్సింగ్ రావు, వందేమాతరం రామచంద్రారావు, తదితరుల చిత్రాలను తన పెన్సిల్ తో గీసి ప్రాణం పోశారు
//అభివందనాలతో //
తెలంగాణలో, ప్రత్యేకించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో, తన రచనలతో ప్రజోద్యమాలను ప్రభావితంచేసిన గుండోజు యాదగిరి గారు
ఆయురారోగ్యాలతో శతాధిక వసంతాలు జీవించాలని మనసారా ఆశిద్దాం .....
వ్యాసకర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
No comments:
Post a Comment