Saturday, April 20, 2024

సావిత్రిబాయి పూలే

 సావిత్రిబాయిఫూలే !
(3 జనవరి 1831 – 10 మార్చి 1897)
°°°°°°°°°°°°°°°°°°°°°°

వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

🙏ఒక అడుగు జాడ.... 
    ఒక వెలుగు నీడ... 
    ఒక మమతల మేడ... 
    సావిత్రిబాయిఫూలే !
🙏 కర్తవ్యాన్ని బతికించి, ఆశయాన్ని వెలిగించి, కార్యసాధనలో రాటుదేలిన భారతీయ సంఘ సంస్కర్తగా చరిత్ర సృష్టించి, మహిళా ప్రపంచానికి పతాక శీర్షికగా ఎదిగిన ఒక సాధారణ మహిళ సావిత్రీబాయి ! 

🙏ఉపాధ్యాయినిగా...రచయిత్రిగా... ఆమె జీవన ప్రయాణం ఒక ప్రణాళికాబద్దం ! నిబద్దతకు ఒక అద్దం ! అవిద్య, అంధకారం, స్త్రీ జాతిని నిర్వీర్యం చేస్తున్నప్పుడు రవళించాల్సిన వీణ మూగబోతున్నదేమిటని చిన్నబోయిన చిరస్మరణీయురాలు సావిత్రీబాయి ! అందుకే 
ఆధునిక విద్య స్త్రీజాతికి అత్యవసరం అని భావించింది. అప్పుడే స్త్రీలోకం దాస్య శృంఖలాల నుండి విముక్తి సాధిస్తుందని నమ్మింది. ఆ తర్వాత ఆమె ఇక ఆలస్యం చేయలేదు. తన భర్త జ్యోతిరావుఫూలే సహాయ సహకారాలతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించి..... తొలితరం మహిళా ఉద్యమకారిణిగా తన సత్తా చాటుకుంది !

🙏వర్గం, వర్ణం, అనే తరతమ తేడాలు లేకుండా ఒక స్వచ్ఛమైన సమాజాన్నిఆశించిన సావిత్రీబాయి, మహిళా హక్కుల కోసం పోరాటం చేయటం తన సామాజిక బాధ్యతగా అడుగులు ముందుకు వేసింది. 

🙏సమాజం నిండా మసిలా పేరుకు పోయిన కులతత్వాన్ని, అట్లాగే స్త్రీ మెదడును మనసును అణిచివేస్తున్న పురుషాధిక్యతను సావిత్రీబాయి నిరసించింది !ఈ క్రమంలో స్త్రీ శక్తిని నిరూపించుకుంది. గుండెలోని కసిని నెరవేర్చుకుంది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా స్త్రీ కేతనం ఎగురవేసింది. 

🙏 మహారాష్ట్ర -సతారా జిల్లా -నయాగావ్‌ అనే ఒక పల్లెటూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించిన సావిత్రిబాయి, చిన్నతనం నుండే చురుకైనది. ఏ పనైనా ధృడ సంకల్పంతో మొదలెట్టి సాధించేది. అది వంట కావొచ్చు... అల్లికలు కావొచ్చు...వెనకడుగు వేయడం ఆమెకు తెల్వదు. ఈ క్రమంలో 
చదువుకోవాలని ఎంతో ఆశపడింది. కానీ పుట్టింటిలో ఆమె ఆశ నెరవేరలేదు. 

🙏ఆనాటి సామజిక పరిస్థితుల్లో సావిత్రీబాయికి తొమ్మిదవ యేటనే వివాహం జరిగింది. జ్యోతిరావుఫూలెను ఆమె 1840లో వివాహమాడింది.అప్పుడు జ్యోతిరావుపూలే వయసు పన్నెండేళ్ళు.మొత్తానికి వివాహం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. భర్తే గురువుగా ఇంట్లోనే అక్షరాలు నేర్చుకుంది. తెలివిగా పాఠాలు చదివింది. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఆ తర్వాత మరెందరో జీవితాల్లో వెలుగులు నింపింది. 

🙏సావిత్రిబాయి తన చిన్నతనం నుండే సాటి స్త్రీ జీవిత కోణాల్ని పరిశీలించింది. అక్కడి బాధలు సమస్యలు అవగాహన చేసుకుంది. సమస్యలకు పరిష్కారాలు అన్వేషించింది.

🙏సమాజంలో ఎదురైన అవమానాలను సావిత్రీబాయి పట్టించుకోలేదు. ధైర్యంగా ముందుకి నడిచింది. పట్టుదలగా పనిచేసింది. కృషిని గెలిపిస్తూ కేవలం నాలుగు సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇరవైకి పైగా పాఠశాలలను ప్రారంభించి అందరికీ ఉచిత విద్యనందింది. 
సమస్యలను ఛేదించుకుంటూ స్త్రీ విద్యా వ్యాప్తి కోసం ఆమె నడుం బిగించిన సమయానికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వయసు చిన్నదైనా ఆశయం పెద్దది కాబట్టి, ఆమె ప్రయత్నాలను అడ్డుకోగలిగారే గానీ, ఆమె సంకల్పాన్ని ఎవ్వరూ కూడా తుడుపలేక పోయారు. ఈ క్రమంలో ఆమె జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. 

🙏 
◾️మహిళల హక్కులే మానవ హక్కులుగా నినదిస్తూ
#1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది సావిత్రిబాయి.  
◾️ వితంతువులకు శిరోముండనం చేయడాన్ని ఖండిస్తూ.... వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత #1860లో పెద్దఎత్తున సమ్మె చేయించింది. 
◾️1868 నుంచి అంటరానితనానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటానికి పిలుపునిచ్చింది. 
◾️1870 - 1896 సంవత్సరాల్లో దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు కరువు రక్కసి కాటేసిన కుటుంబాలలోని దాదాపు 2,000 మంది అభాగ్యులకు ఆపన్న హస్తం అందించడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే తమ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు
◾️ఆ తర్వాత1873 లో తన "సత్యశోధక్ సమాజ్ "ను ప్రారంభించింది. ఈ సమాజ్ ద్వారా బాల్యవివాహలను వ్యతిరేకించింది.వితంతు ఆచారాలను ప్రశ్నించింది. మూడనమ్మకాలను నిరసించింది. స్త్రీ సమాజాన్ని వణికించిన సతీసహగమనాన్ని మెడబట్టి గెంటే ప్రయత్నం చేసింది. పెండ్లిళ్లు పేరంటాలు వంటి అన్ని శుభకార్యాలు పురోహితులు లేకుండా చేయవచ్చు అంటూ ఈ సమాజం ద్వారా సగటు సమాజానికి చాటి చెప్పింది. 
కాగా ఆమె ఈ మొత్తం ప్రయత్నాల వెనుక భర్త జ్యోతిరావుపూలే ఉండటం గమనించాల్సిన విషయం. అట్లాగే ఈ సమాజ్ లో ఒక వితంతువుకు పుట్టిన సంతానమే వీరి కుమారుడుగా 
పెరిగి పెద్దవాడయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..... 
👉అన్ని విధాలుగా పరిణతి చెందిన సావిత్రీబాయి జ్యోతీరావు దంపతులకు సంతానం లేదు. తమ సమాజ్ లో వితంతువులకు ఆశ్రయం కల్పిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన సంతానాన్ని దత్తత తీసుకున్నారు.అతడి పేరు యశ్వంతరావు. పూలే దంపతుల సంతానంగా అల్లారు ముద్దుగా పెరిగాడు. 

🙏1854లో #కావ్యఫూలే పేరుతో ఆమె తను రచించిన కవితలను సంపుటిగా ప్రచురించింది.
 #పావన #కాశీ #సుభోధ్‌ #రత్నాకర్‌’ అనే రెండవ కవితా సంపుటిని 1891లో ప్రచురించింది. సావిత్రీబాయి మంచి వక్త. వీరి విలువైన ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తకరూపంలో ప్రచురింపబడ్డాయి. 

🙏 1890 నవంబరు 28న జ్యోతిరావుపూలే కాలం చేసాడు. ఈ దుఃఖ పరిస్థితుల్లో భర్త చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి.... కొత్త ఆదర్శానికి నాంది పలికారు.

🙏 1897 సంవత్సరంలో పూణే నగరాన్ని ప్లేగు వ్యాధి వణికించింది.ఈ విపరీత పరిస్థితుల్లో జనాలు నగరాన్ని వదిలి పారిపోతుంటే.... సావిత్రీబాయి మాత్రం ధైర్యంగా రోగానికి ఎదురు నిలిచింది. కొడుకు యశ్వంత్ తో కలిసి ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించింది. రోగులను ఆదరించింది. వైద్య శిబిరాలు ప్రారంభించింది. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెను నిర్దయగా కాటేసింది. ఫలితంగా మార్చి 10, 1897 లో ఒక మానవీయ చరిత్రకు ముగింపు ఇస్తూ సావిత్రీబాయి మరణించింది.  

🙏ప్రస్తుతం సావిత్రిబాయి జయంతిని #భారతదేశమహిళా #ఉపాధ్యాయులదినోత్సవంగా జరుపుకుంటున్నాము. భారత ప్రభుత్వం ఆమె సేవలను గుర్తిస్తూ..... 1997లో ఆమె జ్ఞాపకార్థంగా తపాలా స్టాంపును విడుదల చేసి గౌరవం అందించింది.   

🙏 మహిళల్ని గుర్తించండి.... గౌరవించండి.. ఆదరించండి....వెన్నంటి నడవండి.. 
...ఆమె శక్తిని ఈ ప్రపంచానికి చాటండి ! జయహో మహిళా !!

ఆధారం : సావిత్రిబాయి జీవిత చరిత్ర

No comments:

Post a Comment