Tuesday, April 16, 2024

కెప్టెన్ రాపోలు వీరరాజారెడ్డి( దేశ సేవలో తన ప్రాణాలను అర్పించిన వీరుడు

కెప్టెన్ రాపోలు వీరరాజారెడ్డి(1977-2002)
( దేశ సేవలో తన ప్రాణాలను అర్పించిన వీరుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

కంచెలు దాటిన శత్రువుపై కండ్లెర్ర జేసిన సాహసం నీది.... 
పరిధి దాటిన పగోడిపై విరుచుకు పడిన పోరాటం నీది.... 

దేశం తొలిపొద్దులో మెరిసిన సూర్య తేజానివి.... 
త్యాగం మలిసంధ్యలో ఒరిగిన సంకల్ప బీజానివి..... 

రాలిన నెత్తుటి చినుకుల్లో తడిసిన ఓ త్రివర్ణ పతాకమా... 
కూలిన ప్రాణం వంతెనపై మిగిలిన ఓ భరత ప్రతాపమా 

ఆశయల అమ్ముల పొది నుండి ....
కన్నతల్లి కమ్మని ఎద నుండి....
యుద్దమై దూసుకొచ్చిన 
వీరుడా.... 
అందుకో మా గౌరవ వందనాలు !

కెప్టెన్ రాపోలు వీరరాజారెడ్డి
భారతమాత ముద్దుబిడ్డ....
సార్థక నామధ్యేయుడు...
వీరత్వపు సంతకం... 
నిన్నటి నిగ్రహం...నేటి విగ్రహం...వీరరాజారెడ్డిపై నిర్లక్ష్యం నీడలు ఎందుకు కమ్ముకున్నాయి? వీరుడి ప్రాణత్యాగం చుట్టూ ఎందుకు అలసత్వపు పొరలు పేరుకున్నాయి? ఇవి ఉద్దేశ్య పూర్వక పగ? పొగ? 

"మనిషిగా పుట్టింది మనకోసం బతకడానికి కాదు, ప్రజా ప్రయోజనం కోసం...! ఈ క్రమంలో చావు ఎదురొచ్చినా ధైర్యంగా స్వీకరించాలి.పిరికితనాన్ని మోసాన్ని మొదటి శతృవుగా భావించినప్పుడే అంకితభావం మన అస్సలు పేరు అవ్వుతుంది "అని అక్షరాలా భావించి ఆ క్రమంలోనే జీవించి మరణించిన అమరకిషోరం రాజారెడ్డిని సర్కారు ఎందుకు చిన్నచూపు చూసింది? కాల గర్భంలో అతడి ఎందుకు తొక్కి పెట్టింది? 

పనికిమాలిన చిన్న విషయాన్నే పదే పదే చూపెట్టే మీడియా... ఈ విషయంలో ఎందుకు నోరు మూసుకుంది? 
దేశభక్తులం అని మాట్లాడే వాళ్ళు సైతం దేశభక్తుడి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? కారణాలు ఏమిటీ? 
సామాజిక వర్గమా?  

ఒక వీరుడి మరణం చుట్టూ వేల ప్రశ్నలు 
తచ్చర్లాడుతున్నాయి. ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా తల్లిదండ్రుల ఘోషను పట్టించుకునే పరిస్థితి లేదు. సమాధానం చెప్పాల్సింది ఎవ్వరు? 
సర్కారే ! 

#వీరుడి_ఆశయం 

హైదరాబాద్ అరవిందో ఇంటర్ నేషనల్ స్కూల్...తక్షశిల స్కూల్ లో పాఠశాల విద్యను , హబ్సిగూడ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో ఇంటర్ మీడియట్ విద్యను పూర్తిచేసాడు. తర్వాత , బిట్స్ పిలానిలో గాని ట్రిపుల్ ఐటి లో గానీ , చేరాలనుకున్నాడు. ఓ గొప్ప ఇంజనీరుగా భావితరాలకు మార్గదర్శకం కావాలని కలలు కన్నాడు.ఎంచుకున్న రంగం ఏదైనా సేవాదృక్పథమే ఊపిరిగా భావించిన రాజారెడ్డి ఆలోచనలు క్రమంగా దేశసేవ వైపు అడుగులు వేసాయి. 

ఆలోచనను ఆచరణలో పెడుతూ వెంటనే నేషనల్ డిఫెన్స్ అకాడమి పరీక్ష వ్రాసి అనూహ్య విజయం సాధించాడు.అప్పుడు ఇతడి వయసు 17 ఏళ్ళు మాత్రమే ! దేశ వ్యాప్తంగా 300 మందిని మాత్రమే ఈ అకాడమికి ఎంపిక చేస్తారు. ఈ 300 మందిలో రాజారెడ్డి ఒకడుగా ఎంపిక కావడం అనేది నిజంగా గర్వకారణం.

#మిలటరీ_కెరీర్  
 
1998 డిసెంబర్లో ఇతడి మిలటరీ కేరీర్ ప్రారంభమయ్యింది. అప్పుడు రాజారెడ్డి వయసు 18 ఏండ్లు. 

తమ పిల్లలు సైన్యంలో చేరడాన్ని మనలో చాలా మంది తల్లిదండ్రులు ఒప్పుకోరు.తమ బిడ్డలు తమ కళ్ళెదుట ఉండాలని....సురక్షితమైన ఉద్యోగాలు చేసుకోవాలని ఆశ పడ్తారు.కాని వీరరాజారెడ్డి తల్లి దండ్రులు మాత్రం తమ కొడుకు ఎంచుకున్న రంగానికి అడ్డుచెప్పకుండా గౌరవించారు.దేశానికి సేవ చేసే భాగ్యం తమ బిడ్డకు రావడం గొప్ప అదృష్టంగా వారు భావించారు. దేశసేవలో బిడ్డను చూసుకుని ఉప్పొంగిపోయారు. 

#పాకిస్తాన్_మూకల_దాడి 

తన ప్రతిభ పాటవాలతో కెరీర్ లో వేగంగా ఎదిగాడు రాజారెడ్డి. ఈ క్రమంలో జమ్మూ కశ్మిర్ లో కెప్టెన్ గా పనిచేస్తున్నప్పుడు రాజొరీ జిల్లా వద్ద జూలై 31,2002న పాకిస్తాన్ శత్రు మూకలు దేశంలోకి జొరబడి దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేసాయి. 
ఆపద పసిగట్టిన రాజారెడ్డి అప్రమత్తం అయ్యాడు. నిర్భయంగా ఎదురుతిరిగాడు.పోరాట సూరీడై చండప్రచండంగా చెలరేగిపోయాడు.50 తుటాలు తన శరీరాన్ని చిదిమేసినా ఆత్మస్థయిర్యాన్ని వీడక చివరి శ్వాసవరకు పోరుసలిపాడు. నెత్తుటి చినుకులు శరీరాన్ని తడిపిన ఆ ఉద్రిక్త క్షణాల్లో భారతమాత ఒడిలో అజేయమై ఒదిగిపోతూ...అమరమై నేలకు ఒరిగాడు.  

#పెళ్లయి_మూడు_నెలలు_మాత్రమే 

వీరుడు మరణించేనాటికి పెళ్ళయి 3 నెలలు మాత్రమే అయ్యింది. మళ్ళీ వస్తానని ప్రేమగా చెప్పి వెళ్ళిన తన సహచరుడు తన పారాణి ఆరక ముందే పాడె మీద పడుకున్న ఆ కన్నీటి సంధర్బం ఆ మగువ బతుకులో ఓ చీకటి స్వప్నం ! 

#ప్రభుత్వం_నిర్లక్ష్యం 

రాజారెడ్డి మరణించి 18 ఏండ్లు అవుతుంది. 
ప్రభుత్వం రజారెడ్డి త్యాగాన్ని పెద్దగా గుర్తించలేదు.కాబట్టే మొదట్లో అతడి విగ్రహానికి అనుమతి ఇవ్వడంలో విముఖత చూపింది. నిర్లక్ష్యం వహించింది.కాని తల్లిదండ్రులు తమ కొడుకు త్యాగం వృధా కాకూడదని...తమ కొడుకు పేరు మాసి పోకూడదని...తమ పేగుబంధం తెగిపోయినా తమ కొడుక్కి దేశంతో వున్న అనుబంధాన్ని ఈ ప్రపంచం మరిచి పోకూడదని...ప్రభుత్వంతో గొడవపడి అనుమతి సాధించుకున్నారు.తమ స్వంత ఖర్చులతో కొడుకు విగ్రహాన్ని స్ట్రీట్ నం 8 హబ్సీగూడాలో ప్రతిష్టించుకున్నారు.

ఇది నిర్లక్ష్యం అనేకంటే కచ్చితంగా ఈ దేశం దౌర్భాగ్యం అనడమే సరైన మాట !
ఎక్కడో ప్రేమ వ్యవహారంలో చనిపోయిన ప్రేమికుల కోసం విగ్రహాలు కట్టాలని అడిగే ప్రజా సంఘాలు వీరుడి గురించి నోరు మెదపడం లేదు. పనికిమాలిన ప్రేమ ఎవ్వరి కోసం? వాళ్ళ శరీరాల కోసం... వాళ్ళ వ్యక్తిగత జీవితం కోసం ! కానీ వీరుల త్యాగం దేశం కోసం ! ఇక్కడ కులం లేదు... మతం లేదు. ఒక కులం కోసం వీరుడు మరణించలేదు.యావత్తు జాతి కోసం ప్రాణం అంకితం ఇచ్చాడు. ఈ విచక్షణ ప్రజా సంఘాలకు ఎందుకు లేదు? 
ప్రభుత్వానికి ఎందుకు లేదు? 

 ఒక వీరుడిని గుర్తించలేని ప్రభుత్వాలు...ఒక వీరుడి కుటుంబానికి సముచిత న్యాయం చేయలేని ప్రభుత్వాలు...ఒక వీరుడి విగ్రహం ఏర్పాటుకు సరైన తోడ్పాటు అందివ్వని ప్రభుత్వాలు...ఓట్ల కోసం సీట్ల కోసం కులాలను ఎంచుకుని ఆయా కులాల్లో ' గొప్పోళ్ళు ' ఎవ్వరా అని గాలించి...వాళ్ళ మెప్పుకోసం విగ్రహాలను ఏర్పాటు చేసే ఈ స్వార్థ అసమర్థ ప్రభుత్వాలు..కళ్ళెదురుగా కనిపిస్తున్న త్యాగధనుడిని విస్మరించడం నిజంగా బాధాకరం.

#తల్లిదండ్రుల_వేదన 
"ఉన్న ఒక్కగా నొక్క కొడుకుని కొల్పోయి .... ప్రభుత్వ సహకారం లేకున్నా కష్టపడి మేము బతుకుతున్నాం.ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదో ప్రభుత్వాలకే తెలియాలి. ఒక వీరుడు మరణిస్తే ఆ త్యాగం చుట్టూ ఇన్ని ఆటంకాలా? ఈ ప్రభుత్వాలకు ఎందుకు ఇంత వివక్ష ? మాలాంటి పరిస్థితి పేదవాళ్ళకు
ఎదురైతే వాళ్ళ జీవితాలు ఏం కావాలి ? '" అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నడు రాజారెడ్డి తండ్రి కొండల్ రెడ్డి. ప్రస్తుతం తన కుటుంబం కోసం పదవీ విరమణ తర్వాత సైతం వీరు ఉద్యోగం చేసుకుంటున్నారు. 

#త్యాగధనుల_కుటుంబం 

వీర రాజారెడ్డి కుటుంబం మొదటి నుండి పోరాటాలకు పెట్టింది పేరు. రాజారెడ్డి ముత్తాత కొండల్ రెడ్డి సాయుధ పోరాట వీరుడు. వీరి స్వగ్రామం నల్లగొండ జిల్లా సైదాపురం గ్రామం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కదం తొక్కిన కొండల్ రెడ్డి, గ్రామస్తులను సంఘటితం చేసాడు. ప్రజలకు పోరాటం పాఠాలు నేర్పించి తాను ముందుండి గ్రామ దళాన్ని నడిపించాడు. ఇందుకు నిజాం ముష్కర సేన రాజాకార్ కొండల్ రెడ్డి మీద కక్ష్య గట్టింది. 28-1-1948 నాడు కొండల్ రెడ్డిని కొలనుపాక వద్ద గడ్డివాములో వేసి సజీవంగా తగులబెట్టింది. దేశం కోసం తరతరాలుగా ప్రాణత్యాగం చేస్తూ వస్తున్న రాజారెడ్డి కుటుంబం సదా స్మరణీయం. కానీ సర్కారు అలక్ష్యం మాత్రం శోచనీయం. ఇప్పటికయినా తెలంగాణ ప్రభుత్వం రాజారెడ్డి కుటుంబాన్ని గుర్తించాలి. 

#స్మారకం  
 హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 వీరరాజారెడ్డి మార్గ్ గా పిలవబడుతున్నది 
రామాంతాపూర్ లో రాజారెడ్డి స్మారక గ్రంధాలయం వున్నది.వీరి తల్లిదండ్రులు కొండల్ రెడ్డి దంపతులు హబ్సిగుడాలో నివాసం వుంటున్నారు. కొడుకు పేరిట తమ శక్తి మేర సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. 

వీరుడి త్యాగం వెయ్యేళ్ళు వర్దిల్లనీ.....

No comments:

Post a Comment