Monday, April 15, 2024

గుజ్జుల యలమందారెడ్డి

గుజ్జుల యలమందారెడ్డి
(1921 - 1997 )
( అవిశ్రాంతపోరాట యోధుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ప్రజా ఉద్యమాల్లో రాటుతేలిన నాయకుడు ...
ఉద్యమాలే ఊపిరిగా ఆరితేరిన
కార్యదక్షుడు....
అతడు
గుజ్జుల యలమందారెడ్డి !!

// బాల్యం - చదువు//

ప్రకాశం జిల్లా, పెదచెర్లోపల్లి మండలం నేరెడుపల్లి గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో
గుజ్జుల చిన్నకోటిరెడ్డి.తల్లి గురువమ్మ. దంపతులకు 
1921 జూలై 22 న మొదటి సంతానంగా యలమందారెడ్డి జన్మించారు.వీరికి ఇద్దరు తమ్ముల్లు - వారు చినయలమందారెడ్డి, బాలకోటిరెడ్డి.

వీరి తండ్రి చిన్నకోటిరెడ్డి రాజకీయ సామాజిక చైతన్యం తమ పల్లె ప్రాంతాల్లో ఏమాత్రం లేని రోజుల్లోనే తమ బిడ్డలను చదివించి ప్రయోజకులని చేయాలని కలలుగన్నాడు. ఈ క్రమంలో పెద్ద కొడుకు యలమందారెడ్డిని నేరేడుపల్లి ఎయిడెడ్ స్కూల్లో చేర్పించాడు.

అక్కడ యలమందారెడ్డి 5 వ తరగతి వరకు చదివాడు. తర్వాత 1936-38 సంవత్సరాల్లో పెద్ద చెర్లోపల్లి మండలం రామ గోవిందపురం ఎయిడెడ్ స్కూల్లో ఎనిమిదవ తరగతి వరకు చదవడం జరిగింది. 1939 - 43 లో తన సొంత చిన్నాయన గుజ్జుల నాగిరెడ్డి గారి సహకారంతో ఒంగోలు ఏ.బి.యం. హైస్కూలో పదవతరగతి వరకు చదివి ఎస్ఎస్ఎల్సి( SSLC) సర్టిఫికెట్ పొందడం జరిగింది .

[ SSLC అంటే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ . ప్రస్తుతం SSLCని ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణాలో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ( SSC) అని కూడా పిలుస్తారు, మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌లో హై స్కూల్ సర్టిఫికేట్ (HSC) అని పిలుస్తారు.]

ఒంగోలులో చదివే సమయంలో చిన్నాయన ఇంట్లో ఉంటున్నాడు కానీ ఆర్థిక అవసరాల కోసం చిన్నాయనపై ఆధారపడలేక ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. ఒకవైపు ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంటి నుండి ఎలాంటి సహాయ సహకారం అందలేదు . ఈ పరిస్థితుల్లో యలమందారెడ్డికి పుస్తకాలు ఇతర విషయాల్లో సహకారం అదించిన వ్యక్తి చాగంరెడ్డి నరసింహరెడ్డి .

తర్వాత ఉన్నత విద్యను నెల్లూరు VR కాలేజీలో అభ్యసించారు.

// విద్యార్థి ఉద్యమాల్లో//

 ఒంగోలు ఏబీయం స్కూల్లో చదివేటప్పుడు అక్కడ బాలుర హాస్టల్ పరిస్థితి అధ్వానంగా ఉండేది.కనీస సౌకర్యాలు కూడా లేనందువల్ల విద్యార్థుల అవస్థలు అంతా ఇంతా కాదు. ఈ పరిస్థితుల్లో యాజమాన్యానికి విజ్ఞాపన పత్రం ఒకటి అందజేశారు. యాజమాన్యం పట్టించుకోలేదు దాంతో హాస్టల్ పిల్లలు సమ్మెకు దిగారు. నెల రోజులు సమ్మె జరిగిన యాజమాన్యం దిగి రాలేదు. అప్పుడు యలమందారెడ్డి వీరనరసింహారెడ్డి తో కలిసి ఒంగోలు హిందూ హైస్కూల్ విద్యార్థుల మద్దతును కూడగట్టడంలో సఫలమయ్యారు. ఆ విధంగా పాఠశాలలు ఏకం కావడంతో యాజమాన్యం దిగివచ్చి హాస్టల్లో సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఈ విధంగా మొదటి ప్రయత్నంలోనే యలమందారెడ్డి తనలోని నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు.

// రాజకీయ ప్రవేశం //

 1940 ప్రాంతం నాటికే కమ్యూనిస్టులు ప్రజా ఉద్యమాలు జరుగుతూ యువజనులని ఆకర్షిస్తున్నారు . ప్రజా చైతన్యాన్ని కల్పిస్తున్నారు. ఈ క్రమంలో సామ్యవాద భావజాలం వైపు మొగ్గు చూపిన ఎలమందారెడ్డి విద్యార్థి దశలో ఉన్నప్పుడే 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు.

1943 SSLC తర్వాత నెల్లూరు విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే కమ్యూనిస్టు కార్యకలాపాలలో పాల్గొనడం జరిగింది. ఇంటర్మీడియట్ తర్వాత కనిగిరి వచ్చి అక్కడ మిత్రులు నరసింహారెడ్డి, గురు స్వామి రెడ్డి, ఓబుల్ రెడ్డి, మస్తాన్ బాలు తదితరులతో కలిసి " విద్యార్థి సంఘం " ఏర్పాటు చేయడం జరిగింది.
1944 లో విద్యార్థి సంఘం తరఫున యువజన మహాసభను కూడా నిర్వహించడం జరిగింది.

 // రాజకీయ తొలిదశలో ఉద్యమాలు//

1945 నాటికి కమ్యూనిస్టు అగ్రనాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు పార్టీ జరిపే కార్యకలాపాల్లో పాల్గొనడం యధావిధిగా జరిగిపోతున్నది. ఇదే క్రమంలో కనిగిరి ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీని విస్తరింప చేయాలని ప్రణాళిక రూపొందించుకుని కార్యకలాపాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.

1946లో పార్టీ ఆధ్వర్యంలో రైతు ఈనాము పద్ధతి రద్దు కోసం ఉద్యమించడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ గ్రామాన సభలు నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో ఉన్న రైతులందరినీ సంఘటితం చేసి , రెండు వేలకు పైగా రైతులను ఒక దండుగా కదిలించి ఆనాటి రాజధాని మద్రాస్ వరకు ఉద్యమ సెగల్ని వినిపించారు. ప్రభుత్వంతో చర్చించి ఈనాము పద్దతి రద్దు అయ్యేవరకు పోరాటం చేశారు.

1947లో జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామాల్లో సభలు నిర్వహించి, ప్రజా కళారూపాలైన బుర్రకథలు చెప్పించి ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరిగింది. ఈ క్రమంలో ముందడుగు పోతుగడ్డ వంటి గ్రామాల్లో బహిరంగ సభల్ని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమాన్ని కేవలం తమ కనిగిరి తాలూకా పరిధి వరకే పరిమితం చేయకుండా, సమీప కందుకూరు ఉదయగిరి తాలూకాలో కూడా ఉద్యమాన్ని విస్తరింప చేయడం జరిగింది.

 //తెలంగాణ సాయుధ పోరాటం - రహస్య జీవితం//

 1946 - 47 ప్రాంతంలో తెలంగాణలో సాయుధ పోరాటం ఉదృతంగా జరుగుతున్నది. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య వ్యవస్థ,రజాకర్ల అరాచకాలు, తెలంగాణ ప్రాంతాన్ని అట్టుడికి వస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా సాయిధ పోరాటానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. తెలంగాణ నాయకులు ఆంధ్ర ప్రాంతంలో ఆయుధ శిక్షణ కూడా తీసుకుని ఉన్నారు.. ఆంధ్ర ప్రాంత వామపక్ష నాయకులు తెలంగాణ సాయుధ పోరాటంలో తమ వంతు పాత్ర నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి విపరీత పరిస్థితుల్లో యలమందారెడ్డి
 1948 ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటానికి సంఘీభావంగా రహస్యంగా నల్లమల్ల అడవిలోకి ప్రవేశించాడు. నాయకులతో ఉన్న అదివరకే ఉన్న పరిచయాల ద్వారా, ముందస్తు సమాచారం ప్రకారం
యలమందారెడ్డిని సాయిధ పోరాట నాయకుడు అడవుల్లో రహస్య స్థావరాల్లోకి ఆహ్వానించారు.

 1948లో సైనిక చర్య తర్వాత నిజాం లొంగిపోయినప్పటికీ వాయిదా పోరాటం సంపూర్ణంగా విరమించబడలేదు. పోరాటానికి కొనసాగిస్తూ సాయుధ పోరాట నాయకులు తిరిగి అడవుల్లోకి వెళ్లిపోయారు అప్పుడు యలమందారెడ్డి కూడా సాయుధ పోరాట నాయకులతో కలిసి 1951 వరకు రహస్య జీవితాన్ని
 గడపడం జరిగింది 

// సంపూర్ణ రాజకీయ జీవితం //

▪️శాసనసభ్యులుగా 

 1952లో ఉమ్మడి మద్రాస్ రాష్టంలో కనిగిరి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. కనిగిరి మొదటి శాసన సభ్యుడిగా చరిత్రను అలరించాడు.1955లో తిరిగి అదే నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.

శాసనసభ్యుడుగా గ్రామసమస్యల్ని రైతులు, కార్మికులూ ఎదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీలో వరుసగా వినిపించేవాడు. శాసనసభకు యలమందారెడ్డి వస్తున్నాడు అంటే ప్రజా సమస్యలను పట్టుకుని రావడమే. . కాబట్టి అతడి గొంతుకను ప్రజా గొంతుకగా కవులు రచయితలు వ్యాసకర్తలు అభివర్ణించారు .

▪️లోక్ సభ సభ్యులుగా:

 1962లో మార్కాపురం లోక్ సభకు ఎన్నికయ్యాడు.

1966 లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేసిన సిపిఐ లోక్ సభ సభ్యులలో 
వీరమాచనేని విమలాదేవి (ఏలూరు), గుజ్జుల యలమందారెడ్డి( మార్కాపూర్), ఎద్దుల ఈశ్వర్ రెడ్డి(కడప), రావి నారాయణరెడ్డి (నల్గొండ) ఉన్నారు 

// సంపూర్ణ రాజకీయ నాయకుడిగా పోరాటాలు - ప్రజోద్యమాలు //

▪️ నాగార్జునసాగర్, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణాల కోసం పోరాటం చేసిన నాయకుల్లో మందపాటి నాగిరెడ్డి గారితో పాటు యలమందారెడ్డి ఒకరు..

▪️వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు రిటైర్డ్‌ ఇంజనీర్లతో వెలుగొండ ప్రాజెక్టు ప్లాను తయారుచేసి ప్రభుత్వానికి అందించి శంకుస్థాపన చేయించేవరకు పోరాటం ఆపలేదు.

 ▪️భారతదేశంలోని అతిపెద్ద ట్రేడ్ యూనియన్‌కు ఛైర్మన్‌గా పనిచేసాడు.

▪️వ్యవసాయంలో రోజువారీ వేతన కార్మికుల సంక్షేమం కోసం అవిశ్రాంత పోరాటం చేసాడు.. వ్యవసాయంలో సంస్కరణల కోసం అలుపు లేకుండా కృషి చేసాడు.

 ▪️ దున్నేవాడికే భూమి దక్కాలనీ, రైతులకోసం జరిగిన పోరాటాల్లో కీలకపాత్ర వహించాడు.
సీ.పీ.ఐ జాతీయ సమితి సభ్యునిగా, కేంద్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు.

//పుల్లరి పన్నుకు వ్యతిరేక పోరాటం//

వీరి జీవితంలో ఈ పోరాటం ప్రత్యేకమైనది. 1953 లో వీరు పుల్లరి విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసాడు..
ప్రజలు తమ వద్ద పశువుల్ని కలిగి ఉండటం, వాటిని పచ్చికమైదానాల్లో మేపుకోవడానికి వెళ్లడం, వంటి జీవనవిధానం పై కూడా బ్రిటిష్ ప్రభుత్వం పన్ను విధించేది . ఈ విధానాన్ని " పుల్లరి "అని పిలిచేవారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం పై కన్నెగంటి హనుమంతు తిరుగుబాటు పోరాటం చేశాడు. హనుమంతు బాటలో 
 యలమందారెడ్డి ఈ విధానాన్ని నిరసించాడు.   
పుల్లరి పన్ను విధించే నిబంధనకు వ్యతిరేకంగా పోరాటం జరిపాడు.
విజయనగర రాజులు కూడా పుల్లరి పన్ను విధించేవారు, అలాగే కాటమరాజు జానపద కథలో యుద్ధాలుకు పుల్లరి పన్ను కారణం అయ్యింది.

 //వివాహం //

వీరి వివాహం భద్రాచలం దగ్గర తూర్పాక వాస్తవ్యులు డా.మందపాటి పేరిరెడ్డి,లక్ష్మీదేవమ్మల కుమార్తె సరళాదేవి గారితో 1953 లో జరిగింది. డా.పేరిరెడ్డి గారిది మొదట గుంటూరు జిల్లా దాచేపల్లి 
వద్ద. ఇరికేపల్లి గ్రామం. బ్రిటిష్ గవర్నమెంట్ లో హెల్త్ ఇన్స్పెక్టర్ గా పనిచేసారు. నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో అక్కడ నిర్మాణ బృందానికి ప్రత్యేక వైద్య పర్యవేక్షకులుగా పనిచేసారు. నాగార్జున సాగర్ నిర్మాణం పూర్తయ్యాక భద్రాచలం జిల్లాలో స్థిరపడ్డారు. ప్రజా నాయకుడు గురజాల మాజీ ఎమ్మెల్యే మందపాటి నాగిరెడ్డి వీరికి స్వయానా తమ్ముడు.

//కుటుంబం //

యలమందారెడ్డి సరళదేవి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు భారతి. కుమారుడు రవీంద్రారెడ్డి. కూతురు లేత ప్రాయంలోనే కాలధర్మం చెందడంతో రవీంద్రారెడ్డి ఏకైక కుమారుడుగా మిగిలిపోయాడు.
గుజ్జుల రవీంద్రరెడ్డి కార్డియాలజీ డాక్టర్. తండ్రి బాటలోనే పేదల పెన్నిధి. యువకుడుగా వామపక్ష ప్రజా పోరాటాల్లో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారు జర్మనీ దేశంలో . ‘పనిచేసే వాడే పాలకుడు’ నినాదంతో పాతకేళ్లుగా తిరుగులేని NRI కమ్యూనిస్టు నాయకుడుగా కొనసాగుతున్నాడు 
జర్మనీ బ్రాండెన్‌బర్గ్ రాష్ట్ర పార్లమెంటు సభ్యుడుగా ఆల్ట్‌లాండ్స్‌బర్గ్ మేయర్ గా కొంతకాలం పనిచేసారు. తల్లిదండ్రుల బాటలో నడుస్తూ జర్మనీ నుండి నిధులు రాబడుతూ భారతదేశంలో అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

 //యలమందారెడ్డి పై ప్రజల పాటలు //

 ప.అమరుడా గుజ్జుల యలమందారెడ్డన్న
 అందుకో మా అరుణారుణ వందనం...
 నింగికెగిసిన కెరటమా నేలకొరిగిన నేస్తమా
 ఎర్ర జెండాకు ఎదురులేని చాటి చెప్పిన సత్యమా

చ 1 : ఉద్యమాలకు ఊపిరైన నేరేడుపల్లిలో పుట్టినావు
యువతి యువకుల కూడగట్టి బుద్ధులెన్నో చెప్పినావు...
నిన్ను నమ్మిన ప్రజల కొరకు వెన్నుదన్నుగా నిలిచినావు
నీ జీవితాన్ని ఎర్ర జెండాకు పూలదండగా వేసినావు...

చ 2: బడుగు జీవుల బాధలెన్నో కన్నులారా చూసినావు
చీకటైనా పేద బతుకుల్లో వెలుగు బాట నీవు వేసినావు.....
 రైతు కూలీలు ఒకటి చేసి రణము చేయ కదిలినావు
 కష్టజీవుల కంటి పాప పై కన్ను నీవు మూసినావు....

రచన, గానం : గుండాల ప్రేమ్ కుమార్

 ఇటువంటి పాటలు యలమందారెడ్డి ఉద్యమ జీవితంపై వ్యక్తిత్వం పై ఎన్నో వెలువడ్డాయి 

//సామ్యవాద స్వప్నికుడి మహాప్రస్థానం//

 యల్లమందారెడ్డి ఏప్రిల్ 27,1997 లో తన 74 వ ఏట తుది శ్వాస విడిచారు .

//విగ్రహాలు - కాలనీలు ఏర్పాటు//

 కనిగిరి ప్రాంతానికి గుజ్జుల యెల్లమందారెడ్డి సరళాదేవి దంపతులు చేసిన సేవలకు గుర్తుగా పామూరు బస్ స్టాండులో వీరిద్దరి విగ్రహాలను ఏర్పాటుచేశారు.

శింగరాయకొండ మండలంలో పేదలకు స్థలాలు ఇచ్చి గుజ్జల యలమందారెడ్డి నగర్‌ గా నామకరణం చేశారు.
వ్యాసకర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
( జులై 22 యలమంద రెడ్డి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ)


No comments:

Post a Comment