Monday, April 15, 2024

మందపాటి నాగిరెడ్డి

మందపాటి నాగిరెడ్డి ( 1918 - 2005)
( ఉద్యమనాయకుడు - ప్రజల మనిషి )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

అసాధ్యం అనేదే ఉండకూడదు...
వాయిదా పద్దతులు అస్సలు ఉండకూడదు...
పనిచేస్తే పదికాలాలు గుర్తుండి పోవాలి....
సహాయం అందిస్తే తరతరాలు బాగుపడాలి....
అని అలోచించి అడుగేసి అందరి మనసులో ముద్రించుకుపోయిన నాయకుడు మందపాటి నాగిరెడ్డి!

👉వివరాల్లోకి వెళ్తే.....

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం ఇరికేపల్లి
వాస్తవ్యులు మందపాటి వెంకటరెడ్డి,అక్కమ్మ దంపతులకు జూన్ 1, 1918లో జన్మించారు. వీరు మొత్తం 7 మంది సంతానం. ఐదు మంది అన్నాదమ్ముళ్లు, ఇద్దరు అక్కాచెల్లెల్లు.
పేరిరెడ్డి, కోటిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, నాగిరెడ్డి, అప్పిరెడ్డి, అన్నాదమ్ముళ్లు.

చిన్నప్పుడే తండ్రి వెంకటరెడ్డి చనిపోవడంతో సోదరుడు డా.పేరిరెడ్డి నీడలో తోబుట్టువులు అందరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు 

మొదటి నుండి ప్రజా పోరాటాలు , ఉద్యమాలు, వ్యవసాయం , వీటిపై ఆసక్తి ఉన్న నాగిరెడ్డి పెద్దగా చదువుకోలేక పోయాడు. యువకుడిగా ఆనాటి ఉద్యమాల్లో పాల్గొంటూ మెట్రిక్యులేషన్ వరకు మాత్రమే చదువుకున్నాడు.

👉భారత స్వతంత్ర పోరాటంలో

భారత జాతీయోద్యమ చరిత్రలో కాంగ్రెస్ వాదుల పోరాటమే ప్రముఖంగా కనిపిస్తుంది. ఆనాటి కమ్యూనిస్టు దేశభక్తుల పోరాటం గురించి సమాజానికి తెలిసింది తక్కువే. తెలంగాణ సాయుధ పోరాటం కేవలం కమ్యూనిస్టుల పోరాటం కాదు అన్నట్టుగా, భారత స్వతంత్ర పోరాటం కూడా ఒక్క కాంగ్రెస్ సొంతం కాదు. 
నాగిరెడ్డి విద్యార్థి దశలో జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని అక్కడి నుండి కమ్యూనిస్టు భావజాలం వైపు శాశ్వతంగా ఆకర్షించబడ్డాడు.సుశిక్షితుడైన సైనికుడిగా అంకితభావంతో పనిచేస్తూ.....తనతో పాటు గ్రామాల్లో అనేక మంది యువకులను పార్టీ కోసం సమీకరించగలిగాడు.

పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి ,చలసాని వాసుదేవరావు, కంభంపాటి సత్యనారాయణ, వంటి కమ్యూనిస్టు నాయకులు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి బలమైన పునాదుల్ని వేస్తున్న సమయంలో , నాగిరెడ్డి గ్రామస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేసాడు.

నాగిరెడ్డి అన్న డా. పేరిరెడ్డి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగి. అయినప్పటికీ నాగిరెడ్డి బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 
క్షేత్రస్థాయిలో పనిచేస్తూ తన పరిధిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించే నాటికి చుట్టుపక్కల గ్రామాల్లో
ప్రజలమనిషిగా పేరు సంపాదించుకున్నాడు నాగిరెడ్డి.

👉నాగార్జున సాగర్ నిర్మాణంలో

తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఆంధ్రలో గుంటూరు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన...
దేశంలోనే జలాశయాలలో రెండవ స్థానంలో ఉన్న.....
నాగార్జున సాగర్ నిర్మాణం వెనుక నాగిరెడ్డి
చేసిన చారిత్రాత్మక పోరాటాలు చరిత్రకు ఎక్కక పోవడం బాధాకరం. 1955 - 1967 మధ్య కాలంలో నిర్మిచబడిన నాగార్జున సాగర్ కోసం నాగిరెడ్డి అహర్నిశలు తపించాడు. గుంటూరు ప్రకాశం నల్లగొండ జిల్లాల్లో వేలాది ఎకరాల సాగుకోసం, ప్రజల దాహర్తి కోసం, ఆనాటి గురజాల శాసనసభ్యుడు స్థాయిలో నాగిరెడ్డి ఉద్యమ స్థాయిలో ప్రయత్నాలు చేసాడు. 
1903 లోనే నాగార్జున సాగర్ నిర్మాణానికి 
అటు బ్రిటిష్ పాలకులు, ఇటు నిజాం సర్కారు, ఆలోచన చేసింది. ఆ ఆలోచన సాకారం కోసం నాగిరెడ్డి
చేసిన పోరాటం ప్రజల హృదయాల్లో మాత్రం రికార్డు చేయబడింది. 

👉 మాచర్ల -గురజాల నియోజకవర్గాలు

1952 సాధారణ ఎన్నికలు తర్వాత, 1955 లో మాచర్ల మధ్యంతర ఎన్నికల్లో మందపాటి నాగిరెడ్డి
కమ్యూనిస్టు సిపిఐ పార్టీ నుండి గెలుపొందాడు.

1972 లో గురజాల శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు.

తన జీవితంలో మొత్తం 13 సంవత్సరాలు శాసనసభ్యుడుగా పనిచేసిన నాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకుడుగా, వివిధ ప్రజా సంఘాల గౌరవ సలహాదారుడుగా అంకిత భావంతో పనిచేశారు.

👉ప్రజల మనిషిగా

▪️నడికుడి గ్రామ సర్పంచుగా పనిచేశాడు. గ్రామాన్ని ఏకత్రాటి మీద ముందుకు నడిపించాడు. నాగిరెడ్డి సర్పంచుగా పనిచేసినంత కాలం గ్రామంలో రాజకీయాలు లేవు. అందరిదీ నాగిరెడ్డి బాటే.

▪️బ్రిటిష్ పాలకులు 1934లో పార్టీని నిషేధించారు.
కమ్యూనిస్టుల మీద నిర్బంధం కొనసాగుతున్నప్పుడు
నాగిరెడ్డి అరెస్ట్ అయ్యి కొన్నాళ్ళు జైలు జీవితం గడిపాడు.

▪️తాను శాసనసభ్యుడుగా కొనసాగుతున్నప్పుడు ప్రభుత్వం నుండి భూములు సేకరించి పిడుగురాళ్ళ నుండి గురజాల వరకు మొత్తం 5000 వేల ఎకరాలు పేదలకు పంపిణి చేసాడు.

▪️భూపోరాటం నేపథ్యంలో సీలింగ్ యాక్ట్ ప్రకారం జామిందారుల నుండి ఇష్టపూర్వకంగా భూములు సేకరించి, ఆ భూములు దుర్వినియోగం కాకుండా సన్నకారు రైతులకు పంచి ఇచ్చాడు.

▪️దాచేపల్లి వద్ద దుర్గాసిమెంట్స్ ఫ్యాక్టరీ
ఏర్పాటులో విశేష కృషి చేసాడు.ఎందరో పేదలకు నిరుద్యోగులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాడు.

▪️గురజాల షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కృషి చేసాడు.

▪️దుర్గా సిమెంట్స్, కేసీపీ సిమెంట్స్, కారంపూడి శ్రీచక్ర సిమెంట్స్, కార్మికుల హక్కుల కోసం పెద్దఎత్తున పోరాటాలు, ఆమరణ నిరాహార దీక్ష చేసి కార్మికుల హక్కులను సాధించాడు.

▪️నడికుడి - బీబీ నగర్ రైల్వే మార్గాన్ని సాధించడంలో నాగిరెడ్డి కీలక పాత్ర వహించాడు.

▪️నడికుడిని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్ధి, వేలాది మందికి ఉపాధి కల్పించడంలో నాగిరెడ్డి నికార్సయిన నాయకుడుగా విజయం సాధించాడు.

▪️నడికుడిలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయించడంలో కీలకంగా వ్యవరించాడు.

▪️నాగిరెడ్డి కృషి ఫలితంగా తెలంగాణ - ఆంధ్రప్రదేశ్
పొందుగల బ్రిడ్జి నిర్మాణం మధ్య జరిగింది.

▪️గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో రైతుల, కార్మికుల హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాడు.

▪️ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడుగా రైతు హక్కులను సాధించాడు.

▪️విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతులకు గిట్టుబాటు ధరలు కలిగించడం, వంటి ప్రజాసేవల్లో నాగిరెడ్డి ఎక్కడా వెనకడుగు వేయలేదు.

👉మార్గదర్శకుడు

నాగిరెడ్డి పెద్దగా చదువుకోకపోయినా గొప్ప రాజకీయ చతురత కలిగి ఉన్నాడు. లోక వ్యవహారం తెలిసి వ్యూహత్మకంగా ఆలోచించేవాడు. అనర్గళంగా ఆంగ్లం మాట్లాడేవాడు. చాలా విషయాల్లో కమ్యూనిస్టు (సిపిఐ) పార్టీకి కీలక విషయాల్లో మార్గదర్శకం చేశాడు కూడా.

నాగిరెడ్డి కమ్యూనిస్టు పార్టీ అయినప్పటికీ ఇతర పార్టీ నాయకులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. కొత్తతరం నాయకులు నాగిరెడ్డి ఆశీర్వాదం కోసం వచ్చేవాళ్ళు. తమ భవిష్యత్తు కోసం మార్గదర్శకాలుగా సలహాలు సూచనలు తీసుకునేవాళ్ళు.

👉కుటుంబంలో ప్రముఖులు

వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నాగిరెడ్డి కుటుంబం ప్రజల కోసం సేవలు అందించింది.

▪️నాగిరెడ్డి సోదరుడు అప్పిరెడ్డి కార్మిక నాయకుడిగా పనిచేసి, కార్మికుల హక్కులను సాధించాడు.

▪️ప్రముఖ మహిళా ఉద్యమ నాయకురాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా కమ్యూనిస్టు నాయకురాలు గుజ్జుల సరళాదేవి....వీరి సోదరుడి డా. పేరిరెడ్డి కుమార్తె.
▪️జమీందారి నిరంకుశ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడ్డ కనిగిరి ఎమ్మెల్యే గుజ్జుల ఎలమందా రెడ్డి వీరి సోదరుడి అల్లుడు.
▪️ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, వ్యూహాకర్త, సలహాదారుడు, నాగార్జునరెడ్డి CA.... వీరి తమ్ముడు డా. ఈశ్వర్ రెడ్డి కుమారుడు.

👉కుటుంబం

నాగిరెడ్డి భార్య నాగమ్మ. ఈ దంపతులకు నలుగురు ఆడపిల్లలు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కృష్ణారెడ్డి. చిన్న కుమారుడు హుస్సేన్ రెడ్డి. కృష్ణారెడ్డి తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ మరణించాడు. ప్రస్తుతం కృష్ణారెడ్డి కుమారుడు రమణారెడ్డి ఇరికెపల్లిలోనే నివసిస్తూ తండ్రి తాతల బాటలో పయనిస్తూ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు.నాగిరెడ్డి ఇద్దరు కుమార్తెలు కూడా ఇరికెపల్లిలోనే నివసిస్తున్నారు.
 
👉 స్మారకార్థం 

అధికారంలో ఉన్నప్పుడు... అధికారం కోల్పోయిన తర్వాత తన శక్తిమేరా ప్రజా సేవలో జీవితం కొనసాగిస్తూ..... అతి సాధారణ ఇంట్లో నివసించిన నాగిరెడ్డి, 11 / 3 / 2005 న శాశ్వతంగా ఈ ప్రపంచం నుండి నిష్క్రమించారు.

వారి మరణం తర్వాత ఇరికేపల్లి రహదారి మీద వారి స్మారక స్తూపం ఏర్పర్చారు. ఇరికేపల్లిలో వీరి పేరు మీద " మందపాటి నాగిరెడ్డి నగర్ " ఉన్నది
____________________________________________

No comments:

Post a Comment