Wednesday, January 2, 2019

ఆత్మకూరు సంస్థానంలో కురుమూర్తి జాతర

ఆత్మకూరు సంస్థానంలో
కురుమూర్తి దేవస్థానం
°°°°°°°°°°°°°°-సేకరణ ;తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

👉శేషాద్రి....ఏకాద్రి.....  కోటగట్టు...ఘనాద్రి.... భల్లూకాద్రి....పతగాద్రి....దేవతాద్రి అనే ఏడు కొండల్లో దేవతాద్రి పై కాంచన గుహాలో కురుమూర్తి ఆలయం ఉన్నది.దేవతాద్రిని వ్యవహారంలో  దేవరగట్టు అని పిలుస్తుంటారు. మొదట్లో ఒక రాతిగుండు స్వామి వారి ప్రవేశ మార్గంగా ఉండేది. ప్రస్తుతం ఆధునీకరించారు.   కురుమూర్తి, కురుమతి, కురుమన్న, అంటూ రకరకాలుగా పిలుచుకునే  కురుమూర్తి స్వామి....సాక్షాత్తు ఆ   వేంకటేశ్వరస్వామి అవతారంగా భక్తులు విశ్వసిస్తారు.
👉తెలంగాణ ప్రాంతం పూర్వ పాలమూరు జిల్లా ఆత్మకూరు సమీపాన చిన్నచింతకుంట మండలంలో ఉన్న కురుమూర్తి గుట్టలు  ఆధ్యాత్మిక శోభతో ప్రస్తుతం తెలంగాణ రాష్టానికి తలమానికమై  విలసిల్లుతున్నాయి.
👉దేవస్థానం క్రీ.శ. 1268 లేదా 1292 తర్వాత ప్రాంతములో ముక్కెర వంశ మూలపురుషుడు,గోన బుద్దారెడ్డి సామంతుడు  రాజా  గోపాలరెడ్డి  నిర్మించినట్టుగా లభిస్తున్న చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తున్నది. . కాగా గోపాలరెడ్డి హయాంలో  ఆలయం పెద్దగా వెలుగు చూడలేదు. వారి కుమారుడు చిన గోపిరెడ్డి క్రీ.శ.1363 ప్రాంతంలో తన  పాలనలో వివిధ అభివృద్ది  కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆలయం అభివృద్ధి పెద్దగా కొనసాగలేదని తెలుస్తున్నది. వీరి తర్వాత పాలనకు వచ్చిన చంద్రారెడ్డి  ఆలయాన్ని అభివృద్ధి పరిచి ఆలయ నిర్మాతగా  చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. కాగా ఈ విషయమై  లభిస్తున్న  చరిత్ర కొంత గందరగోళానికి తావు ఇస్తున్నది. ఎందుకంటే   1350లో  చంద్రారెడ్డి ఆలయాన్ని అభివృద్ధి పరిచినట్టుగా  సంస్థానాలు గురించి సమగ్ర సమాచారం అందించిన తూమాటి దోణప్ప పేర్కొంటున్నారు. కాగా ఈ విషయమై విశ్లేషణ జరుపుకుంటే తండ్రి పాలనలోనే కుమారుడు తన ముద్రను చూపించి ఉండవచ్చు.
 👉 మూడవ అసఫ్ జాహి సికిందర్ జా (1803-1829),నాలుగవ అసఫ్ జాహి నాసిరుద్దవౌలా (1829-1857) ఇద్దరి పాలనలో మనుగడ సాగించిన   ముక్కెర  వంశ వారసుడు  రాజా  వెంకట రెడ్డి
1810–1840 సం. మధ్య కాలంలో  ఆలయ అభివృద్ధికి  విశేష కృషి సలిపినట్టుగా తెలుస్తున్నది. ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయం  ఇదే  కాలంలో నిర్మితమైనట్టు భావిస్తున్నారు
 👉తర్వాత  నాల్గవ అసఫ్ జాహి నాసిరుద్దవౌలా  పాలనా కాలం వాడయినా  ముక్కెర వారసుడు రాజా  సోమభూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించాడు.  ఏటా జాతర నిర్వహించే సాంప్రదాయం అమలులోకి తీసుకు వచ్చాడు.
👉 తర్వాత ఆరవ అసఫ్ జాహి కాలంలో రాజా శ్రీ రాం భూపాల్ 1870-1878 మధ్య ప్రాంతంలో  ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. ఉద్దాలు అనగా పాదరక్షలు అని అర్థం. ఇక్కడ   నగారా బంగ్లా (నవత్ ఖాన బంగ్ల) వాద్యకారుల కోసం 1857-78 మధ్య కాలంలో నిర్మితమైనట్టు చెబుతున్నరు.. విశాలమైన ధర్మశాలను కూడా  ఇదే  కాలంలో నిర్మించినట్లు తెలుస్తున్నది  సీతారామభూపాలుడే ఉత్సవాల సందర్భంగా నగారా బంగ్లాను   ఉపయోగించేవారని కూడా  తెలుస్తోంది
👉కురుమూర్తి అస్సలు పేరు కురుమతి అని పండితులు పేర్కొంటున్నారు. కురు  అనగా ' చేయుట ' అని, మతి అనగా 'తలుచుట 'అని అర్థం. అంటే ఏది కోరినా చేసి పెట్టే తలంపు ఆ క్షేత్రానికి ఉన్నదని భావించవచ్చు. మొత్తానికి కాల క్రమంలో కురుమతి  కురుమూర్తిగా చెప్పబడింది అని తెలుస్తున్నది. మూర్తీభవించిన రూపం అక్కడ కొలువైనది కాబట్టే ' కురుమూర్తి ' గా చెప్ప బడి ఉండవచ్చు.
👉కురుమూర్తి ఆలయం గురించి ఎన్నో జానపద కథలు వ్యవహారంలో ఉన్నాయి.ఇవన్నీ తిరుపతి వేంకటేశ్వరస్వామి కుబేరుడి అప్పుల బాధను తట్టుకోలేక కురుమూర్తి  గుట్టల్లోకి విశ్రాంతి కోసం వచ్చి...లక్ష్మీ సమేత తన ప్రతి రూపాన్ని గుట్టల్లో వదిలి , తిరిగి తిరుపతి వెళ్లిపోయాడని ఈ కథల సారాంశం.  స్థలపురాణం కూడా  కురుమూర్తి స్వామి వెంకటేశ్వర అవతారంగా చెబుతున్నది. స్వామి స్వయంభూ అని కూడా చెబుతున్నది. ఈ  క్రమంలో స్వామి వారి ఆనవాళ్లు కనుక్కుని పాలకులు గుడి కట్టి ఉండవచ్చు అని మనం భావించవచ్చు.
👉కురుమూర్తి ఆలయానికి దళితులకు విడదీయరాని అనుబంధం ఉన్నది. ఆవు చర్మంతో స్వామి వారి పాదుకలను దళితులే తయారు చేస్తారు. పాదుకల తయారీ సమయంలో వీరు  నియమ నిష్టలు పాటిస్తారు. అంతేకాదు.. ఉద్దాల మండపంలో దళితులే అర్చకులుగా కొనసాగుతుంటారు.
👉కురుమూర్తి జాతర బ్రహ్మోత్సవాలతో ఆరంభం  అవుతుంది. ఉద్దాల  ఊరేగింపు ఇందులో ప్రధాన ఘట్టం. ఇదొక గొప్ప వేడుక. పూనకాలు... నృత్యాలు... పరవశిస్తూ తన్మయత్వంతో  పెట్టే కేకలు... ఇక్కడ కన్నుల పండుగై కనిపిస్తాయి.....వినిపిస్తాయి.  ఊరేగింపు తర్వాత పాదుకలను  మండపంలో ఉంచుతారు. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. 1999లో కొత్తగా మండపం ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలలో స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు.
👉ప్రస్తుతం సంఘ సంస్కరణల నేపథ్యలో ఈ ప్రాంతంలో నెలకొని ఉన్న ' బసివిని ' ఆచారం తగ్గిపోయింది. కాగా ఒకప్పుడు మాదిగ తెగలు బసివి ఆచారం పాటిస్తూ కురుమూర్తి జాతర సమయంలో... తమ ఆడపిల్లలకు కురుమన్న పేరిట మాల దాసరి సమక్షంలో పెళ్ళి జరిపించేవారు. కురుమన్నను మొగుడిగా నిర్ణయించేవారు.
👉స్వామి వారికీ పెట్టే నైవేద్యాన్ని ఇక్కడ ' దాసంగం ' అంటారు. స్వామి వారికి దాసులై సమర్పించుకునే ఈ దాసంగంలో 'అన్నం - పచ్చి పులుసు 'లేదా ' పులగం ' ప్రధానంగా ఉంటాయి. పులగం అంటే బెల్లంతో వండే అన్నం.
 👉ముక్కెర వంశ మూల స్తంభం గోపాల్‌ రెడ్డి  కాలం నుండి,  తెలంగాణ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యే వరకు  తమదైన అధికారాన్ని కాపాడుకుంటూ వచ్చిన  రాణి భాగ్యలక్ష్మీ దేవి (1948) దాక   మొత్తం 28 తరాల వారు అందరూ  ‘కురుమూర్తి స్వామి’ ఆలయ అభివృద్ధికి  కృషి చేసారు. ముఖ్యంగా స్వామి వారిని తమ ఇలవేల్పుగా ముక్కెర వంశస్తులు మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రజలు అందరూ కూడా కురుమూర్తిని తమ ఇలవేల్పుగా ఆరాధిస్తారు.
👉 తిరుపతికి  కురుమూర్తి ఆలయాలకు మధ్య స్పషమైన  పోలికలు ఉన్నాయి. ప్రధానంగా తిరుమలలో మాదిరి  ఇక్కడా వినాయకుడి విగ్రహం లేదు.  ఏడు కొండల మధ్య దేవాలయం ఉంది. తిరుమల మెట్ల దారిపై శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి. కురుమూర్తి దర్శనానికి వెళ్తున్నప్పుడు తిరుపతి లో ఉన్నట్టు మోకాళ్ళ గుండు కూడా ఉన్నది. అలిపిరి మండపం పోలికలతో ఇక్కడ ఉద్దాల మండపం ఉన్నది  ఈ ఆలయం ఇన్ని విదాలుగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయాన్ని పోలి వుండాటానికి చారిత్రక కారణం  విశ్లేషిస్తే.... ముక్కెర వంశస్తులు  చంద్రగిరి వాస్తవ్యులు కావడం వలన, అక్కడి తిరుపతి పోలికలతో  ఇక్కడ సరైన చోట ఆలయం నిర్మించుకుని ఉండవచ్చు. పురాణం ప్రకారం ఆలోచిస్తే  వేంకటేశ్వరుడు తిరుపతిని పోలిన ప్రదేశాన్ని ఎంచుకుని ఉండవచ్చు. మొత్తానికి  ఈ కురుమూర్తి క్షేత్రాన్ని పాలమూరు తిరుపతిగా కూడా పిలుస్తారు. పేదల తిరుపతి అనికూడా అంటారు.
👉సంస్థానాధీశులు  స్వామి వారికి 15వ శతాబ్దంలో బంగారు ఆభరణాలను సమర్పించారు.వీటిలో  శంఖుచక్షికాలు, కిరీటం, మకర కుందనాలు, భుజ కిరీటాలతో సహా వివిధ ఆభరణాలు  ఉన్నాయి.. నాటి నుండి నేటి వరకు ఆ ఆభరణాలను స్వామివారికి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తున్నది. మొదట్లో ఆభరణాలను
సంస్థానాధీశుల బంగ్లాలోనే ఉంచేవారు. ఉత్సవాల సందర్భంగా రాజభవనం ముందున్న కొలనులో ఆభరణాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు జరిపించి.... ఏనుగు అంబారీపై స్వామివారి అలంకరణలను  ఊరేగింపుగా  వేడుకగా తీసుకు వెళ్ళి స్వామివారికి అలంకరించేవారు.
👉1968లో కురుమూర్తి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖలో విలీనమైంది. ఫలితంగా 1976 నుంచి ఆభరణాలను ఆత్మకూరు బ్యాంకులోని ప్రత్యేక లాకర్‌లో భద్రపరుస్తున్నారు . ఉత్సవాల సందర్భంగా నేటికిని  ముక్కెర వంశస్థులు విచ్చేసి ఆభరణాల అలంకరణోత్సవంలో ప్రధాన పాత్ర  పోషిస్తున్నారు
👉 కురుమూర్తి స్వామి గురించి అనేక రచనలు కూడా వెలువడ్డాయి. వివిధ గ్రంధాల్లో స్వామి వారి ప్రస్తావన ఉన్నది. .

No comments:

Post a Comment