Wednesday, January 2, 2019

వనపర్తి సంస్థానంలో సావుదేవుడి జాతర

వనపర్తి సంస్థానంలో
సావుదేవుడి జాతర
°°°°°°°°°°°°°°°°°°°°సేకరణ :తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

               వనపర్తి జిల్లా రాజనగరంలో జరిగే జాతరను అక్కడి చుట్టుపక్కల ప్రజలు '' సావుదేవుడి జాతర '' గా కూడా అభివర్ణించుకుంటారు. వనపర్తి సంస్థానాన్ని పాలించిన రాజుల్లో  ఒకరైనా  రాజా రామకృష్ణారావు పేరున ప్రతి ఏటా ఈ జాతర సాగుతుంది. సావుదేవుడుగా చెప్పబడుతున్నది ఈ రామకృష్ణారావే.ఇతడు వనపర్తి సంస్థానాధీశుల్లో ప్రథమ రామకృష్ణరావు. వీరి వంశ మూలపురుషుడు  జనుంపల్లి వీరకృష్ణారెడ్డి (1510-1540).  వీరిది మోటాటి తెగ, పెనుబాల గోత్రం.వీరి స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా జనుంపల్లి గ్రామం.  రావు అనేది వీరు పొందిన గౌరవార్థం . వీరు  పెబ్బేరు మండలం 'పాతపల్లి' కి వలస వచ్చి కొన్నాళ్ళు నివాసం ఉండి, దానికి సమీపానగల 'సూగూరు'లో కోటను నిర్మించుకొని పాలన సాగించాడు. తర్వాత   వీరి వంశ క్రమాలు   కొత్తకోట, శ్రీరంగాపురం, వనపర్తిలను తమ నివాస కేంద్రాలుగా చేసుకొని 178 చిన్న, పెద్ద గ్రామాలపై తిరుగులేని  ఆధిపత్యాన్ని కొనసాగించారు. .  తమ అధీనంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో  ఆలయాలు నిర్మించి అభివృద్ధి చేసారు.
        ముఖ్యంగా ప్రథమ రామకృష్ణారావు చావు గురించి జానపదులు రకరకాల కథలు చెప్పుకుంటారు. . ఈ వరుసలోనే నేను  '' సావుదేవుడు '' పదాన్ని గ్రహించాను. కథల్ని విన్నాను. నా అనుభవంలో  వనపర్తికి ఆరు కిలోమీటర్లు దూరాన ఉన్న జగత్ పల్లి వాస్తవ్యుడు నల్లమద్ది రాంరెడ్డి తాత చెప్పిన కథ నాలో ఆసక్తిని కనబర్చింది. ఎందుకంటే వారు చెప్పిన కథ పరిసరాలను ప్రాథమికంగా నిర్దారించి చూపించేందుకు అనుకూలంగా ఉన్నది. ఈ ప్రకారం అక్కడి ప్రాంతాన్ని సందర్శించి వీడియో రూపంగా కూడా చిత్రీకరణ చేశాను గమనించగలరు.  ఆ కథ వివరాల్లోకి వెళ్తే  👇
        గోపాల్ పేట సంస్థానాధీశుడికి, రామకృష్ణారావుకు మధ్య యుద్ధం జరిగింది. యుద్దానికి కారణాలు ప్రాంతాల ఆక్రమణలు. అయితే గోపాల్ పేట సంస్థానానికి వనపర్తి సంస్థానానికి మధ్య సంబంధం పరిశీలిస్తే......వనపర్తి సంస్థానాధీశుల్లో అష్టభాషి బహిరి గోపాల్ రావు  ప్రసిద్ధుడు. ఈ  వంశంలో బహరి బిరుదము పొందిన మొదటి వ్యక్తి. ఎనిమిది భాషల్లో నిష్ణాతుడు. ఇతడి పేరుమీదే  ఇతడి దత్తపుత్రుడు   మూడవ వెంకటరెడ్డి '' గోపాల్ పేట ''  సంస్థానాన్ని స్థాపించి,  తన తమ్ముడు రంగారెడ్డిని సంస్థానాధీశుడిగా నియమించాడు. వీరు  ప్రథమ రామకృష్ణారావుకు  7,8, తరాలు ముందు వారు. మొత్తానికి ఈ యుద్ధం  అటు రాజపేటకు ఇటు రాజనగరానికి సమీపంగా ఉన్న రెండు గుట్టల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో రామకృష్ణారావు మరణించారు. వారు అధిరోహించివచ్చిన రథం అక్కడే మట్టిలో కూరుకుపోయింది అనేది కథనం. రథం కూరుకుపోయిన  ప్రాంతంలో  ఇప్పటికీ సువాసనలు గుబాళిస్తుంటాయని..... కానీ రథం ఎక్కడ ఉన్నదనే సంగతి నిర్ధారణ జరగడం లేదనేది కూడా ఒక కథ. కాగా ఇటీవలి కాలంలో ఆ గుట్టల ప్రాంతంలో ఎదో విశేషం ఉన్నదని అధికారిక పర్యటనలు పరిశోధనలు జరగడం.... వినిపిస్తున్న జానపద కథకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
        వినిపిస్తున్న రెండవ కథలోకి.....వెళ్తే రాజా రామకృష్ణారావుకు గుర్రపు స్వారి అంటే  మిక్కిలి ఆసక్తి. ఈ  క్రమంలో ప్రతి ఏడాది రాజనగరం ఊరివెలుపల  గుర్రపు పందేలు నిర్వహించేవాడు. గుర్రం ప్రయాణించే మార్గంలో కొన్ని మైళ్ళ వరకు  అడ్డంగా తాళ్లు  కట్టించి వాటిపైనుంచి గుర్రాన్ని దూకిస్తూ పోయేవాడు. ఈ క్రీడలో వినోదిస్తున్న సమయంలోనే వారు  ప్రాణాలు కోల్పోయాడు.
           ఈ కథల వెనుక నిజానిజాలు ఎట్లా ఉన్నప్పటికీ..... ప్రథమ రామకృష్ణారావు హేవళంబి నామ సంవత్సరం భాద్రపద మాసం శుక్రవారం నాడు జన్మించి,   చిత్రభాను నామ సంవత్సరం కార్తీక మాసం సోమవారం నాడు మరణించిట్టుగా  సమాధిపై వేయించిన శాసనం ద్వారా తెలుస్తున్నది. అట్లాగే సమాధిపై  వేయించిన తెలుగు అంకెలను తర్జుమా చేసుకుంటే  1699-1745 మధ్య కాలంలో  44 ఏండ్లు  జీవించినట్టుగా తెలుస్తున్నది.( బహుశా ఈ అంకెలు తెలుగు కాకపోవచ్చును??? ). కానీ ఇప్పటి వరకు లిఖించబడిన చరిత్రలో వీరి కాలం  1807 నుండి  1822 వరకు సంస్థాన భాద్యతలు స్వీకరించినట్టుగా  తెలుస్తున్నది.   వీరి పాలనా కాలంలోనే  రాజధానిని శ్రీరంగాపురం నుండి వనపర్తికి మార్చాడు.  వనపర్తి  అనగా వనాలు ఎక్కువగా ఉన్న చోటు. దీని అస్సలు పేరు ''వనం పతి ''. అంటే వనాలకు  అధిపతి అని అర్థం  ''.వనం పఱ్రు''
' వనపురి ''అనే పేర్లతో కూడా ఈ  ప్రాంతం పిలువబడేది.
 ఇప్పటికీ వనపర్తి చుట్టూ పెద్ద పెద్ద  కొండలు అడవులు విస్తరించి ఉన్నాయి. 
          రాజావారి మరణం కార్తీక సోమవారం నాడు జరిగింది కాబట్టి... ఆ  పుణ్య గడియల్ని పురస్కరించుకొని  రామకృష్ణారావు భార్య రాణి  నాంచారమ్మ  రాజానగరం దగ్గర ఒక శివాలయాన్ని నిర్మించింది. ఈ సంస్థాన ప్రభువులు నిర్మించిన మొదటి శివాలయమిది.
             రామకృష్ణాలయం పేరుతో నిర్మించిన ఈ శివాలయం పేరు విని  ఎవ్వరైనా కొత్తవాళ్లు ఇది రామాలయమో లెేకా కృష్ణాలయమో అనుకోవడం సహజం. ఇది ఏమైనప్పటికి తర్వాత పాలనకు వచ్చిన   రాణి శంకరమ్మ 1866 నుండి 1892 వరకు అంటే 24 ఏండ్లు  పాలన సాగించింది. రామకృష్ణారావు దత్త కుమారుడు రామేశ్వర రావు (ప్రథమ ).వీరి సతీమణి రాణి శంకరమ్మ. ఈ  రాణిగారు తన మామగారు
రామకృష్ణారావు పేరు చిరస్థాయిగా మిగిలిపోయే ఉద్దేశ్యంతో  గుడిని నిర్మించిన గుడిలో ప్రత్యేక కార్యక్రమాలకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో  ప్రతి యేటా కార్తీక శుద్ధ చతుర్దశి నాడు స్వామివారికి తలంబ్రాలు, పున్నమినాడు తేరు ఉత్సవం ఏర్పాటు చేసింది. కార్తీక పౌర్ణమి నాడు ప్రారంభమైన ఈ ఉత్సవాలే  జాతరగా ఒక పక్షం రోజుల వరకు  కొనసాగడానికి పునాదులు వేసింది.
          మొదట దీన్ని ''రాజావారి జాతర'' అని అధికారికంగా అనేవారు. ప్రజలు మాత్రం ''సావుదేవుని జాతర '' అని మరణించిన రాజావారిని  చనిపోయిన దేవుడిగా గుర్తుచేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ రాజనగరం పరిసర ప్రాంతాల్లో పాత కాలం పెద్ద మనుషులు
 '' సావుదేవుడి '' జాతర అనే పేర్కొంటున్నారు. కాలక్రమంలో ''రాజనగరం జాతర''గా అధికారికంగా ప్రసిద్ధికెక్కింది. అట్లాగే ఈ రాజనగరం రామకృష్ణారావు తల్లి జానమ్మ పేరిట ( నిర్మించబడింది 👇
     రా''జాన''గరం లో జానమ్మ పేరు నిక్షిప్తమై ఉండటాన్ని గమనించవచ్చు. ఇక్కడ ఉన్న చెరువు పేరు కూడా జానమ్మ చెరువు. వ్యవహారంలో  'అమ్మ చెరువు ' అంటుంటారు.
ఆ ప్రాంతంలో ఉన్న రాణిపేట,  రాజపేట, రామన్ పహాడ్  గ్రామాలు వివిధ కాలాల ప్రభువులవారి పేరు మీద ఏర్పడినవే.
          ముఖ్యంగా  ఆలయం ముందు 'రాజవిలాసం' అనే రెండంతస్తుల భవనం ఉంది. ఇది నేటికిని సంస్థానాధీశుల విశ్రాంతి మందిరం.  ఇందులో వివిధ తరాల రాజ కుటుంబీకుల చిత్రపటాలు, వారి దర్బారు సామగ్రి భద్రంగా ఉన్నది.
          సుమారు 450 ఏళ్ళు వనపర్తి సంస్థానం మనుగడ సాగించింది.  స్వాతంత్య్రానంతరం భారత దేశంలో సంస్థానం కలిసే నాటికి 15 తరాలు.....17మంది రాజులు.....ఆరుగురు రాణులు .....సంస్థానాన్ని పాలించారు.  'సప్త సముద్రాలు' అనే పేరుతో పెద్ద పెద్ద చెరువులను తవ్వించి రైతులను.......సామాన్య ప్రజలను ఆదుకోవడానికి  తమ వంతు ప్రయత్నం చేశారు.
వీరి వంశంలో దత్తపుత్రులకే పెద్దపీట వేయబడింది.
         ఒకప్పుడు జాతర ఉత్సవాల్లో భాగంగా జానపద కళాకారులకు  ప్రోత్సాహం  అందిస్తూ....  కోడి పందేలు,  ఎద్దు లకు రాతి దూలాలను లాగించే పోటీలు.,  ఘనంగా జరిగేవి. సాంస్కృతిక ప్రతిభను ఆదరిస్తూ  యక్షగానం, పౌరాణిక నాటకాలు   ప్రదర్శించబడేవి.  కవి పండిత సభలు కూడా ఘనంగా జరిగేవి. ఇవి కార్తీక పౌర్ణమి నుండి మూడు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా జరిగేవి.పండిత సభల్లో ప్రధానంగా  యజుర్వేదం,పూర్వమీమాంస,వ్యాకరణం,  న్యాయం, ద్వైతం,అద్వైతం, విశిష్టాద్వైతం,  , సాహిత్యం, ఆయుర్వేదం, వంటి   శాస్త్రాల్లో పాండిత్యం ప్రదర్శించిన వారికి విలువైన  బహుమాన సత్కారాలు ఉండేవి..   
             1949 వరకు   నిరాటంకంగా కొనసాగిన పండిత సభల్లో  హొసుదుర్గం కృష్ణమాచార్యులు, కార్యమపూడి రాజమన్నారు, మానవల్లి రామకృష్ణకవి,  ధూళిపాళ సూర్యనారాయణ శాస్త్రి, నూకల సుబ్రహ్మణ్యశాస్త్రి, వెల్లాల శంకర శాస్త్రి వంటి మహాపండితులెందరో  పాల్గొనేవారు.
కాల క్రమేణ జాతర  సంప్రదాయంలో  ఇవన్నీ కనుమరుగై పోయాయి. కాపోతే నాటి శంకరమ్మ కాలం నుండి నేటి వరకు కూడా రథోత్సవంగా జరుపుకునే '' తేరు లాగడం '' వేడుకలో భాగంగా   జాన పదులు ప్రదర్శించే కోలాటం, బొడ్డెమ్మ, చెక్క భజన, తాళ భజన, అడుగుల భజన, మొదలుగు  కళారూపాలు కనువిందు చేస్తూ వస్తున్నాయి.

No comments:

Post a Comment