Showing posts with label వ్యాసాలు. Show all posts
Showing posts with label వ్యాసాలు. Show all posts

Saturday, July 6, 2019

ఒడిబియ్యం - పరమార్థం

వొడి బియ్యం... పరమార్థం
°°°°°°°°°°°°°°°°°°°✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
#తెలంగాణ :
🌱తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్లో ''ఒడిబియ్యం''  సంప్రదాయం ఒకటి. ఇక్కడి ప్రాంతీయ పండుగలు పబ్బాలు, ఆచార వ్యవహారాలు, వీటితో పాటుగా భాష.. యాస.. మాండలికాలు విభిన్నమైనవి. కాబట్టే ప్రత్యేక అస్తిత్వాన్ని సంపాదించుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణ జీవనశైలిలో ఆడబిడ్డలకు ఉన్నతమైన స్థానం ఉన్నది.
🌱తెలంగాణలో పెళ్లయిన ఆడపడుచులకు
'' వొడిబియ్యం '' పెట్టడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ విధానాన్ని
''వొడి నించడం '' లేదా '' వొడి నింపడం '' అనికూడా అంటారు.ఆడబిడ్డలు సుమంగళిగా  ఉన్నంత కాలం పుట్టింటి నుండి పసుపు కలిపిన వొడిబియ్యాన్ని తీసుకువెళ్లి , అత్తింట్లో ఒక మంచిరోజు చూసి ఉడకబెట్టి, భోజనానికి చుట్టుపక్కల మత్తైదువలను బొట్టుపెట్టి పిలవడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం.  🌱శుభప్రదమైన పసుపు కుంకుమ, గాజులు,  పూలు పండ్లు, తమలపాకులు వక్కలు,  ఖర్జురాలు,  వెల్లుల్లిపాయలు, కొత్తబట్టలు,  కొబ్బరిగిన్నెలు, ఇవన్నీ వొడి నింపే బియ్యంలో ఉంటాయి. మంగళహారతులు ఉంటాయి.  బియ్యానికి కొలతలు ఉంటాయి. ముత్తయిదువుల సమక్షంలో ఈ తంతు కన్నుల పండుగలా జరుగుతుంది.  భార్యాభర్తల్ని ఆశీర్వదిస్తూ కొనసాగే ఈ సంప్రదాయం విశిష్ఠత గురించి ఇతర ప్రాంతాలవారికి తెలిసినా తెలియక పోయినా.... తంతు పద్దతిని చూసి పరమార్థాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉన్నది. అంతేతప్ప ఒక ప్రాంతం సంస్కృతీ సంప్రదాయాలను పనిగట్టుకుని కించపర్చాల్సిన అవసరం లేదు.
🌱గృహప్రవేశం, బారసాల / తొట్లె పండుగ, తోబుట్టువుల పెండ్లిళ్లు జరిగినప్పుడు ఇంటి ఆడబిడ్డలకు ఒడిబియ్యం పోయడం అనేది ఒక శుభ ప్రదమైన ఆనవాయితీగా వస్తున్నది.
🌱పెళ్లయిన ఏడాదిలోపు బియ్యం పెట్టడాన్ని దక్షిణ తెలంగాణలో శ్రావణపట్టి అంటారు. ఈ తంతు అతి ముఖ్యమైంది. ఆతర్వాత ఏడాదికి మళ్ళీ బియ్యం పెడుతారు. తర్వాత 5, 9, 11 సంవత్సరాల్లో పెడుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డలు లేని తల్లిదండ్రులు దేవతలకు, వరుసైన ఆడపిల్లలకు వొడినింపుతారు.
🌱ఆడపిల్ల అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కాబట్టి,పండుగలు పర్వదినాల సమయంలో తెలంగాణ ప్రజలు దేవతలకు కూడా ఒడిబియ్యం సమర్పించుకుంటారు. దేవతలు నిత్య ముత్తయిదువలు కాబట్టి తమ ఇంటి ఆడపిల్లలకు నిత్య సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అనేది ఇక్కడ నిక్షిప్తమై ఉన్న విశ్వాసం.
🌱సిరిసంపదలను కాకుండా  ముత్తయిదువతనాన్ని
ఆశిస్తూ కొనసాగేది  '' వొడి బియ్యం '' సంప్రదాయం.
ఈ సంప్రదాయానికి శాస్త్రీయంగా కూడా అర్థాలు పరమార్థాలు పొందుపరచబడ్డాయి. పెద్దబాలశిక్ష వంటి గ్రంధాల్లో కూడా వొడిబియ్యానికి వివరణ ఇవ్వబడింది. కాగా ప్రస్తుతం నేను జనసామాన్యంలో చెలామణిలో ఉన్న ''వొడి బియ్యం '' పరమార్థాన్ని సేకరించి తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాను.
👉వొడి అంటే పిల్లలు సేదతీరే / ఆడిపాడే తల్లి ఉయ్యాల. తల్లికి వొడి నించడం అంటే పిల్లాపాపలతో చల్లగా జీవించమని ఆశీర్వదించడం. అట్లాగే.. మొగుడు పెళ్ళాలు ఇద్దరికీ కలిపి వొడిబియ్యం పెడతారు కాబట్టి కలకాలం కలిసి జీవించండి అని ముక్కోటి దేవుళ్ళ సాక్షిగా ఆశీర్వదించడం కూడా !
ఈ అర్థాన్ని నేను సేకరించిన ఈ పాటలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.. 👇

హారతి గైకొనుమా... సీతమ్మ తల్లీ..
మంగళ హారతి గైకొనుమా... సీతమ్మ తల్లీ..
ఒడినిండి నీకు వరాలు కురువంగా..
సూర్య చంద్రులు నీకు సంతానం అవ్వంగ..
మళ్ళీ రావే తల్లీ ఒడిబియ్యం పిలువంగా...

#ఆంధ్రప్రాంతం

🌱ఆంధ్ర ప్రాంతంలో కొన్ని కులాల్లో వడికట్టు బియ్యం సంప్రదాయం ఉన్నది. వడికట్టు బియ్యంతో  పెళ్లి తరువాత ఒక మంచిరోజున  ఉండ్రాళ్ళు చేసి చుట్టుపక్కల వాళ్లకు పంచుతారు...
🌱ఆంధ్రప్రాంతంలో సారె పెట్టడం అంటారు. సారెలో చలివిడి ప్రధానంగా ఉంటుంది.

#రాయలసీమ

🌱  చిత్తూరు ప్రాంతంలో తక్కువే  అయినప్పటికీ మిగిలిన రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్లా  ఒడిబియ్యం ఆచారం ఉన్నది. ఇక్కడ కేవలం పుట్టింటి వాళ్ళే కాదు....చుట్టు పక్కల వాళ్ళు కూడా వారి వారి ఇళ్ళకు తీసుకెళ్ళి ఒడిబియ్యం పోస్తారు.
కనీసం 5 ఇళ్ళు ఐనా ఈ తంతులో ఉండేట్టుగా చూసుకుంటారు.
🌱  సీమసంస్కృతిలో  ఆడపడుచులకు పుట్టింటి నుండి లభించే అపురూపమైన గౌరవం, కానుక ఈ #ఒడిబియ్యం. చిత్తూరుకు అంతగా పరిచయం లేకపోయినప్పటికీ  ఈ సంస్కృతి  పరమార్థం తెలుసుకుని  కొందరు ఈ సంస్కృతిని పాటించడం మొదలెట్టారు.

#ముక్తాయింపు

🌱మొత్తానికి ఒకరి సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి కర్తవ్యం. కొన్ని పద్ధతులు పట్ల కొందరికి విశ్వాసం ఉండకపోవచ్చు.  అయినప్పయికి సమాజానికి హాని కలిగించని ఇతరుల విశ్వాసాల్ని మన్నించగలగాలి ! అట్లాగే తెలంగాణ ప్రజలు తిండికి లేక 'ఒడిబియ్యం ' రూపంలో బియ్యాన్ని స్వీకరిస్తారని కొందరు మూర్ఖులు టీవీ డిబేట్లల్లో  వెటకారం చేయడం సంస్కారం కాదు.

Monday, February 4, 2019

దువ్వెనలు.. సమాచారం

దువ్వెన వెనుక చాలా కథనే ఉన్నది
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°సేకరణ :తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

నా  తల నీ వశం... ఓహో ఎంత పరవశం !?
నీ ప్రవేశంతో నా  కేశం...ఆహా  ఎంత వివశం !?
దువ్వేనా...
ఓ నా ఈర్పెనా ...
నువ్వు లేకుండా నేనుండగలనా?
నీ స్పర్శ తగలనిదే నే గడప దాటగలనా?
నాది బట్ట తలైతేనేం?
నా జుట్టు అరణ్యమైతేనేం?
నీవు
నా సంస్కారానికి సూత్రానివి
నా సౌందర్యానికి సాధనానివి !!
అవును !
నిత్యావసరాల్లో దువ్వెన ప్రాముఖ్యం కీలకమైనది.సిగ  కట్టులో   ఈ దువ్వెన అవసరాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. లింగ  భేదం  లేకుండా దువ్వెన వినియోగం కొనసాగుతున్నది. ముఖ్యంగా పురుషుల జేబుల్లో అవసరమైతే డబ్బు ఉండక పోవచ్చేమోగాని .... దువ్వెన లేకుండా ఉండదు అనేది వాస్తవం !
        👉 దువ్వెనలో  మరో రకం  ఈర్పెన.గ్రామీణులు దీనిని ఈర్వాన. ఈర్వేన, అని పిలుస్తుంటారు.
చిక్కంటి,చిక్కోల,పన్నె, కేశమార్జకము,ప్రసాధని   
అనేవి దువ్వెన పర్యాయ పదాలు.
*బహుజనపల్లి సీతారామచార్యుల వారు తమ
శబ్దరత్నాకరంలో దువ్వెన పదానికి అర్థంగా
' కంకతము ' ' కంకతిక ' శబ్దాలను ప్రయోగించారు.
' కంకతి ' కూడా దువ్వెన పర్యాయ పదమే. ఇక్కడ  'కంకతిక'  ' కంకతి ' స్త్రీ విశేషాలు . అంటే దువ్వెన స్త్రీ జీవనశైలిలో ఒక ముఖ్య భాగంగా మనం గ్రహించవచ్చును.
      👉 5000 సంవత్సరాలనుండే దువ్వెనలను మనిషి  ఉపయోగిస్తున్నట్టు  వివిధ కథనాలు ఆధారంగా తెలుస్తున్నది.  చారిత్రక,  శాస్త్రీయ ,గ్రంథాలలోను... ప్రాచీన జానపద కథల్లోనూ  దువ్వెనల గురించిన ప్రస్తావన ఉన్నది. చరిత్ర పుటల్లో రాణులు , మహారాణులు తమ శిరోజాలను దువ్వుకున్నట్టుగా కథనాలు ఉన్నాయి.చాలా జానపద కథలు దువ్వెన చుట్టూ తిరిగి ఉన్నాయి.
     👉'దువ్వెన బెండ' అనేది ఒక ప్రాచీనమైన మొక్క. దీనిని తుత్తురు బెండ అనికూడా అంటారు. వీటి కాయల్ని  దువ్వెన కాయలు లేదా తుత్తురుకాయలు  అని  అంటారు.ఇవి దువ్వెన మొనలను పోలి ఉంటాయి.  ఇది మాల్వేసి కుటుంబానికి చెందిన ఒక ఔషధ మొక్క.  శాస్త్రీయగా  ఈ మొక్కను అబులాటిన్ ఇండికం అంటారు. చెట్టు కాయను  బట్టి 'దువ్వెన ' పేరు స్థిరపడి ఉండొచ్చు అనేది కూడా  ఒక అంచనా.
     👉 ఆది మానవుడికి దువ్వెన గురించి తెల్వదు. కాగా నాగరికత ఆరంభంలో  మన ఆది మానవులు  తమ కేశాలను నీళ్ళల్లో ముంచి కడుక్కుని, అడవుల్లో దొరికే సుగంధ ఆకుల పుష్పాల  రసాలను పూసుకునేవాళ్లుగా చెప్పబడుతున్నది.అట్లాగే  పురాతన ఈజిప్టులో మానవులు   తమ  కేశాలను ఔషదాలు కలిపిన  నీటితో శుభ్రం చేసుకునే వారుగా తెలుస్తున్నది. ఆ తర్వాతి కాలంలో   తైలాలు, సుగంధ్ వస్తువులను  కేశాలకు పూసుకుని సంస్కరించుకునడం తెలుసుకున్నారు.
     👉 కాలక్రమంలో ఆది మానవుడు  జుట్టుని  చేతి వేళ్ళతో, రంపపు టంచు ఆకులతో,  రాళ్లతో, ముళ్ళతో , కర్ర పుల్లలతో, చేపల అస్థిపంజరాలతో దువ్వుకునడం అలవర్చుకున్నాడు. 
        ఈ క్రమంలో తొలిసారిగా  దువ్వెనలు జంతువుల ఎముకలు, కొమ్ములు, ఏనుగు దంతాలు,  తాబేలు డిప్పలు, కర్రలతో  తయారుచేయబడ్డాయి.
       నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత వజ్రాలు, నవరత్నాలు,  వెండి, బంగారం, ఇత్తడి, రాగి, పంచలోహం, అల్యూమినియం, గాజు, తగరము వంటి లోహాలతో  దువ్వెనలు తయారు చేసారు. రాణులు మహారాణులు ఖరీదైన వజ్రం,  నవరత్నాలు, బంగారు దువ్వెనలు ఉపయోగించినట్టు జానపద కథలు తెలియ జెప్తున్నాయి.
       18,19, శతాబ్దాల్లో సంపన్న కుటుంబాలు సైతం వజ్రాలు నవరత్నాలు పొదిగిన  బంగారు దువ్వెనలు....గంధపు చెక్కలతో  చేసిన దువ్వెనలు, లేదా ఏనుగు దంతపు దువ్వెనలను ఉపయోగించిన దాఖలాలు వంశ చరితల ఆధారంగా తెలుస్తున్నది.   వారి ఇండ్లల్లో  ఈ దువ్వెనలు ప్రముఖ స్థానంలో ప్రత్యేకంగా  వుంచబడేవి . ఆయా కుటుంబాలు ఎంత ధనవంతమైనవో  ఈ  దువ్వెనలు  ఒక  సంకేతంగా తెలియజెప్పేవి. ముఖ్యంగా ఖరీదైన దువ్వెనలు ఆ కాలంలో ఒక హోదా, ఒక గౌరవం, ఒక ప్రతిష్ట.
         18వ శతాబ్దంలో  ఐరోపాలో దువ్వెన కేవలం స్త్రీ అలంకరణ సామగ్రిలో భాగంగా గుర్తింపబడింది .ఈ దువ్వెనలను వారు  కృత్రిమ కేశాలలో గ్రుచ్చి భద్ర పరిచేవారు. ఇదే శతాబ్దంలో  స్పెయిన్‌లో స్త్రీలు  తాబేటి చిప్పలతో చేసిన దువ్వెనలు ఉపయోగించేవారు
       ఆధునిక కాలంలో దువ్వెనలను ప్లాస్టిక్ లేదా సంబంధిత పాలిమర్లను ఉపయోగించి తయారు చేస్తున్నారు. వీటినే అన్ని రకాల ప్రజలు ఉపయోగిస్తున్నారు.
     👉పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనలు ఒక చిత్ర మైన సంగతిని తెలియ జెప్తున్నాయి. అది ఏంటంటే  మధ్య యుగాలలో భారత్ ఇంగ్లాండ్, స్పెయిన్, రష్యాలలో సాంప్రదాయ ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు తమ జుట్టును ఇతరులు చూడకుండా  దాచుకునేవారు. భారతదేశంలోకొన్ని కుటుంబాలు స్త్రీ  కేశాలు కనిపించడం అంటే ఒక తప్పుగా భావించేవి.వాటిని దువ్వుకోవడం ఒక నేరంగా పరిగణించేవి.
       👉  ప్రాచీన కాలం నాటి ఎముక దువ్వెనలు ప్రస్తుతం రష్యాలో చిత్రప్రదర్శనశాలలో జాగ్రత్తపరచబడ్డాయి.
      👉19వ శతాబ్ది చివరార్ధంలో   దువ్వెన ఒక బహిరంగ అలంకార సామగ్రిగా గుర్తించబడింది. క్రమంగా అన్నిరకాల ప్రజలు దువ్వెన అవసరానికి చేరువ కావడం మొదలెట్టారు.
     ☺ ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో దువ్వెనను పలు రకాల  పేర్ల తో పిలుస్తారు. 👇
        1) వివిధ భారతీయ భాషల్లో....
            *తమిళం-షిక్కు,
            *బెంగాలీ -చిరుణి,
            *గుజరాతి -కనస్క,
            *కన్నడ -బాకణిగే,
            *హిందీ ••••ఖంగి.
       2) వివిధ ఏషియన్ భాషల్లో గమనిస్తే....
            *నేపాళీ -కోర్న్,
            *చైనీస్ -షూ,(shu),
            *కొరియన్ -బిస్(bis ),
            *మంగోలియన్ -క్యాం (cam )
       3)వివిధ యూరోపియన్ భాషల్లో...
              *ప్రెంచి -పియనే (peigne )
              *జర్మన్, డచ్, డానిష్ లలో -కమ్ (kam )
              *స్పానిష్ -పియనే (peine )
              * రష్యన్ - రస్చెస్క (rascheska)
              *ఇటాలియన్ -పెట్టినే ( pettine )
              *పోర్చుగీస్ - పెంటే (pente)
         4)మిడిల్ ఈస్టర్న్ భాషల్లో....
              * తుర్కీష్ - తరక్
              * అరబిక్ - మిషత్ ( mishat )
         5)ఆఫ్రికన్ భాషల్లో......
              *సోమాలి - షన్లో ( shanlo )
              *జులు -ఇకాము (ikamu)

Tuesday, January 29, 2019

భండారు అచ్చమాంబ

తొలి తెలుగు కథా రచయిత్రి
భండారు అచ్చమాంబ
°°°°°°°°°°°°°°°సేకరణ :తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

మొన్నటి వరకు తెలుగులో తొలి కథగా గురజాడ అప్పారావు రాసిన 'దిద్దుబాటు' పేరును చదువుకున్నాము.ఈ కథ ఆంధ్రభారతి పత్రికలో ఫిబ్రవరి 1910 సంచికలో అచ్చయ్యింది.కానీ ఇప్పుడు అదే స్థానంలో అతడి కంటే ఎనిమిదేండ్లకు ముందే
' ధన త్రయోదశి ' పేరుతో కథ రాసిన అచ్చమాంబ పేరును  చదువుకుంటున్నాము. ఈ కథ
'హిందూ సుందరి ' పత్రికలో 1902 నవంబర్ సంచికలో అచ్చయ్యింది.ఈ పత్రికను ఆ రోజుల్లో మహిళల కోసం ప్రత్యేకంగా సీతారామయ్య గారు ప్రారంభించారు.
👉స్త్రీ ఆత్మ స్థయిర్యానికి...
స్త్రీ మానసిక వికాసానికి...
నిలువెత్తు సమాధానం అచ్చమాంబ !
సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు...మనో ధైర్యం ఉంటే ఆటంకాలు ఒక లెక్క కానేకాదు... అని నిరూపించిన ఉదాత్తమైన మహిళ అచ్చమాంబ !
వీరు 1874లో కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలులో సంప్రదాయక ఉన్నత కుటుంబంలో జన్మించారు.వీరి తండ్రి కొమర్రాజు వెంకటప్పయ్య. తల్లి గంగమాంబ . వెంకటప్పయ్య మునగాల సంస్థానంలో దివానుగా పనిచేసేవాడు. సేవానిరతి.. దాన ధర్మాలు..సాహితీ ప్రియత్వం ఇతడిలో పుష్కలంగా ఉండేవి. ఇవే లక్షణాలు తర్వాతి కాలంలో అచ్చమాంబ అందిపుచ్చుకున్నది.
👉అచ్చమాంబ 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తండ్రి మరణించడంతో కుటుంబం పరిస్థితి తలకిందులు అయ్యింది.అప్పటికి అచ్చమాంబకు 3ఏండ్ల తమ్ముడు ఉన్నాడు. అతడు ఎవ్వరో కాదు తర్వాతి కాలంలో తెలుగు భాషను ఉద్ధరించిన ఘనుడు విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాతగా చరితార్థుడు చరిత్ర పరిశోధనలు పరిచయం చేసిన ఆదర్శప్రాయుడు గొప్ప సాహితీవేత్త ఉత్తమ విజ్ఞానవేత్తగా ఖ్యాతి గడించిన కొమర్రాజు లక్షణారావు.
👉తల్లి గంగమాంబ  తన ఇద్దరు పసిపిల్లలను తీసుకుని తన సవతి సోదరుడైన భండారు మాధవరావు ఇంటికి వెళ్ళింది.అతడిది నందిగామ తాలూకా కంచెల గ్రామం. కాగా నల్లగొండ జిల్లా దేవరకొండలో ఉండేవాడు  నిజాం సర్కారులో ఇంజనీరుగా పనిచేసేవాడు .వివాహితుడు.మీనాక్షి అని అచ్చమాంబ కంటే కొంచం చిన్నదయిన కూతురు కూడా ఉండేది.  విశాల హృదయంతో భర్తను కోల్పోయి వచ్చిన అక్కను ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నాడు మాధవరావు. అయితే దురదృష్టవాశాత్తు అతడి భార్య చనిపోగా. మేనకోడలు అచ్చమాంబను పెళ్లిచేసుకున్నాడు. అప్పటికి అచ్చమాంబ వయసు పదేండ్లు మాత్రమే.
👉ఊహ తెలిసినప్పటినుండే చదువు మీద ఆసక్తి ఉన్న అచ్చమాంబకు పెళ్లినాటికి కూడా అక్షరం ముక్కరాదు. పైగా ఆడపిల్ల గడప దాటి బయటకు వచ్చినా తప్పు పట్టే సమాజం ఉన్నది. తోడుగా కట్టుబాట్లు ఎక్కువగా ఉన్న కుటుంబం. అయినప్పటికీ ఆమె నిరాశ చెందలేదు. తన ఆశ కోసం తన మనో బలాన్ని ఆయుధంగా మలుచుకున్నది.ఈ పరిస్థితిలో  తమ వద్దే ఉంటూ చదువుకుంటున్న తమ్ముడు ఆమెకు చీకటిని పారద్రోలే గురువై కనిపించాడు.అందుకే లోలోపల  పట్టు పట్టింది. ఇంకేం?  తమ్ముడు చదువుతున్నప్పుడు పక్కనే కుర్చూని వింటూ తన వినికిడి శక్తి ద్వారా వాగ్దేవిని వశపరుచుకున్న మానస పుత్రికగా  తనను తాను పునర్నిర్మించుకోగలిగింది. .కాబట్టే తొలి తెలుగు కథకు పట్టపురాణియై సాహితీ చరిత్రలో తన స్థానాన్ని పరిపుష్టం చేసుకున్నది. ఆధునిక తెలుగు సాహిత్యంలో కథాప్రక్రియ ఆరంభం కాని దశలోనే కథకు శ్రీకారం చుట్టిన కారణజన్మురాలు అచ్చమాంబ. నాకు తెలిసీ ఊకొట్టె కథలు ప్రాచీనకాలం నుండి ప్రచారంలో ఉన్నాయి కాబట్టి, ఆ ప్రభావంతో కథారచనకు వీరు ప్రయోగం చేసి ఉంటారనేది నా అంచనా.
👉భర్త ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు తిరగవలసి వచ్చేది.ఈ క్రమంలో అతడికి నాగపూర్ బదిలీ అయ్యింది. అతడు తన భార్యా కూతురితో పాటుగా అక్క గంగమాంబను మేనల్లుడిని తన వెంటే తీసుకు వెళ్ళాడు.
👉వివిధ ప్రాంతాలు తిరగడం వల్ల తెలుగు భాషతో పాటుగా సంస్కృతం, హిందీ, మరాఠి, గుజరాతీ భాషల్లో అతి తక్కువ సమయంలోనే మంచి పట్టు సాధించగలిగింది అచ్చమాంబ. అంతేకాదు, సమాజాన్ని అవగాహన చేసుకుంది. తన ఆలోచనలకు పదును పెట్టింది. స్త్రీ విద్య కోసం తపించింది .స్త్రీ సమస్యల కోసం పోరాటం చేయాలని సంకల్పించింది కూడా. ఇందుకు భర్త తోడ్పాటును అందించాడు. ఫలితంగా 1902లో మచిలీపట్నంలో 'బృందావనం స్త్రీల సమాజం ' పేరిట ఒక స్త్రీ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇదే తెలుగు ప్రాంతంలో తొలి స్త్రీ సంఘం. తర్వాత వివిధ ప్రాంతాలు తిరిగి చాలా చోట్ల సంఘాలను ఏర్పాటు చేసి, స్త్రీ చైతన్యానికి తన వంతు కృషి సలిపింది.
👉 సవతి కూతురు మీనాక్షికి కూడా 10 ఏండ్లకే పెండ్లి అయ్యింది.కానీ  ఆ పిల్లకు  ఆవెంటనే మొగుడి చనిపోయాడు.అస్థితిలో మీనాక్షి పరిస్థితి అచ్చమాంబని తీవ్రంగా కలిచి వేసింది.ఓదార్పుతో పాటుగా ఆ పిల్లకు ఆత్మ విశ్వాసాన్ని నూరిపోసింది. అప్పటికి అచ్చమాంబకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు. 
👉 ఈ దశలోనే ఒకటి రెండు సంవత్సరాల కాలంలోనే ఆమె తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించింది. ఆమె రాసిన కథలు గమనిస్తే.... 👇

1)  ధనత్రయోదశి  ( హిందూసుందరి పత్రిక, 1902)
2)  గుణవతియగు స్త్రీ (తెలుగుజనానా పత్రిక )
3)  లలితా శారదులు
4)   జానకమ్మ   (తెలుగు జనానా, 1902 మే)
5)  దంపతుల ప్రథమ కలహము (హిందూసుందరి, 1902   
                                                  జూన్)
6)   సత్పాత్ర దానము   (హిందూసుందరి, 1902)
7)   స్త్రీవిద్య (హిందూసుందరి, 1902)
8 )   భార్యా భర్తల సంవాదము (హిందూసుందరిపత్రిక1903
                                               జూలై)
9)     అద్దమును సత్యవతియును  (హిందూసుందరి 1903)
10)    బీద కుటుంబము (సావిత్రి పత్రిక 1904)
11)    ప్రేమా పరీక్షణము
12)   ఎఱువుల సొమ్ము బఱువుల చేటు
                 &
13)   ప్రేమ పరీక్షణము (1898 - అలభ్యం)
14)    ఎరువుసొమ్ము పరువు చేటు (1898 - అలభ్యం)
15)    క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
16)    ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం
అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు) (చారిత్రక మహిళల జీవితాలు మృధుమధుర శైలిలో వర్ణితాలు ఇందులో ఉన్నాయి.)
17)ఒక శతకం  (అలభ్యం)
                  &
   అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు)
        తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు  సమాచారాన్ని  సేకరించి సహకారం అందివ్వగా  అచ్చమాంబ ఈ అబలా సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంథాన్ని తీర్చిదిద్దగలిగింది.
  ఈ  1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలు ఉన్నాయి. . ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.
👉అచ్చమాంబ స్త్రీల కోసం పాటుపడినప్పటికీ ఆమెది తిరుగుబాటు మనస్తత్వం కాదు. భర్త చాటున నిలబడి, భర్త ప్రోత్సాహంతో ముందుకు నడిచింది. భర్త కూడా ఆమెను  ప్రాణ స్నేహితుడిగా అర్థం చేసుకున్నాడు. తమ్ముడి అండదండలు ఆమె సాహిత్య ప్రస్థానాన్ని పరిపుష్టం చేసాయి.
👉జీవితం అందంగా  ఆనందంగా సాగుతున్న సమయంలో ఆమె ఇద్దరు పిల్లలు మరణించారు.ఆ దుఃఖం ఆమెను కలిచి వేసింది. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఆమె అనాధ పిల్లలను చేరదీసింది.
👉1902లో కాంగ్రేస్ సమావేశాలు అచ్చమాంబలో స్వాతంత్ర భావజాలాన్ని రేకెత్తించాయి. జాతీయతను ప్రేరేపించాయి.ఆ సమావేశాల్లో పాల్గొనాలని ఉవ్విళ్లూరింది. అప్పుడు ఆమె మధ్యప్రదేశ్ లోని  బిలాస్పూర్ లో ఉన్నది. సరిగ్గా ఇదే సమయంలో అక్కడ ప్లేగు వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధి గ్రస్తులకు ఆమె భర్త ఉద్యోగ ధర్మంలో భాగంగా సేవా కార్యక్రమాలను చేపట్టాడు. వద్దన్నా వినిపించుకోకుండా ఆ సేవల్లో ఆమె స్వచ్ఛందంగా పాలు పంచుకునే ప్రయత్నం చేసింది. కాని దురదృష్టవశాత్తు అదే ప్లేగు ఆమెకు సోకింది.
👉 ప్లేగు వ్యాధితో బాధ పడుతున్న అచ్చమాంబ కాళ్లకు  మేజోళ్ళు వాడాల్సి వచ్చింది. వాడకపోతే ప్రమాదం ప్రమాదం పెరిగే పరిస్థితి. ఆ కఠిన సమయంలోనూ  ఆమె తన వ్యక్తిత్వాన్ని అభిమానాన్ని కోల్పోలేదు. తాను  ధరించబోయిన మేజోళ్ళ మీద విదేశీ గుర్తులు ప్రాణం పోయినా పరవాలేదు అంటూ తన దేశభక్తిని చాటుకుంది. చివరకు ప్లేగు ముదిరి 1905 జనవరి 18న  బిలాస్పూర్ లో తన 31వ ఏట మరణించింది. బతికింది కొన్నాళ్లే అయినా జన్మకు సార్థకత సాధించుకున్న అచ్చమాంబ 1901 -1905 మధ్య కాలంలో అంటే కేవలం నాలుగేళ్ళ కాలంలోనే తరతరాల చరితలో మిగిలిపోయే ఘనతను సాధించగలిగింది.
👉 తెలుగు సాహిత్యంలో 'కొమర్రాజు అచ్చమాంబ' అనే మరొక పేరు కూడా వినబడుతుంది. ఈమె మన భండారు అచ్చమాంబ కాదు. మన అచ్చమాంబ మరణించిన సంవత్సరానికి కొమర్రాజు లక్షణారావుకు జన్మించిన మరొక ఆణిముత్యం. అంటే మన అచ్చమాంబకు మేనకోడలు అన్నమాట !

Sunday, January 27, 2019

కోళ్ల పందాలు

కోళ్లు కాదు కొదమ సింహాలే
°°°°°°°°°°°°°°°°°°వివరణ*తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
కుక్కుటశాస్త్రం... !
ఇది కోళ్ల పందాలు గురించి వివరిస్తున్నది. ఈ శాస్త్రం ప్రకారం జాతిని బట్టి పందెం కోళ్లు ఆరు రకాలు. అవి 👇
1-సితావా
2-డేగ
3-నెమలి
4-కాకి
5-పర్ల
6-రసంగి
వీటిలో ఏ జాతి కోడి మరే జాతిపై ఉసిగొల్పితే విజయం వరించి తీరుతుందో శాస్త్రం స్పష్టంగా తెలియజెప్తుంది. పందెం రాయుళ్లు ఆ ప్రకారమే కోళ్ల జాతిని కొట్లాటకై ఎంపిక చేసుకుంటారు. జాతి ఆధారంగా కోళ్ల రంగులు కూడా ఉంటాయి.
   కోళ్ల పందాలు కూడా మూడు రకాలు. అవి 👇
1-కత్తికట్టి పందెం
2-విడికాలు పందెం (డెంకీ పందెమ్)
3-ముసుగు పందెం (  ఈ పద్దతిలో
ఎవ్వరు ఏ కోడిని తెస్తారో ఎవ్వరికీ తెల్వకుండా ముసుగు వేసి తెస్తారు.బరిలో కోడిని ఒదిలేదాకా ఎవరిది  ఏ కోడోఎవ్వరికీ  తెలియదు )
ఎవ్వరి వీలును బట్టి వాళ్ళు పందెం పద్దతిని ఎంపిక చేసుకుని అనుసరిస్తారు.
    సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, ఈ శాస్త్రం ప్రకారం పందెం రాయుళ్లు పుంజుల్ని సవరిస్తారు. నువ్వా నేనా అంటూ వినోదం ముసుగులో కదనభూమిని సృష్టిస్తారు.పుంజుల తరుపున తామే మీసం మెలివేస్తారు. తొడలు చరుస్తారు. ప్రేక్షకుల వెన్ను జలదరింపజేస్తారు. లక్షలు చేతులు మారేలా బెట్టింగుల పేరుతో వాతావరణాన్ని వేడిక్కిస్తారు.
     అవును ! ఇదంతా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండగ వేళా షరా మాములుగా కనిపించే అంశం ! ప్రభుత్వం జారీచేసే నిషేదాజ్ఞలు ఇక్కడ బేఖాతరు అవుతాయి. రాజకీయ నాయకుల  బడా బాబుల జోక్యం ప్రత్యక్షంగా వేడి పుట్టిస్తుంది.
    కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి ' సై 'అంటూ ఉసిగొల్పగానే అవి కొదమసింగాలై పోరు మొదలెడతాయి. ఎవ్వరి పుంజు గెలుస్తుందో చివరి వరకు కూడా అర్థం కాక, పందెం రాయుళ్లు లోలోపలే బెంబేలు ఎత్తిపోతుంటారు. ప్రేక్షకుల ఈలలు చప్పట్లు అరుపులు ఇవన్నీ పౌరుషాన్ని రగిలిస్తుంటాయి.
    ఓడిపోయిన కోడిని "కోజ " (కోశ ) అంటారు. ఇది సంబంధిత పందెంరాయుడికి పెద్ద అవమానం. ఈ క్రమంలో ఘర్షణలు సైతం అనివార్యం అవుతున్నాయి.చెప్పాలంటే కోడి పందెం ఒక పరువు... ఒక ప్రతిష్ట... ఒక కీర్తి... ఒక కిరీటం ! అందుకే గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తూ కోళ్లకు శిక్షణ అందిస్తారు. లక్షలు ఖర్చు పెడుతూ బలమైన పౌష్టికాహారం సమకూరుస్తారు. ఈ నేపథ్యంలో కోళ్లకు వైద్య చికిత్సలు చేయిస్తారు. బలం శక్తి కోసం మాత్రలు ఇస్తారు.
అయితే పందానికి కొన్ని రోజుల ముందు కోళ్లకు తిండిని తగ్గిస్తారు. ఆకలితో కసిని రేకెత్తిస్తారు.
    పందానికి ముందు సమయం, తిథి, నక్షత్రం, చూసుకుంటారు.అవిఘ్నం కోసం గణపతిని పూజిస్తారు. దృష్టి దోషాల నివారణ కోసం నల్ల కోడిని బలిస్తారు.
    ఇటీవల కాలంలో కోడి పందాలు సంప్రదాయం ఇతర ప్రాంతాల్లోను మొదలైనప్పటికీ కృష్ణ... ఉభయ గోదావరి జిల్లాల పైనే అందరి దృష్టి ఉంటుంది. మొత్తానికి కోళ్ల పందెం అంటే ఒక హిసాయుత జూదం ! మూగజీవాల అరణ్య రోదన !