ఎస్వీ .సత్యనారాయణ
( అభ్యుదయ రచయిత - ఉద్యమశీలి )
~~~~~~~~~~~~~~~~
మట్టిలో మాణిక్యం....
శ్రమయేవ జయతే....
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది....
కోటికో నూటికో ఒక్కరు....
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు....
వంటి చైతన్య రూపాలకు నమూనా చిత్రం ఎస్ వి సత్యనారాయణ.
పేదరికం నుండి నుండి పొట్టి శ్రీరాములు తెలుగు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి వరకు ఎదిగిన ఎస్వి.సత్యనారాయణ జీవితం తన శిల్పాన్ని తానే చెక్కుకున్న నిరంతర యుద్ధం !
//వివరాల్లోకి వెళ్తే...//
1954 ఆగస్టు 16వ తేదీన హైదరాబాద్ పాత నగరం ఒంటెల బస్తీ ( గౌలిపురం ) లో రాధాబాయి విఠల్రావు దంపతులకు ఎస్పీ జన్మించాడు. వీరిది నిరుపేద కుటుంబం. తండ్రి గౌలిగూడ లోని సారాయి దుకాణంలో పని చేసేవాడు. పెంకుటింట్లో నివసించేవారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఒక పూట తింటే మరొక పూట కష్టంగా ఉండేది. చిన్నప్పటినుండి పఠనాసక్తి ఉన్న ఎస్వీ.., రాత్రి ఒంటిగంట వరకు వీధి అరుగులపై కూర్చుని వీధి దీపాల వెలుతురులో చదువుకునేవాడు. పాఠశాల సమయం అయిపోయాక ఇంట్లో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మిల్లులో బాల కార్మికుడిగా కూడా కొన్నాళ్ళు పనిచేశాడు. ఉద్యోగం వచ్చాక తన మొదటి జీతంతో తమ ఇంట్లో విద్యుత్ సౌకర్యం సమకూర్చాడు.
//16 ఏళ్లకే పదునెక్కిన కవిత్వం //
1939 లో గుండురావ్ హర్కారే, తన దత్తపుత్రుడు వెంకట్రావు స్మారకార్థం స్థాపించిన లాల్ దర్వాజా సమీపంలోని వెంకటరావు స్మారక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఈ సమయంలోనే RSS శాఖకు వెళ్లేవాడు. అక్కడ దేశభక్తి గీతాలు క్రమశిక్షణ అదనంగా అలవర్చుకున్నాడు.
ఎస్వి పదవ తరగతిలో ఉన్నప్పుడు అభ్యుదయ రచయిత శ్రీపతి గారు ఎస్వీ నోట్ బుక్ లో కవితల్ని గమనించి , కవిత శైలికి ఆశ్చర్యపోయాడు.
మానవత్వపు అమృతాన్ని ప్రపంచానికి రుచి చూపించటమే....
విశ్వ మానవుడు కోరేదీ, పోరాడేదీ ఈ అమృతం కోసమే....
నర పిశాచాల బాకుపోట్లకు
నరాలన్నీ తెగిపోయినా
ఓటమిని అంగీకరించకు.....
" రక్షించుకుందాం " శీర్షికతో ఎస్వి రాసిన ఈ కవిత్వాన్ని స్వయంగా శ్రీపతి గారే కరీంనగర్ నుండి వెలువడుతున్న విద్యుల్లత సాహితీ మాస పత్రిక కి ప్రచురణ కోసం పంపించడం జరిగింది. ఆ విధంగా గురువు శ్రీపతి గారి సహకారంతో ఎస్వీ తొలి కవిత 1970 మే నెల "విద్యుల్లత " సంచికలో ప్రచురితమయింది. అప్పుడు ఎస్వీ వయసు అక్షరాల 16 ఏళ్లు..
// 17 ఏళ్లకే అనువాదకుడు //
నాంపల్లి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. అక్కడ కవి, రచయిత, సామాజికవేత్త డాక్టర్ టీవీ నారాయణ జూనియర్ లెక్చరర్ గా పని చేస్తున్నాడు. సిడ్నీ హారీస్ రాసిన work work work పద్యాన్ని బోర్డుపై రాసి విద్యార్థులందరినీ తెలుగులోకి అనువదించమని చెప్పాడు. అత్యుత్తమంగా అనువదించిన వాళ్లలో ఎస్వీ ఒకరు
// 18 ఏళ్లకే అరసం వేదికపై ప్రసంగాలు //
సిటీ కాలేజీలో బియస్సి సైన్స్ డిగ్రీ చదువుకున్నాడు. స్టూడెంట్ అయినప్పటికీ తెలుగు భాషా సాహిత్యాలపై గట్టిపట్టు ఉండేది. ప్రముఖ తెలుగు కథా రచయిత్రి డాక్టర్ పరిమళా సోమేశ్వర్ దంపతులు ఇరువురు డిగ్రీలో ఎస్వికి ఇక్కడ గురువులు.
1972లో హైదరాబాద్లో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం మహాసభల వేదికపై పరిమళ సోమేశ్వర్ కథా సాహిత్య మీద, దాశరథి రంగాచార్య నవలా సాహిత్యం మీద ప్రసంగపత్రాల సమర్పించినట్టు ఈ దంపతులు పేర్కొంటున్నారు.
//18 ఏళ్లకే యువజన సంఘం స్థాపకుడు //
ఎస్వీ కుటుంబం నివాసం ఉంటున్న బస్తీలో ఇంటి చుట్టుముట్టు కల్తీసారా కల్తీ కల్లు దుకాణాలు ఉండేవి. ఈ కారణంగా అర్ధరాత్రి దాకా తాగుబోతులు వీధుల్లో తిరుగుతూ జనజీవనానికి ఆటంకం కలిగించే వారు. ఈ పరిస్థితుల్లో సమాజం పట్ల బాధ్యత గల పౌరుడిగా బస్తీలోని యువకులను సమీకరించి " మహోదయ యువజన సంఘం " నెలకొల్పాడు. అప్పుడు ఎస్వి డిగ్రీ మొదటి సంవత్సరం మాత్రమే చదువుతున్నాడు. అయినప్పటికీ సామాజిక పరిపక్వతతో మొండి ధైర్యంతో ఉండేవాడు సంఘం తరఫున సమస్యలను స్థానిక ప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లేవాడు. ఇందుకు తాగుబోతులు వెనక్కి తగ్గలేదు సరి కదా ....వీధుల్లో గొడవలు మరి ఇంత పెరిగాయి ఎస్వి కుటుంబం మీద దాడులు జరిగాయి. ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఎస్వి కూడా వెనక్కి తగ్గలేదు. అవకాశం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉన్నాడు.
//1969 తొలి తెలంగాణ ఉద్యమకారుడిగా //
▪️ప్రభాత భేరి
1969 తొలి తెలంగాణ ఉద్యమంలో 15 సంవత్సరాల బాలుడిగా ఎస్వీ నిర్వహించిన పాత్ర
అద్వితీయమైనది.
ఆనాటి ఉద్యమ నేపథ్యంలో తోటి యువకులతో కలిసి పాతబస్తీలో" ప్రభాతభేరి " నిర్వహించేవాడు . అప్పట్లో ప్రఖ్యాతమైన సినిమా పాటల బాణీల్లో ఉద్యమ గీతాలు రాసుకుని ప్రభాత దీనిలో పాడుతూ వీధుల వెంట తిరిగేవారు.
▪️ఎవరో - విప్లవఢంక
ఉద్యమ ఉద్ధృత దశలో ఉన్నప్పుడు రుక్మిద్దీన్, గుండోజు యాదగిరి Yadagiri Gundoju ల విప్లవఢంకా వెలువడింది. ఆ తర్వాత ఎస్పీ సత్యనారాయణ, జగదీశ్వర స్వామి, అనుముల శ్రీహరి, "విప్లవ శంఖం " వెలువరించారు. ఆనాటి ప్రభుత్వ నిషేధాలు కట్టడీలు దృష్టిలో పెట్టుకొని విప్లవ శంఖంలో గీతాల కింద రచయితలుగా
" ఎవరో " అని రాసుకోవడం అప్పట్లో ఒక సంచలనంగా మారింది. ఈ ఎవరో అనే రచయిత ఎవరు అని ఉద్యమకారుల్లో రచయితల్లో అనేక చర్చలు జరిగాయి.
"ఇది నా తెలంగాణ సంజీవదీవిరా
ఇది నా తెలంగాణ పుణ్యాల దేవిరా
ఇచటి మాగాణాలు స్వర్ణ కేదారాలు ఇచటి ప్రోతస్వినులు మధుర సుధా సుధారలు
ఇచటి పర్వతపంక్తి కోహినూరుల మాల
ఇచటి శీతోష్ణస్థితి అమ్మకౌగిలి లీల
- ఎస్వి (విప్లవ శంఖం-1969)
▪️లిఖిత పత్రికల నిర్వహణ
1969లో " నవ సాహితీ" లిఖిత మాసపత్రిక
1970 లో "ఉషస్సు" లిఖిత మాస పత్రిక
1971 లో " వేదిక " లిఖిత మాస పత్రిక
స్నేహితుల సహకారంతో నిర్వహించడం జరిగింది.
1970 ఆగస్టులో "'ఉషస్సు " సంచిక తొలిసారిగా ప్రచురణ కాబడింది.ఈ ప్రచురణ సంచికలో
" ఈ క్షణం ఏమి కానున్నదో " శీర్షికతో
ఎస్వి రాసిన కవిత్వం మచ్చ అయింది.
1969 లో తెలంగాణ విద్యార్థి సంఘం,
1971లో పాతనగర రచయితల సంఘం ఏర్పాటు చేశారు.
//అగ్గి చిగుళ్ళు పూయిస్తూ //
1973 లో తన 19 ఏళ్ల వయసులో 1969 తెలంగాణ ఉద్యమ గీతాలను సమీకరించి సంపాదకత్వం వహించి " అగ్గిచిగుళ్ళు" పేరుతో వెలువరించాడు ఎస్వి.
"మన తెలంగాణనే కబళించుచున్నారు రక్కసులదాసులై కుక్క బతుకుకన్న
ఈ విషయములోన వీర మరణంమిన్న
పన్నెండు వర్షాల బానిసత్వము చాలు జై తెలంగాణమో సమరాన మరణమో”
అంటూ ఎస్వి విశాలాంధ్ర అవతరణము పేరుతో ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి అప్పటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ధర్మాగ్రహం వ్యక్తం చేశాడు
// కుటుంబం //
ఎస్వి కుటుంబం సమసమాజ స్థాపనకు నాంది పలికింది. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కందిమళ్ళ ప్రతాపరెడ్డి కూతురు కందిమళ్ళ భారతితో ఎస్వి వివాహం నిరాడంబరంగా జరిగింది.
ఎస్వి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. తల్లిదండ్రుల బాటలోనే ఈ అమ్మాయిలు కూడా సృజన శీలురు
//ఉద్యమ గీతాల అమ్ముల పొది //
ఉస్మానియా యూనివర్సిటీలో ఎం ఎ తెలుగు, అక్కడే ." అబ్బూరి రామకృష్ణారావు కవిత్వం " మీద పరిశోధన చేసి ఎం.ఫిల్ పట్టా పొందాడు. " తెలుగులో ఉద్యమ గేయాలు " పై ఆచార్య ఎన్ గోపి పర్యవేక్షకుడుగా పిహెచ్. డి పట్టా పొందారు. ఆచార్య ఎన్ గోపి గారికి ఎస్వి సత్యనారాయణ తొలి పర్యవేక్షణ విద్యార్థి కావడం విశేషం.
" తెలుగులో ఉద్యమ గీతాలు" తెలుగు సాహిత్యంలో అత్యుత్తమ గ్రంధాల్లో ఒకటిగా అంగీకరిస్తున్నారు. ఉద్యమ గీతాలు గ్రంథం కోసం వేలాది పాటలు సేకరించాడు. తెలంగాణ సాయుధ పోరాట గీతాలు, జాతీయోద్యమ గీతాలు, ఆంధ్రోద్యమ గీతాలు, జై ఆంధ్ర గీతాలు, విశాలాంధ్ర గీతాలు, తెలంగాణ గీతాలు, కార్మిక గీతాలు ఎర్రజెండా గీతాలు, కర్షక గీతాలు, మద్యపాన నిషేధ గీతాలు, మరెన్నో గీతాలు ఉన్నాయి.
// వృత్తిలో బుద్దిజీవి - ప్రవృత్తిలో ఉద్యమశీలి //
▪️వృత్తిలో
మొదట ప్రైవేట్ లెక్చరర్ గా ఉద్యోగం ప్రారంభించి తర్వాత ప్రభుత్వ అంబేద్కర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా జీవితాన్ని ఆరంభించి, ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ప్రొఫెసర్ స్థాయికి ఎదిగాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా, ఆర్ట్స్ కాలేజీ డీన్ గా, ప్రిన్సిపల్ గా, బాధ్యతాయుతమైన ప్రామాణికమైన తనదైన ముద్ర చూపించాడు.
పదవి విరమణ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా సంస్కరణలు తీసుకువచ్చాడు.
12 మంది పీహెచ్డీ విద్యార్థులకు పర్యవేక్షకుడుగా పనిచేశారు.
ముగ్గురికి ఎం.ఫీల్ పర్యవేక్షకుడిగా పని చేశారు.
▪️ప్రవృత్తిలో
కవిగా , కథకుడిగా , వ్యాసకర్తగా, విమర్శకుడిగా,వక్తగా, ఉద్యమ కారుడుగా, పరిశోధకుడిగా తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియల్ని విజయవంతంగా సృజించిన ఎస్వి సామాజిక స్పృహ అస్థిత్వ చైతన్యం సమసమాజ దృక్పథంతో ముందుకు నడుస్తున్న నిరంతర చైతన్య జీవజ్వాల.
కవిత, విమర్శ, చరిత్ర, వ్యాసం, తదితర ప్రక్రియల్లో 22 గ్రంధాలను రచించాడు. 27 గ్రంధాలకు సంపాదకత్వం వహించాడు. " వీరి జీవితం ఒక ఉద్యమం" రచన హిందీ కన్నడ భాషల్లోకి అనువదించబడింది
అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష వర్గ సభ్యుడుగా, విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకవర్గ సభ్యుడిగా, కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా తదితర ప్రతిష్టాత్మకమైన పదవుల్ని నిర్వహించారు.
సుంకర సాహిత్య పురస్కారం, దాశరథి సాహిత్య పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ పురస్కారం, స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారం, వంటి మొత్తం 30 పురస్కారాలు సత్కారాలు అందుకున్నారు.
ప్రస్తుతం విశ్రాంత దశలో అభ్యుదయ రచయితల అధ్యక్ష వర్గ హోదాలో కొనసాగుతూ తనదైన సాహితీసేద్యాన్ని అన్ని కొనసాగిస్తున్నారు...
No comments:
Post a Comment