Saturday, April 20, 2024

బాబూ దేవీదాసు

పాండిత్యం... వేదప్రవాహం...బాబూ దేవీదాసు
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
సమర్పణం : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

విద్వత్తు నిండిన మస్తిష్కం పద్యాన్ని ఒలుకుతూనే ఉంటుంది....
వైదష్యం నిండిన గంటం స్తోత్రం ఒకటి  రాస్తూనే ఉంటుంది....
పాండిత్యం నిండిన  పలుకు  పాటై పరిమళిస్తూనే ఉంటుంది....
జ్ఞానానికి మిత్రుడిగా
ద్వైత అద్వైత ద్వజముగా 
సారస్వత ప్రాంగణంలో వికసించిన 
బ్రహ్మ తేజస్సు
ఆర్హ విద్యా నిష్ణాత 
శ్రీ రాచలపల్లి బాబు దేవీదాసులవారు !
 
▪️పరిచయం :

ఒక వంక నెలవంక
ఒక వంక సురగంగ
శిరమున చలగంగ
శివుడునంగా.....

అంటూ దేవదేవుడిని వర్ణించిన బాబు దేవిదాసుల వారు ఒక  వేద ప్రవాహం.
వీరు 1/5/ 1952 లో పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం, రాచాలపల్లి గ్రామంలో జన్మించారు.3. వీరి తల్లిదండ్రులు కీ - శే మనోరమాబాయి కీ శే రామారావు  గార్లు.

సాంస్కృతిక వికాసానికి, సాహిత్య పోషణకు కళా విస్తృతికి, ఆత్మకూరు సంస్థానం  పెట్టింది పేరు. తిరుపతి  వెంకటకవులు  ఇక్కడ  తమ  పాండిత్యాన్ని ప్రదర్శించారు. ఆస్థానకవిగా  బుక్కపట్నం శ్రీనివాసచార్యులు వారు  అఖండ అక్షర  దీప సమూహాలను  సృష్టించారు. ఇక్కడి నేలపై  నడయాడిన ఆ సాహితీ వెలుగులను స్పృషించాలానే తపనతో  బాబు దేవీదాసులవారు  1980 వ  దశకంలో ఆత్మకూరు వైపు  నడిచారు.అక్కడే స్థిరపడ్డారు.

▪️ప్రేరణ

దేవిదాసుల వారు తన బాల్యం నుండి తన 20 ప్రాయం వరకు పూర్వ  నిజామాబాద్ జిల్లా కందుకూర్తి
గ్రామానికి వెళ్ళేవారు. ఈ గ్రామం గోదావరి తీరంలో  ఉన్నది.. ఆ గ్రామ పురాతన రామాలయం ఉన్నది.  క్షేత్రపాలకుడు ( ఇక్కడ కామ  (, ) పెట్టలేదని  రాద్దాంతం చేసిన  మేతావులకు   ఈ పోస్టు అంకితం). రామచంద్రమూర్తి స్వయంభూగా వెలిసాడు. దేవీదాసుల వారు శ్రీరాముడి సన్నిధిలో 20 సం ॥ వయస్సులోనే భాస్కర రామాయణం , శ్రీ మద్రామాయణ కల్పవృక్షం సంపూర్ణంగ పెక్కుమార్లు పారాయణం చేశారు . వీరి తండ్రిగారు పరమ రామభక్తుడు.... సంకీర్తనకారులు....!  వారి సొంత ఊరు  రాచాలపల్లిలో హనుమదాలయంలో 
కార్తీకాలు , విరాటపర్వం చదవడం భజనలు చేయడం చేసేవారు . వీరి తండ్రి గారితో  పాటుగా ఆ ఊరిలో చాలమంది కీర్తనకారులు , భజనపరులు ఉండేవారు .
దేవీ దాసులవారు ఈ కార్యక్రమాల్లో  పాల్గొనేవారు . అందులో పద్యాలు పఠించే వారు.. ఆ కీర్తనలన్నీ రాములవారిచుట్టే  పరిభ్రమించేవి .ఆ విధంగా  దేవీదాసుల వారి సాహిత్యాధ్యయనమునకు రాములవారి  పద్యాలె రాచబాట వేసినాయి . వీటన్నిటి ప్రభావమే ఇప్పుడు ఒక  గొప్ప పండితుడిని  తయారు చేసింది. 

▪️వృత్తి - ప్రవృత్తి 

కవిగా, పండితుడిగా,రచయితగా, వ్యాఖ్యాతగా,వ్యాసకర్తగా పరిశోధకుడిగా, ఉపన్యాసకుడిగా, విమర్శకుడిగా, బహుముఖీయ ప్రజ్ఞతో  తన  పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్న బాబు దేవిదాసులవారు
 M.A , B.O.L, చదివారు. తెలుగు గ్రేడ్ 1 ఉపాధ్యాయుడుగా పదవి  విరమణ పొందారు.

ఆంధ్ర సంస్కృత , మహారాష్ట్ర , హిందీ , భాషలందు వీరికి ప్రావీణ్యం ఉన్నది. జ్యోతిషం, సాముద్రికములు,  
ఆయుర్వేదములందు వీరికి ప్రవేశము ఉన్నది .

ఆత్మకూరు  నందు  వీరి స్వగృహం ఒక వేదనిలయం. ఒక  గ్రంధాలయం. నిత్యం యజ్ఞ యాగాలతో , కవితా పవనాలతో, గృహం  శోభళ్ళుతుంటుంది.

▪️పాండిత్యమే ఊపిరిగా

కావ్య పరిమళాల  కవన  చంద్రికలు వీరి పాళీ  సమున్నత ప్రవాహాలు. వీరి సృజనలు వేదంలా ఘోషిస్తుంటాయి. స్వర్ణంలా భాషిస్తుంటాయి. వీరి రచనా కలశంలో  అక్షర జ్ఞాన సింధువులను గమనిస్తే 
బాల గేయ పద్య సాహిత్యాలు వీరి ప్రస్థానంలో  కనిపిస్తాయి. 1970-71 ప్రాంతంలో వీరి రచనా కాలం  ప్రారంభం అయ్యింది.ఇప్పటి  వరకు  89 - 90 వరకు  పుస్తకాలు ముద్రించారు. 

👉బాల సాహిత్యం :

*  వచనం - రచనం 
 * నెహ్రు కథలు 

👉పరిశోధక విద్యార్థుల కోసం  :

* భారతీయ విజ్ఞానవేత్తలు,
*  సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సమగ్ర జీవిత చరిత్ర. ( తెలుగురాష్ట్రాల్లో  ఏకైక సమగ్ర గ్రంథం ) .
*  పాలమూరు పురా చరిత్ర ,

👉ఆధ్యాత్మిక  రచనలు :

* శ్రీ రాఘవేంద్రులు ( అనుగ్రహ సందేశం )
* ప్రశ్నోత్తర రత్నమాలిక ( వివరణాత్మక పుస్తకం )
* నిర్వాణ షట్కం = తాత్పర్య వివరణ )
* బ్రహ్మజిజ్ఞాస ( చతు సూత్రీ అనువాదం. )
* బ్రహ్మ విద్య 
* వేదవిజ్ఞానం ( పరిశోధన గ్రంథం ) 
* శ్రీచిద్గగనచంద్రిక ( ప్రౌఢ పద్యరచన)
* శంకరా  సద్గురూ ( శతకము )
* శ్రీ రామచంద్రుడా  ( శతకం )
* భజగోవిందం  ( సంగ్రహ  వ్యాఖ్య )
* మద్వాచార్య సిద్ధాంతము. 
* వసంతం - సత్యభామ ( పద్యకావ్యం )
* ఊర్వశి ( ఖండకావ్యము )
* అచ్చులో ఆర్ష సంస్కృతీ,
* శంకరభగవత్పాదుల రచనలు -వివరణ ,
* వేదభారతి ,
* వేదము విద్యుచ్ఛక్తి,
* జీవన సాఫల్యము ,
* నా కులదేవత ( పద్యాత్మికము ),
* శ్రీ విష్ణు సహస్రనామార్థసంగ్రహము
మొదలగునవి.

వైదిక సాహిత్యంలో 
అముద్రితాలు 10 వరకు ఉన్నాయి.

👉కరపత్రాలు :

సుమారు 500 కరపత్రాలద్వారా హైందవ సంస్కృతిని ప్రచారం  చేయడం జరిగింది.

👉ఉపన్యాసాలు :

తెలుగు ఉభయ రాష్ట్రాల్లో, అమెరికా దేశంలో, వేదము ఉపనిషద్ ఇతిహాసాల పైన అద్వైతం పైన ఉపన్యాసాలు  ఇవ్వడం  జరిగింది.

👉ఇతరములు : 

వేద ఉపనిషద్ లపై సుమారు 200 వ్యాసాలూ 
శతకాలు అద్వైత భావనతో రచింపబడ్డాయి. 
ఆదిశంకరులపై  రచనలు ప్రచురించబడ్డాయి. భారతీయ సంస్కృతిపై 
వందలాది వ్యాసాలు , పీఠికలు, అనేక పత్రికలందు సాహిత్య ఆధ్యాత్మిక వ్యాసాలు, విద్యా విషయాత్మక వ్యాసంగాలు,పద్యాలు , గేయాలు, అమవాదాలు  వివిధ ప్రక్రియలపై  విశ్లేషనాత్మక రచనలు  .
 ప్రచురితం అయ్యాయి. పలు  అధ్యాత్మిక గ్రంధాలకు  సంపదకత్వం  వహించారు. 

▪️రచనాశైలికి  ఉదాహరణలు

*గేయసాహిత్యం

నా పాటలో నీవు 
నాట్యమాడేవనుచు 
నీపాటలోనేను 
నిలిచాను దేవా !
నాచూపులో నీవు వేచియున్నాడవని 
నీ చూపులో నేను 
కాచుంటి దేవా !
నాగుండెలో నీవు 
నగ్నసుఖమైతంచు 
నీగుండెలోనేను 
దాగుందు దేవా !
నావీణలోనీవు 
భావమైనావంచు 
నీవేణులో నేను 
నిండుదును దేవా !

* అనువాద సాహిత్యం

గాథా సప్తశతి అనువాదం

హృదయ హరుడగు ప్రియుడు నాయెదుటనిలువ 
కర యుగమ్మున కన్నుల గప్పుకొందు 
కడిమి మొగ్గ విధంబున పులకరించు 
తనువు నెవ్విధంబున దాచుకొందు ?

* కృతులు

వేవేల కృతులను వేంకటేశుని కిచ్చి 
ఆనంద మందడే అన్నమయ్య 
శృంగార పథములో చేరడే క్షేత్రయ్య 
పదములు మువ్వ గోపాలబాలు 
ఆపాత మధురమౌ అపురూప గీతాల
రాముని గొలువడే రామదాసు 
హరికథా స్తపతియై ఆదిభట్ల మును న 
ర్తించడే నిన్నెంచి మించు వేడ్క 

* శతకం

నేరక నేనొర్చినయనేకదురాగత దుష్ట చేష్టలే
పేరిచి పెద్దపెట్టునను భీతిల జేయుచు నున్న వయ్యనా నేరము లెల్లసైచి కడు నెయ్యము నన్గరుణించి కావే తారక రామ దాసజన తాపనివారక రామచంద్రుడా !

▪️సన్మానాలు

పండిత సన్మానాలు   జరిగాయి. పురస్కారాలు లభించాయి.
ప్రభుత్వం నుండి 1995 సంవత్సరంలో 
పాలమూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగ  అవార్డు అందుకున్నారు.
 శ్రీశ్రీశ్రీ పుష్ప గిరి శంకరాచార్యల వేదశాస్త్ర రక్షణ పరిషత్ ద్వార సన్మానాలు  పొందారు.
 కొండాలక్ష్మణ బాపుజీ  అవార్డు పొందారు .

" కవిపరమేశ్వర  " " ఆర్హ విద్యా నిష్ణాత " 
మొదలగు  విశిష్ట బిరుదులు  లభించాయి.

సాహితీ స్రష్ట.... పాండిత్యంలో దిట్ట... దేవిదాసుల వారికి గౌరవ డాక్టరేటు ఇవ్వవలసిన  అవసరం  ఉన్నది.

▪️కాశీ  విశ్వేశ్వరుడి సేవలో

శ్రీoకార రూపిణిని , మఱి 
ఓంకారాత్మకునిసమధికోజ్వల సుకలా 
లంకృత ' మృత్యుంజయ ' బిరు  
దాంకితు - బర శివను, శివుని ధ్యానింతు మదిన్. 

తన శ్లోకమే  నైవేద్యంగా  ---
తన  భక్తే అభిషేకంగా ----
దేవదేవుడికి  తన అక్షరసుమ మాలలు అర్పించిన ఘనత  దేవిదాసుల వారికి  దక్కింది. ఫలితంగా.... కాశీ పుణ్యక్షేత్రంలో  ప్రతి నిత్యం దేవదేవుడి  సన్నిధిలో      దేవిదాసుల వారిచే  రచించబడిన శ్లోకములు వేద పండితుల చేత  పఠించబడుతున్నాయి.
ఇది కైలాసవాసుడి  కృప.

▪️దేవీదాసులవారి రచనలు-  కవిపండితుల  అభిప్రాయాలు

👉శంకరా సద్గురు
బాబుదేవీదాస్ రావు గారిని  చూసినపుడు నాకామూర్తిలో సదాచార సంపన్నుడైన ఒక వేద పురుషుడు దర్శనిమిచ్చాడు .
 -డా ॥ కపిలవాయి లింగమూర్తి డి.లిట్

* శంకరా ! సద్గురూ !
 ఒక పద్యకవిగా , శాస్త్రకవిగా , పండితకవిగా , విమర్శకునిగా , భావునిగా , ఆధ్యాత్మిక వేత్తగా , నవ్య సంప్రదాయకర్తగా , బహు పురాణజ్ఞునిగా , ఆశుకవిగా , ఉత్తమ సభానిర్వాహకులుగా , వేదధర్మాభిమానిగా భారతీనిరుక్తికి శిష్యులుగా , ద్వైతాద్వైత
సిద్దాంతాల తత్త్వాహగాహకులుగా , జాతీయవాదిగ , ముఖ్యంగా ఆధ్యాత్మిక జాతీయవాదిగా ప్రఖ్యాతిగాంచిన పరమ మిత్రులు శ్రీరాచాలపల్లి బాబుదేవీదాస్ రావు గారినికూడా శంకరా ! సద్గురూ ! అంటూ పిలుచుకుందాం . ఇంత గొప్ప శతకాన్ని అందించినందుకు సత్కరిద్దాం .

---ఆచార్య కసిరెడ్డి

👉బ్రహ్మజిజ్ఞాన
ఈ గ్రంథం సరళమగు భాషలో వివరించబడింది . చక్కని తెలుగుభాషలో రచింపబడిన ఈ గ్రంథం ఆధ్యాత్మిక రంగమున అడుగిడువారలకు అత్యంతముగ ఉపయోగపడును .

--శ్రీ పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ శ్రీ విద్యానృసింహ భారతీస్వామి

👉శ్రీరాంఘవేంద్రులు
తెలుగునందు విద్వాంసులు డి.ఎల్ . బాబుదేవీదాస్ రావు గారిచే రచింపబడిన పుస్తకములోని శ్రీరాఘవేంద్ర స్వామివారి చరిత్రను మరియు వారిమహిమతో వ్రాసిన ప్రతిలో కొన్ని భాగాలను మాపాఠశాలకు చెందిన పండితులద్వార చదివించి చూడడమైనది . ' వారు ఈపుస్తకముద్వారా శ్రీరాఘవేంద్రులజీవిత చరిత్రను , మహిమలను చక్కని సరళమైన రచనతో పాఠకులకు అందించుటంలో కృతకత్యులైనారు .

--108 శ్రీశ్రీశ్రీ సుశమీంద్రతీర్ధ పాదులవారు పీఠాధిపతులు శ్రీరాఘవేంద్రస్వామి మఠం , మంత్రాలయం

ఇంకా గుంటూరు శేషంద్రశర్మ,
బ్రహ్మశ్రీ హరిలక్ష్మినరసింహశర్మ, ఆచార్య ఎస్ వి రామారావు, మాడుగుల నాగఫణిశర్మ  తదితరులు తమ  అభిప్రాయాలను తెలియపరిచి  ఉన్నారు.

▪️శాసన పరిష్కర్త

 వ్యయ ప్రయాసలకు  ఓర్చి పెద కడుమూరు శాసనాన్ని  పరిష్కరించారు. చరిత్రకు ఎక్కని గ్రామ నామాల మర్మాన్ని బహిర్గత పరిచారు.

▪️నిరంతర సాహితీ సేద్యం

ప్రస్తుతం బాబుదేవీదాసుల  వారి వయసు  70 సంవత్సరాలు. ఇప్పటికీ వారి కలం  చురుకుగా  రాస్తున్నది.  అక్షరమే  వారి ఆహారం, సంపూర్ణ రచనే  వారి  పానీయం !  నేటికిని ఆత్మకూరులో  పండిత సభలు నిర్వహించడం పలువురిని  సన్మానించడం  నిరంతరాయంగా  కొనసాగుతున్నది. నిరాడంబర జీవితం , ఉన్నత వ్యక్తిత్వం, వీరి సొంతం. 

ఎందరో మహానుభావులు  అందరికీ  వందనాలు 🙏🏼

గురువర్యుల చరవాణి సంఖ్య - 9701271906

No comments:

Post a Comment