(1920- 2001)
( సాయుధ పోరాట వీరనారీ - బందుకు ఎత్తిన తొలి మహిళ)
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
తెలంగాణ వీరనారి...
రోషమున్న పోరుదారి...
బందూకు ఎత్తిన మగువ...
నిజాంను ఎదురించిన తెగువ...
విరిసిన ఎర్రమందారం-
తరతరాలకు చెదరని శౌర్య సిందూరం...
ఆరుట్ల కమలమ్మ !
పాలకుల నిర్లక్ష్యం కమలమ్మ చరిత్ర ను కప్పేస్తున్నదా ?
కాకి కథలు కాదు....
పిట్ట కథలు కాదు....
తెలంగాణ నేల కోసం నెత్తురు చిందించిన నిజమైన కథ...
రాక్షస రజాకార్లకు ఎదురు తిరిగి పోరాడిన అనితర సాధ్యమైన కథ ....
తన రౌద్రాన్ని నెత్తురుగా చిందించి వీరగాథను లిఖించిన సాటిలేని కథ......
మరో రుద్రమగా కీర్తింపబడిన ఉత్తేజితమైన కథ.....
సాహస ముద్రగా స్థిరపడిన ఒడలు ఝలధరించే కథ...
అయినా....
అధికారిక గుర్తింపు లేదు. ఎందుకు? పోరాటానికి కూడా కులం మరకలు అంటి స్తున్నారా? స్ఫూర్తిదాయక మహిళాశక్తిని కులం పేరుతో మరుగున పడేస్తున్నారా?
ఇదే నిజమైతే రాజకీయ ఉద్దేశ్యాలు చరిత్రను మార్చలేవు. అగ్నిపుష్పంలో ఆరని మంటలే తప్ప కమురు వాసనలు ఉండవు...
సత్యమేవ జయతే.....
▪️కమలమ్మ జననం -
నల్లగొండ జిల్లా ఆలేరు తాలూకా మంతపురిలో పల్లా వెంకటరామిరెడ్డి లక్ష్మీనరసమ్మ దంపతులకు 1920 లో కమలాదేవి జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు రుక్మిణి.ఆ రోజుల్లో గ్రామాల్లో పాఠశాలలు లేవు . ఆడపిల్లలు చదువుకుంటారనే ఆలోచనలేదు. చదువుకునే అవకాశాలు లేవు . అందువల్ల ఇంటి పనులు , వంటపనులు చూసుకుంటూ అందరు ఆడపిల్లలలాగే పెరగసాగింది.కానీ చదువుకోవాలనే ఉత్సాహం ఆమె నరనరానా నిండి ఉన్నది.
▪️బాల్య వివాహం - విద్యాభ్యాసం :
తన పదకొండేళ్ల వయస్సులో కొలనుపాక గ్రామానికి చెందిన మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే వీరి పేరు కమలాదేవిగా మార్చబడింది.
చదువుకోవాలన్న ఉత్సాహంతో ఉన్న కమలాదేవి తపనను భర్త,అత్తింటివాళ్ళు, ఆదరించగా....వివాహం అనంతరం హైదరాబాదులోని మాడపాటి హనుమంతారావు స్థాపించిన ఆంధ్రా గర్ల్స్ హైస్కూలులో విద్యనభ్యసించింది. అప్పటికి రామచంద్రారెడ్డి హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారు. ఆ సమయంలో దేశమంతా స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా శాసనోల్లంఘనోద్యమం , అతివాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి. రామచంద్రారెడ్డి జాతీయద్యమ ప్రభావితుడై ఉన్నాడు.
▪️వెదేరే - ఆరుట్ల
ఆరుట్ల అనేది గ్రామం. ఆరు బాటలు కలిసే చోట ఉంది కాబట్టి అక్కడున్న గ్రామం పేరు ఆరుట్లగా స్థిరపడింది. రామచంద్రారెడ్డి ఇంటిపేరు వాస్తవానికి వెదిరె. కానీ ఆరుట్ల ఊరి పేరుతో చరిత్రలో నిలిచారు.
▪️కమలాదేవీ పేరు వెనుక కథ
ఆ రోజుల్లో జాతీయోద్యమ నాయకురాలు కమలాదేవి చటోపాధ్యాయ పేరు బహుళ ప్రచారంలో ఉండేది.. ఆ స్ఫూర్తితోనే రుక్మిణి కమలాదేవిగా మారింది. కాలక్రమేణా వీరనారిగా ఎదిగిన కమలమ్మ తెలంగాణ చరిత్రను చరితార్ధం చేశారు .
ముఖ్యంగా వీళ్ళది విప్లవ భావజాలం వేళ్ళూనుకుపోయిన కుటుంబం కాబట్టి బాల్యం నుండే విప్లవ వాతావరణాన్ని ఒంటబట్టించుకుంది. అట్లా ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన కమలమ్మ , భర్త సహకారంతో అలనాడు ప్రజలకు అండదండగా నిలిచిన ఆంధ్రమహాసభలకు హాజరై ఉత్తేజాన్ని పొందింది. సంఘహితానికై జరిగిన ఉద్యమాల్లో పాల్గొంది.
▪️సాయుధపోరాటంలో
ప్రజల కోసం , వెట్టిచాకిరి విముక్తి కోసం, దోపిడీ వ్యవస్థను తుద ముట్టించడం కోసం, కమలాదేవి
తన సగ జీవితాన్ని త్యాగం చేసింది. బందూక్ ఎత్తిన తొలి మహిళగా తన సత్తా చాటుకుంది.
1944 లో ఆరుట్ల దంపతులకు కొడుకు పుట్టాడు . 1946 లో నల్లగొండ జిల్లాలో మార్షల్ లా విధించారు . ఆంధ్రమహాసభ నాయకులపై నిర్బంధం పెరిగింది. ఈ సమయంలో పురిటి బిడ్డను తన పుట్టింటిలో వదిలి, భర్తతోపాటుగా రహస్య జీవితంలోకి వెళ్లవలసి వచ్చింది . భువనగిరి , ఆలేరు మొదలైన తెలంగాణ ప్రాంతాల్లో కమలాదేవి సాయుధ దళాల్లో పనిచేసింది .
దొరల కుటంబంలో జన్మించిన కమలాదేవి అన్ని భోగాలను త్యాగం చేసింది. ఆనాటి దయనీయ దీన జనుల కోసం సాగించిన గెరిల్లా పోరాటం.... కొనసాగించిన అజ్ఞాతవాసం.... ఆమెను సంపూర్ణముగా ప్రజలమనిషిగా చూపెడుతున్నాయి.
1 ఆయుధ శిక్షణలో ఆరితేరింది :
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో కమలాదేవి స్థానం సుస్థిరమైనది. ఆరోజుల్లోనే మగవాళ్లకు ధీటుగా
ఆయుధ శిక్షణలో ఆరితేరింది. గురి చూసి కొట్టడంలో
శిక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది
2. మహిళా గెరిల్లా దళాలు నడిపిన ధీశాలి :
పీడనలా పీడకలలా ....దుస్థితిలా దుస్సత్యంలా...తెలంగాణ అట్టుడుకుతున్న సమయంలో విమోచనోద్యమంలో నిర్భయంగా పాల్గొన్నది. పోరాటంలో భాగంగా ఊరు విడిచి అడవుల్లో గడిపింది..
సాహసంతో వ్యూహంతో 1946-48లో రజాకార్ల ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటుచేసింది. అందులో మహిళలకు ఆయుధశిక్షణ అందించింది.
తన దురాగతాలతో చెలరేగిపోయిన నిరంకుశ నిజాం సర్కారుకు సింహ స్వప్నంలా మారింది.
3. చల్లూరు ఘటన :
అప్పట్లో చలూరు గ్రామం గెరిల్లా దళాలకు ముఖ్యకేంద్రం. ఈ విషయం నిజాం సర్కారుకు తెలుసు. ఈ క్రమంలో అదునుచూసి చల్లూరు-వెంకటాపురం గుట్టలను రిజర్వు పోలీసులు చుట్టుముట్టారు. గెరిల్లా దళాలను మట్టుపెట్టాలని తుపాకీగుళ్ళవాన కురిపించారు. ఈ సమయంలో జరిగిన గెరిల్లా దళాలు నిర్వహించిన ఎదురుకాల్పుల్లో కమలాదేవి చూపించిన సాహసం అనితర సాధ్యం. భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డితో కలిసి తమ దళాలకు ఎలాంటి నష్టం కలగకుండా తెలివిగా తమదైన వ్యూహంతో ఎదురొడ్డి పోరాటం చేసింది..ఈ సమయంలో ఈ దంపతులు అమెరికన్ రైఫిల్స్ వాడారు. ఆయుధ శిక్షణలో ఆరితేరిన దంపతుల ఈ వీర ఘట్టం సాయుధ పోరాట చరిత్రలోనే విరోచితమైనది.
4.జైలు జీవితం :
1948 లో సంవత్సరంలో కమలాదేవికి
తీవ్రజ్వరం సోకింది. కొంత కాలం విశ్రాంతి అవసరం అయ్యింది. ఆ పరిస్థితిలో కమలమ్మను తల్లిగారింట్లో దించడానికి రామచంద్రారెడ్డిగారు రహస్యంగా తీసుకెళ్తున్నాడు . ఆలేరు వద్ద పోలీసులు వీరిని గుర్తించి అరెస్టు చేశారు. రామచంద్రారెడ్డిని ఖమ్మం క్యాంపుకు పంపించారు.
కమలమ్మ జ్వరంతో ఉన్నప్పటికీ కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా వరంగల్ జైలుకు పంపారు . తర్వాత వరంగల్ నుండి ఔరంగాబాద్ , సికింద్రాబాద్ జైలల్లో ఉంచారు. అట్లా రెండున్నర సంవత్సరాలకు పైగా కఠిన కారాగారవాసాన్ని అనుభవించిన కమలాదేవి 1951 చివరిలో విడుదలయ్యారు
" సంకెళ్ళు నాకు గడ్డి పరకలు " అంటూ జైలు జీవితం గడిపిన కమలమ్మ చరిత్ర సాహసానికి మారుపేరు.
▪️రాజకీయ జీవితం
ప్రజాసేవకు ఉద్యమం ఉదయమై నడిపించగా....ఆ అనుభవాల విప్లవ చురకత్తియై రాజకీయంలోకి అడుగు పెట్టి 1952 ఎన్నికలలో భువనగిరి నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికైనది. ఆ తర్వాత వరుసగా
మూడు పర్యాయాలు ఆలేరు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎనికై విజయ భావుటా ఎగురవేసింది.
శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఉప నాయకురాలిగా.... పుచ్చలపల్లి సుందరయ్య చికిత్సకోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకురాలిగా....సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించింది.
1964 లో కమ్యూనిసు పార్టీలో చీలిక వచ్చింది. అప్పుడు కమలాదేవి సిపిఐ శాసన సభాపక్షం తొలి మహిళా నాయకురాలిగా కొనసాగారు. ఒక మహిళ శాసనసభాపక్ష నాయకత్వం వహించడం అనేది చారిత్రాత్మకం. ఆతర్వాత ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మరే మహిళకు ఈ పదవి దక్కలేదు. మొదలు, చివర, రెండూ కమలాదేవిగారే !
▪️గౌరవ డాక్టరేట్
కాకతీయ విశ్వవిద్యాలయం కమలాదేవి ధైర్య సాహసాలకు గౌరవ డాక్టరేట్ అందించింది. ఈ సమయంలో ప్రశంసాపత్రంలో '' కమలాదేవి అపరరుద్రమదేవి ''గా కీర్తించడంలో ఆమె గుండెధైర్యం అర్థం అవుతుంది.
▪️ తెలంగాణ తొలి విడత ఉద్యమంలో :
1947-48 సాయుధ పోరాట ఉద్యమంలో తెగువ చూపించిన కమలమ్మ , 1969 తెలంగాణ తొలివిడత ఉద్యమంలో నూ తన శక్తిని నిరూపించుకుంది. అప్పటికి ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా అరెస్టు కాబడి చెంచల్ గూడా జైలులో కారాగారం అనుభవించింది.
▪️కాలధర్మం
జనవరి 1, 2001 లో తన 81 సంవత్సరాల వయసులో కమలమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించింది.
ఆదర్శానికి అసలు పేరు -
వీరత్వానికి పూర్తిపేరు -
కమలాదేవి !
No comments:
Post a Comment