రంగినేనిసుబ్రహ్మణ్యం ( కవి )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
పువ్వు చిన్నదయితేనేం.... అల్లంత దూరాన్ని పరిమళమై పలకరిస్తుంది !
పాట కొంచెమైతేనేం... కొండంత భావాన్ని సముద్రమై చిలరిస్తుంది....
కొందరు వ్యక్తులు కూడా ఇంతే ! చిన్న జీవితాన్ని సుస్థిరం చేసుకుంటారు. ఇందుకు నిదర్శనం రంగినేనిసుబ్రహ్మణ్యం !
వీరు బతికింది కొన్నాళ్లే అయినా సాహిత్య విస్తృతిలో విశేషంగా కృషిచేశారు. తమ వంశకీర్తిని, తమ ప్రాంతం గౌరవాన్ని, చిరస్థాయిగా నిలుపుకున్నారు.
#పరిచయం :
ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన రంగినేని రాజన్న, లక్ష్మీదేవమ్మ దంపతులకు
1950 లో సుబ్రహ్మణ్యం జన్మించారు. వీరు మొత్తం పన్నెండు మంది సంతానం. వీరిలో సుబ్రహ్మణ్యం పెద్ద వాడు, వృత్తి రీత్యా ఉపాద్యాయుడుగా కొనసాగాడు. ఒకవైపు వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ... కుటుంబ పెద్దగా బాధ్యతను నెరవేరుస్తూ... మరోవైపు ప్రవృత్తిగా సాహితీ సేద్యం గావించాడు. వాగ్దేవీ కృపతో బహుముఖాలుగా తన ప్రఙ్ఞను ప్రదర్శించాడు. పెద్దన్నగా పెద్దమనసుతో తన పేదరికాన్ని సైతం ప్రేమతో జయిస్తూ తోబుట్టువులకు పెద్దదిక్కుగా నిలబడ్డాడు. కాబట్టే ఆ తోబుట్టువులు తమ పెద్దన్నను ఇప్పుడు తమ ఆత్మీయ దైవంగా భావిస్తూ
అడుగుజాడల్ని అనుసరిస్తున్నారు.
ముఖ్యంగా వీరి బాల్యం గురించి చెప్పుకోవాలి. ఇద్దరు తల్లుల ముద్దుల కుమారుడిగా గడిచింది. అమ్మ, పెద్దమ్మల, పెంపకంలో ""కుటుంబ వ్యవస్థకు"" గట్టి పునాదులే వేసాడు. కాబట్టి ఇప్పటికీ వీరి కుటుంబం సపరివారంగా కలిసి మెలసి జీవిస్తున్నది. వివరాల్లోకి వెళ్తే బాలకిష్టమ్మ లక్ష్మీదేవమ్మలు అక్కచెల్లెళ్ళు. బాలకిష్టమ్మకు పిల్లలు కలుగనందున లక్ష్మీదేవమ్మను రాజన్న పెళ్లి చేసుకున్నాడు. ఆ కుటుంబంలో ఎక్కడా బేధాభిప్రాయాలు లేవు. కుటుంబ విలువలు ఆత్మీయమై కొనసాగాయి.
#రచనలు :
"సాహితీ సర్వస్వం_ సాగర మథనం " కవితా సంపుటి సితపుష్పమాల, జీవనహేల, మనసు గీసిన చిత్రాలు, తూర్పు కన్నెర్రజేస్తే, అనే నాలుగు కవితా మాలికల సమాహారం. సుబ్రహ్మణ్యం గారి కవితాశక్తికి ఈ మాలికలు దర్పణం పడుతున్నాయి.
రచించిన ఈ అన్ని రచనల్ని సంపుటాలుగా ప్రచురిస్తూ తమ ఋణానుబంధానికి ఒక భాష్యం కూడా పలుకుతున్నారు కుటుంబ సభ్యులు.
డా. సి. నారాయణరెడ్డి, నాయిని కృష్ణకుమారి, ఎల్లూరి శివారెడ్డి వంటి సాహితీ ఉద్దండులు సుబ్రహ్మణ్యం సాహితీ ఉషస్సును కొల్లాపూర్ యశస్సుగా అభివర్ణించారు. ఇది వారికి మాత్రమే కాదు, కొల్లాపూర్ ప్రాంతానికి కూడా దక్కిన అపురూప గౌరవం.
#ప్రతిభకు_గుర్తింపు :
లేత ప్రాయంలోనే పర్వతమంత ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న సుబ్రహ్మణ్యం గారికి సన్మానాలు సత్కారాలు వెదుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలో వంశీ ఆర్ట్స్ థియేటర్స్ వారు 1977 _1978 సంవత్సరానికి గాను వంశీ అవార్డు విజేతగా ప్రకటించారు. ఆంధ్రపత్రిక యాజమాన్యం వీరి సహాయ సంపాదక సేవల్ని కోరుకున్నది.
#కవితా_చైతన్యం :
ఒకప్పుడు బతకలేని వాడు బడిపంతులు అటువంటి పరిస్థితుల్లో బతుకును నేర్పిస్తూ సామజిక చైతన్యం, సామాజిక రుగ్మతల నిర్మూలన, ప్రధానాంశాలుగా తన ఆలోచనల తోటల్లో కవితలు పూయించాడు రంగినేని.ఆనాటి సమాజంపై తన ప్రభావాన్ని చూపించాడు. ముప్పై ఏండ్లు కూడా నిండకముందే అప్పటికే ప్రముఖులుగా ఉన్న సాహిత్యకారుల వరసలో నిలబడ్డాడు
"పస్తు "లను ఫలహారమిస్తూ
"బాధ " లను ఆహారమిస్తూ.
"గుండె మంటల రగులజేస్తూ
"ఎండు డొక్కల ఛీదరిస్తూ
ఎదిగి పోతున్నావు నరుడా
ఎగిసిపడుతున్నావు జడుడా
అంటూ సమాజంలో కొందరు శక్తులు ఆర్థిక శిఖరాలకు ఎగబాకుతూ.... శ్రామికుల నెత్తుటి కష్టాన్ని తమ ఇష్టా రాజ్యాలకై ఉపయోగించుకుంటున్న వైనాన్ని కవిగా చీదరించుకున్నాడు. ఇటువంటి సమాజ శ్రేయస్సుని ఆశించే కవితలు సంపుటి నిండా సందడి చేస్తున్నాయి.వారి ఆశయాలు తరాలకు ప్రేరణ కావాలనే సదుద్దేశ్యంతో వారి వారసులు వారి పుస్తకాలను ప్రచురిస్తున్నారు.
#కొల్లాపూర్_మామిడి :
కొల్లాపూర్ మామిడి పండ్లు నేడు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. మంచి దిగుబడికి రుచికి మారుపేరైన ఈ మామిడి పండ్ల పేరెన్నిక వెనుక రంగినేని కుటుంబం కృషి ఉన్నది. సుబ్రహ్మణ్యం తండ్రి గారు బట్టల రాజన్న కుటుంబ పోషణ కోసం మొక్కల వ్యాపారం చేసినప్పటికీ, ఆ వ్యాపారంలో సమాజ హితాన్ని కూడా ఆశించాడు. ఈ క్రమంలో 1970-80 ప్రాంతంలో కొల్లాపూర్ ప్రాంతానికి లాభసాటి రకాలను శ్రమకోర్చి సరఫరా చేసాడు. అంతకు ముందు కొల్లపూర్ బేనిషా రకాలు లేవు. రాజన్న చలవతో నేడు కొల్లాపూర్ మామిడిపండ్లకు ప్రసిద్ధిగా మారింది. తండ్రి బాటలోనే సుబ్రహ్మణ్యం కూడా తన అక్షరాలతో సమాజ హితాన్ని ఆశించడం యాదృచ్చికం.
#రంగినేని_వారి_పాటలతోట
రాగమయి... అనురాగమయి...
త్యాగమయి.... ఆనందమయి....2
కాంతిని నిలిపే శాంతివి నీవై
భ్రాoతిని వదలిన ఎడదవు నీవై
కలలు పూచిన నయనాల నీవై 2
కనరాని జగతికి కదలితివా "రాగమయి "
మాయని గాధగా మదిలో నిలచి
మమతా వేణియా మధురిమలొలికి "మాయని "
కలలో ఇలలో ఛాయాగ నిలిచి2
వలపు సిరుల వెలయించితివే
"రాగమయి "
రంగినేని సుబ్రహ్మణ్యం గారు రచించిన ఈ పాటను కొల్లాపూర్ ఘంటసాలగా ప్రసిద్ధి చెందిన అల్వాల వెంకట నరసింహారెడ్డి గారు ఇటీవల ఆలపించారు.
#వెళ్తూ_వెళ్తూ :
ఇంకా
పచ్చని నా పాదాలనూ
వెచ్చని గుండెలనూ
మరులు గొలిపే నా తనువు విలాసమునూ
వెర్రిగా తిలకిస్తూ
మరో లోకంలో ఉంటావా ?
ఉంటే నీ తరం ఏం కావాలి?
నీ జాతి ఏం చేయాలి?
ఆలోచించు కవీ !
ప్రియతమ రవీ !
అందుకే
వ్యర్థ సౌందర్యాన్వేషణలో పడక
సాటి వారి కోసం
నీ మనుగడను అంకితం చేయ్
అప్పుడే నీకు నిజంగా శాంతి దొరుకుతుంది
అప్పుడే నీ సమస్యను పరిష్కరించే
ఊహాలోచనం తెరచుకుంటుంది .....
అంటూ వెళ్తూ వెళ్తూ కవి తన సంకల్పాన్ని విన్నవించుకున్న తీరు ఆర్ద్రమైనది. వారి ఆలోచనలు విశాలమైనవి. కానీ కాలం కఠినమైనది కవి రెక్కల్ని నిర్ధాక్షిణ్యంగా తుంచివేసింది.
సద్గతి :
1979 లో రంగినేని సుబ్రహ్మణ్యంగారు శివైక్యం చెందారు. అప్పుడు వారి వయసు 29 సంవత్సరాలు మాత్రమే.
ఒక అక్షరం ప్రభవిస్తే వేల భావాలు ప్రజ్వరిల్లును !
అతడే రంగినేని !!
నమస్తే సదావత్సలే మాతృభూమి !
No comments:
Post a Comment