ప్రొ. మారెడ్డి రంగారెడ్డి
( శాస్త్రవేత్త - పత్తి వంగడాల సృష్టికర్త )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
ప్రస్తుతం మన పత్తి రైతులు పండిస్తున్న పంట రకాలు
వీరి సృష్టి
క్రమశిక్షణ....
అంకితభావం....
కష్టపడే తత్త్వం....
వెరసి -
వ్యవసాయక శాస్తవేత్త మారెడ్డి రంగారెడ్డి.
వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా తన బాధ్యతలు కొనసాగిస్తూ రైతుల మనిషిగా పేరుపొందాడు . ముఖ్యంగా కుటుంబం, ఉద్యోగం, ఇది మాత్రమే తన జీవితంగా కాకుండా.... రైతుల కోసం ఏదో చేయాలని తపిస్తూ, రైతులతోనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడిన అరుదైన ఉత్తమ ఉద్యోగి రంగారెడ్డి.
▪️పరిచయం :
ప్రకాశం జిల్లా కంభంలో 1936 ఏప్రిల్ ఒకటవ తేదీన
సాధారణ రైతు కుటుంబంలో రంగారెడ్డి జన్మించారు.
మారెడ్డి బాలరంగారెడ్డి - కాశమ్మ దంపతులు వీరి తల్లిదండ్రులు. వీరి సోదరుడు కోటిరెడ్డి.
చిన్నతనం నుండే వ్యవసాయం మీద ఆసక్తి ఉండటంతో పాఠశాల మీద పెద్దగా ఆసక్తి కనబర్చలేదు రంగారెడ్డి. తన సోదరుడు పాఠశాలకు వెళ్తుంటే, తాను మాత్రం వ్యవసాయ పొలాలు , పంటలు, పాడి, వీటి మీద అమితమైన ప్రేమ వాత్సల్యాలు కనబరుస్తూ.... .తోటి పిల్లలతో ఆడుకుంటూ.... ఉండేవాడు. ఈ క్రమంలో
బాగా పెద్దవాడయ్యాక ఆలస్యంగా పాఠశాలలో చేరాడు.
అగ్రికల్చర్ బిఎస్సి తర్వాత 1960 -1966 లలో వ్యవసాయ కళాశాల బాపట్ల నుండి జన్యుశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ తర్వాత పిహెచ్.డి అవార్డు పొందారు. 1980 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ అసిస్టెంట్గా తన వృత్తిని ప్రారంభించి అనతి కాలంనే
అనూహ్య విజయాలు సాధించి పై మెట్టు చేరుకున్నాడు. అత్యుత్తమ పత్తి బ్రీడర్గా తనని తాను నిరూపించుకున్నాడు.
ముఖ్యంగా రంగారెడ్డి మొదట ఫారెస్ట్ విభాగంలో ఉద్యోగంలో చేరినప్పటికీ, తర్వాత తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయం కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంచుకున్నాడు.
▪️వృత్తిధర్మంలో :
కాటన్ స్పెషలిస్ట్, కాటన్ బ్రీడర్ వంటి వివిధ పదవులకు ఎదిగిన రంగారెడ్డి, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయవిశ్వవిద్యాలయం నంద్యాల శాఖలో సీనియర్ సైంటిస్టుగా చాలా కాలం పనిచేసారు. ఇక్కడి నుండే వ్యవసాయాధారితమైన భావి భారతానికి కొత్త వంగడాలను సృష్టించారు.ఈ క్రమంలో పత్తి , నూనె గింజలు , జొన్న, మొక్కజొన్న ,రకాల్లో దిగుబడిని పెంచే రకాలకు వీరు ప్రాణం పోసారు.
దర్శి, తెనాలి, మాధోల్, ఆదిలాబాద్, నంద్యాల్ వంటి పరిశోధనా స్టేషన్లలో పనిచేశాడు. R.A.R.S. నంద్యాలకు ఒక గౌరవప్రదమైన స్థానం దక్కడంలో రంగారెడ్డి కృషి ప్రముఖమైనది. వీరి జీవితం ఎక్కువ కాలం ఈ నంద్యాలలోనే కొనసాగింది.
▪️కనుగొన్న వంగడాలు :
పత్తి ప్రాజెక్టుకు ఇన్చార్జిగా, పత్తి రకాలు సంకరజాతుల అభివృద్ధిలో వీరి కృషి గణనీయమైనది.
వీరు కనుగొన్న పత్తి రకాలు ప్రస్తుతం రైతుల ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. వాటి వివరాలు...👇
NA - 1280 (తెల్ల పురుగు నివారిణి )
NA - 1325 ( నరసింహ్మ)
NA - 920 (ప్రియ )
HYPS - 152
మహాలక్ష్మి ,విజయలక్ష్మి , దేశవాళి రకాలైన శ్రీశైలం , అరవింద , కనుగొన్నారు.
పత్తి సంకరాల్లో NHH 390, NCA 212 ,భాగ్యలక్ష్మి (ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడ్)మొదలగుణవి.
దేశీ సంకరాల్లో NCA 176, NCA 205, NCA 212. మొదలగునవి.
న్యూక్లియస్ & ఫౌండేషన్ సీడ్ ప్రొడక్షన్, మంచి నాణ్యమైన న్యూక్లియస్ & బ్రీడర్ సీడ్ను ఉత్పత్తి చేయడం ద్వారా వీరు దేశానికి సహాయం చేసిన శాస్త్రవేత్తల వరసలో నిలబడ్డాడు.
వీరి కృషి పట్టుదలకు నిదర్శనాలు.వీరి పరిశోధనా ఫలితాలు రైతుల పాలిట వరమే అయ్యాయి. వీరు సృష్టించిన రకాలు అధిక దిగుబడికి లాభాలకు ఆమోదయోగ్యంగా ప్రయోగశాలల నుండి నాణ్యతా గుర్తింపును సంపాదించుకున్నాయి.
RARS నంద్యాల్లో రంగారెడ్డి కృషి ఫలితంగా ఉద్భవించిన ....
1) HYPS - 152 ( Big Boll & Good Staple Length )
2) NA 1325 (నరసింహ)
ఈ రెండు రకాలు కాటన్ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్లో తల్లిదండ్రులుగా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.
విత్తన పరిశ్రమల చేత కాటన్ హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో నోటిఫై చేయని HYPS152 పేరెంట్గా విస్తృతంగా ఉపయోగించబడుతున్న పరిస్థితుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పత్తి పండించే రైతులు వీటి కారణంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
▪️జాతీయ స్థాయిలో కథనాలు :
జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో రంగారెడ్డి గారి శాస్త్రీయ కథనాలు ప్రచురించబడ్డాయి. వీరి వ్యాసాలు సంబంధిత పరిశోధనా సంస్థలకు , విత్తన పరిశ్రమలకు, వ్యవసాయ సంఘాలకు, తద్వారా దేశవ్యాప్త రైతులకు మార్గదర్శకత్వం వహించాయి.
▪️కల్తీ విత్తనాల్ని అరికడుతూ.. :
పత్తి రకాలలో లాభదాయకమైన సంకరజాతులను ఉత్పత్తి చేసి పత్తి రైతులకు వారు చేసిన సేవ ప్రస్తుతం ఫలితాల రూపంలో కనిపిస్తుంది. కాగా ఈ ఫలితాలను కాలరాసే ప్రయత్నంగా కొన్ని నకిలీ విత్తనాల పరిశ్రమలు బయలుదేరి రైతుల్ని నిలువునా ముంచే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాయి.
ఈ క్రమంలో విత్తన జన్యు స్వచ్ఛతను గుర్తించడంలో అగ్రగామిగా ఉన్న రంగారెడ్డిని ఈ పరిశ్రమల పేరిట కొందరు అక్రమార్కులు ఆశ్రయించారు. నకిలీ విత్తనాలను శుద్ధి విత్తనాలుగా ప్రచారం చేస్తూ రంగారెడ్డి సంతకాన్ని ఆశించారు. . లక్షల లంచం ఎరజూపారు . కానీ ఒక రైతుగా రైతు పక్షపాతిగా ఈ మోసాన్ని వ్యతిరేకించాడు రంగారెడ్డి. లక్షల రూపాయలని తిప్పి పంపించాడు.
రోజు రోజుకు పెరుగుతున్న నకిలీ విత్తనాల విషయంలో రంగారెడ్డి తీవ్రంగా స్పందించాడు. ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా స్వచ్ఛందంగా
రైతుల కోసం తన విజ్ఞానాన్ని ధారపోయడం మొదలెట్టాడు. కుటుంబాన్ని కూడా కలుసుకోకుండా
గ్రామాలు పర్యటించడం మొదలెట్టాడు. అవగాహనా పాఠాల నిమిత్తం రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించాడు. ఇవన్నీ ఉద్యోగ ధర్మంలో భాగంగా కాదు, వ్యక్తిగతంగా కొనసాగించాడు.
అక్రమంగా సంపాదించుకునే మార్గాలను నిస్వార్థంగా మూసివేసిన రంగారెడ్డి వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే..... తాను మరణించే వరకు తనకు ఉన్నది ఐదు చొక్కాలు మాత్రమే. ప్రభుత్వం కేటాయించిన అద్దె ఇల్లు మాత్రమే. దీన్ని బట్టి రంగారెడ్డి గారి నిజాయితీ నిరాడంబరతలు అర్థం చేసుకోవచ్చు.
▪️అవార్డులు :
ఉత్తమ శాస్త్రవేత్తగా ఎ.పి. వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా ఆయనకు అవార్డులు లభించాయి.
సెప్టెంబర్ 30, 2009 న సీడ్స్మెన్ అసోసియేషన్ హైదరాబాద్ - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారు తమ 14 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రంగారెడ్డి సేవలను గుర్తిస్తూ జీవిత కాల సాఫల్య పత్రాన్ని ప్రకటించారు
▪️ధర్మ గుణం
స్వతహాగా ధర్మ గుణం కూడా ఎక్కువగా ఉన్న రంగారెడ్డి, తన పర్యటనల్లో పేద రైతులను గుర్తించి
తన శక్తిమేర ఆదరించేవాడు.
తన వద్ద పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిని పర్మనెంటు ఉద్యోగులుగా మార్చడంలోను తనదైన చొరవ చూపించాడు. వీరి వల్ల ఉద్యోగాలు పొందిన కుటుంబాలు ఇప్పటికీ వీరిని గుర్తుకు చేసుకుంటున్నాయి.
రెడ్లు ప్రకటించే విరాళాలతో అఖిల భారత రెడ్ల సంఘం శ్రీశైలం వారు నిర్మించే భవన సముదాయాల్లో
కూడా వీరి వితరణ ఉన్నది. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో ఉన్న రెడ్ల బాలికల వసతి గృహంలో ఒక గది రంగారెడ్డి పేరున ఉన్నది.
▪️కుటుంబం
రంగారెడ్డి వివాహం 1960 లో రాజకుమారితో జరిగింది.ఈ దంపతులకు ఒక కుమారుడు
ఇద్దరు కుమార్తెలు, ఉన్నారు.
▪️మరణం
1990 అక్టోబర్ 3 న తన 54 వ ఏట రంగారెడ్డి మరణించారు. అప్పటికి వారు ఉద్యోగ నిర్వహణలో ఉన్నారు. నేల స్వభావాన్ని, పంటరకాలను పరిశీలిస్తూ పొలాల్లో తిరుగుతున్న సమయంలో కేవలం మేకు గుచ్చుకుని గాయం విషమించడం ద్వారా రంగారెడ్డిగారి ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. లేదంటే మరిన్ని వంగడాలను సృష్టించి రైతు లోకానికి మరిన్ని సేవలు అందించేవారు.
మొత్తానికి నిజాయితీకి మారుపేరుగా బతికారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తనదైన సామాన్య జీవితం ద్వారా నిరూపించారు.
Note : వీరు స్వయానా మా మామగారు. వీరి ఏకైక కుమారుడే నా జీవిత భాగస్వామి.