Tuesday, April 16, 2024

ప్రొ. మారెడ్డి రంగారెడ్డి( శాస్త్రవేత్త - పత్తి వంగడాల సృష్టికర్త )


ప్రొ.  మారెడ్డి రంగారెడ్డి
( శాస్త్రవేత్త - పత్తి వంగడాల సృష్టికర్త )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ప్రస్తుతం మన  పత్తి రైతులు పండిస్తున్న పంట  రకాలు
వీరి సృష్టి

క్రమశిక్షణ.... 
అంకితభావం.... 
కష్టపడే తత్త్వం.... 
వెరసి - 
వ్యవసాయక శాస్తవేత్త  మారెడ్డి రంగారెడ్డి.

వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో  శాస్త్రవేత్తగా  తన బాధ్యతలు కొనసాగిస్తూ  రైతుల మనిషిగా పేరుపొందాడు . ముఖ్యంగా కుటుంబం, ఉద్యోగం,  ఇది మాత్రమే తన జీవితంగా కాకుండా.... రైతుల కోసం  ఏదో చేయాలని  తపిస్తూ, రైతులతోనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడిన  అరుదైన ఉత్తమ ఉద్యోగి రంగారెడ్డి. 
▪️పరిచయం :

ప్రకాశం జిల్లా కంభంలో 1936 ఏప్రిల్ ఒకటవ తేదీన
సాధారణ రైతు కుటుంబంలో రంగారెడ్డి జన్మించారు. 
మారెడ్డి బాలరంగారెడ్డి - కాశమ్మ దంపతులు వీరి తల్లిదండ్రులు. వీరి సోదరుడు  కోటిరెడ్డి.  

చిన్నతనం నుండే  వ్యవసాయం మీద ఆసక్తి ఉండటంతో  పాఠశాల మీద పెద్దగా ఆసక్తి కనబర్చలేదు రంగారెడ్డి. తన సోదరుడు పాఠశాలకు వెళ్తుంటే, తాను మాత్రం వ్యవసాయ పొలాలు , పంటలు, పాడి, వీటి మీద అమితమైన ప్రేమ వాత్సల్యాలు కనబరుస్తూ.... .తోటి పిల్లలతో ఆడుకుంటూ....  ఉండేవాడు. ఈ క్రమంలో 
బాగా పెద్దవాడయ్యాక ఆలస్యంగా పాఠశాలలో చేరాడు.   

అగ్రికల్చర్ బిఎస్సి తర్వాత  1960 -1966 లలో వ్యవసాయ కళాశాల బాపట్ల నుండి  జన్యుశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ తర్వాత  పిహెచ్‌.డి  అవార్డు పొందారు.  1980 లో ఉమ్మడి   ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో   రీసెర్చ్ అసిస్టెంట్‌గా తన వృత్తిని ప్రారంభించి  అనతి కాలంనే 
అనూహ్య విజయాలు సాధించి పై మెట్టు చేరుకున్నాడు. అత్యుత్తమ పత్తి బ్రీడర్‌గా తనని తాను నిరూపించుకున్నాడు. 

ముఖ్యంగా రంగారెడ్డి  మొదట ఫారెస్ట్ విభాగంలో ఉద్యోగంలో చేరినప్పటికీ, తర్వాత తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయం కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంచుకున్నాడు. 

▪️వృత్తిధర్మంలో  :

కాటన్ స్పెషలిస్ట్, కాటన్ బ్రీడర్ వంటి వివిధ పదవులకు ఎదిగిన రంగారెడ్డి, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయవిశ్వవిద్యాలయం నంద్యాల శాఖలో సీనియర్ సైంటిస్టుగా  చాలా కాలం పనిచేసారు. ఇక్కడి నుండే వ్యవసాయాధారితమైన భావి భారతానికి  కొత్త వంగడాలను సృష్టించారు.ఈ క్రమంలో  పత్తి , నూనె గింజలు , జొన్న, మొక్కజొన్న ,రకాల్లో దిగుబడిని పెంచే రకాలకు వీరు ప్రాణం పోసారు.
దర్శి,  తెనాలి,  మాధోల్, ఆదిలాబాద్,  నంద్యాల్ వంటి పరిశోధనా స్టేషన్లలో పనిచేశాడు.  R.A.R.S. నంద్యాలకు ఒక గౌరవప్రదమైన స్థానం  దక్కడంలో రంగారెడ్డి కృషి ప్రముఖమైనది. వీరి జీవితం ఎక్కువ కాలం  ఈ నంద్యాలలోనే కొనసాగింది.

▪️కనుగొన్న వంగడాలు :

పత్తి ప్రాజెక్టుకు ఇన్‌చార్జిగా, పత్తి రకాలు  సంకరజాతుల అభివృద్ధిలో వీరి కృషి గణనీయమైనది. 
వీరు కనుగొన్న పత్తి రకాలు ప్రస్తుతం రైతుల ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. వాటి వివరాలు...👇

  NA  - 1280 (తెల్ల పురుగు నివారిణి  )
  NA  -  1325 ( నరసింహ్మ)
  NA  -  920   (ప్రియ )
  HYPS - 152 
 మహాలక్ష్మి ,విజయలక్ష్మి , దేశవాళి రకాలైన  శ్రీశైలం , అరవింద , కనుగొన్నారు. 

పత్తి సంకరాల్లో    NHH 390,   NCA 212 ,భాగ్యలక్ష్మి  (ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడ్)మొదలగుణవి. 

దేశీ సంకరాల్లో  NCA 176, NCA 205, NCA 212. మొదలగునవి. 

న్యూక్లియస్ &  ఫౌండేషన్ సీడ్ ప్రొడక్షన్, మంచి నాణ్యమైన న్యూక్లియస్ & బ్రీడర్ సీడ్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా వీరు దేశానికి సహాయం చేసిన శాస్త్రవేత్తల వరసలో నిలబడ్డాడు. 

వీరి కృషి పట్టుదలకు నిదర్శనాలు.వీరి పరిశోధనా ఫలితాలు రైతుల పాలిట వరమే అయ్యాయి. వీరు సృష్టించిన  రకాలు అధిక దిగుబడికి లాభాలకు ఆమోదయోగ్యంగా ప్రయోగశాలల నుండి నాణ్యతా గుర్తింపును సంపాదించుకున్నాయి. 

RARS నంద్యాల్లో రంగారెడ్డి కృషి ఫలితంగా  ఉద్భవించిన .... 
1) HYPS - 152  ( Big Boll & Good Staple Length ) 
2) NA 1325 (నరసింహ) 
ఈ రెండు రకాలు కాటన్ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్‌లో తల్లిదండ్రులుగా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. 
విత్తన పరిశ్రమల చేత కాటన్ హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో నోటిఫై చేయని HYPS152 పేరెంట్‌గా విస్తృతంగా ఉపయోగించబడుతున్న  పరిస్థితుల్లో   జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పత్తి పండించే రైతులు వీటి కారణంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. 

 ▪️జాతీయ స్థాయిలో కథనాలు :

జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో  రంగారెడ్డి గారి  శాస్త్రీయ కథనాలు ప్రచురించబడ్డాయి.  వీరి  వ్యాసాలు సంబంధిత పరిశోధనా సంస్థలకు  , విత్తన పరిశ్రమలకు, వ్యవసాయ సంఘాలకు,  తద్వారా దేశవ్యాప్త రైతులకు మార్గదర్శకత్వం వహించాయి. 

▪️కల్తీ విత్తనాల్ని అరికడుతూ.. :

పత్తి రకాలలో  లాభదాయకమైన సంకరజాతులను  ఉత్పత్తి చేసి  పత్తి రైతులకు  వారు చేసిన సేవ   ప్రస్తుతం ఫలితాల రూపంలో కనిపిస్తుంది. కాగా ఈ ఫలితాలను కాలరాసే ప్రయత్నంగా కొన్ని నకిలీ విత్తనాల పరిశ్రమలు బయలుదేరి  రైతుల్ని నిలువునా ముంచే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాయి. 
ఈ క్రమంలో విత్తన  జన్యు స్వచ్ఛతను గుర్తించడంలో అగ్రగామిగా ఉన్న రంగారెడ్డిని  ఈ పరిశ్రమల పేరిట కొందరు అక్రమార్కులు ఆశ్రయించారు. నకిలీ విత్తనాలను శుద్ధి విత్తనాలుగా ప్రచారం చేస్తూ రంగారెడ్డి సంతకాన్ని ఆశించారు. . లక్షల లంచం ఎరజూపారు . కానీ ఒక రైతుగా రైతు పక్షపాతిగా ఈ మోసాన్ని వ్యతిరేకించాడు  రంగారెడ్డి. లక్షల రూపాయలని తిప్పి పంపించాడు. 

రోజు రోజుకు పెరుగుతున్న నకిలీ విత్తనాల విషయంలో  రంగారెడ్డి తీవ్రంగా స్పందించాడు. ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా స్వచ్ఛందంగా
రైతుల కోసం తన విజ్ఞానాన్ని ధారపోయడం మొదలెట్టాడు. కుటుంబాన్ని కూడా కలుసుకోకుండా 
గ్రామాలు పర్యటించడం మొదలెట్టాడు.  అవగాహనా పాఠాల నిమిత్తం రైతులకు శిక్షణా  తరగతులు నిర్వహించాడు. ఇవన్నీ ఉద్యోగ ధర్మంలో భాగంగా కాదు, వ్యక్తిగతంగా కొనసాగించాడు. 

అక్రమంగా సంపాదించుకునే మార్గాలను నిస్వార్థంగా మూసివేసిన రంగారెడ్డి వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే..... తాను మరణించే వరకు తనకు ఉన్నది ఐదు చొక్కాలు మాత్రమే. ప్రభుత్వం  కేటాయించిన అద్దె ఇల్లు మాత్రమే. దీన్ని బట్టి రంగారెడ్డి గారి  నిజాయితీ నిరాడంబరతలు  అర్థం చేసుకోవచ్చు.

▪️అవార్డులు :

ఉత్తమ శాస్త్రవేత్తగా ఎ.పి. వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా ఆయనకు అవార్డులు  లభించాయి.     

సెప్టెంబర్ 30, 2009 న సీడ్స్‌మెన్ అసోసియేషన్ హైదరాబాద్ -  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారు తమ 14 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో  రంగారెడ్డి సేవలను గుర్తిస్తూ జీవిత కాల సాఫల్య పత్రాన్ని ప్రకటించారు  

▪️ధర్మ గుణం 

స్వతహాగా ధర్మ గుణం కూడా ఎక్కువగా ఉన్న రంగారెడ్డి, తన పర్యటనల్లో  పేద రైతులను గుర్తించి 
తన శక్తిమేర ఆదరించేవాడు. 
తన వద్ద పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిని పర్మనెంటు ఉద్యోగులుగా మార్చడంలోను తనదైన చొరవ చూపించాడు. వీరి వల్ల ఉద్యోగాలు పొందిన కుటుంబాలు ఇప్పటికీ వీరిని గుర్తుకు చేసుకుంటున్నాయి. 

రెడ్లు ప్రకటించే విరాళాలతో అఖిల భారత రెడ్ల సంఘం శ్రీశైలం వారు నిర్మించే భవన సముదాయాల్లో 
కూడా వీరి వితరణ ఉన్నది. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో  ఉన్న రెడ్ల బాలికల వసతి  గృహంలో  ఒక గది  రంగారెడ్డి పేరున ఉన్నది.

▪️కుటుంబం 

రంగారెడ్డి వివాహం 1960 లో రాజకుమారితో జరిగింది.ఈ దంపతులకు ఒక కుమారుడు 
ఇద్దరు కుమార్తెలు, ఉన్నారు. 

▪️మరణం    

1990 అక్టోబర్ 3 న తన 54 వ ఏట రంగారెడ్డి మరణించారు. అప్పటికి వారు ఉద్యోగ నిర్వహణలో ఉన్నారు. నేల స్వభావాన్ని, పంటరకాలను పరిశీలిస్తూ పొలాల్లో తిరుగుతున్న సమయంలో కేవలం మేకు గుచ్చుకుని గాయం విషమించడం ద్వారా రంగారెడ్డిగారి  ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. లేదంటే మరిన్ని వంగడాలను సృష్టించి రైతు లోకానికి మరిన్ని సేవలు అందించేవారు. 
మొత్తానికి  నిజాయితీకి మారుపేరుగా బతికారు.  ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని  తనదైన  సామాన్య జీవితం ద్వారా నిరూపించారు.

Note : వీరు స్వయానా మా మామగారు. వీరి ఏకైక కుమారుడే నా జీవిత భాగస్వామి.

మార్చాలా రామాచారి ( చిత్రకారుడు )

మార్చాల రామాచారి
(కవి , సజీవ చిత్రాల చిత్రకారుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాస కూర్పు : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

వెయ్యేళ్ళు వర్ధిల్లడం అంటే ఇదే....
కళ....కలకాలం నిలవడం అంటే ఇదే....
ప్రతిభ....పది కాలాలు పట్టం కట్టు కోవడం అంటే ఇదే.....
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మార్చాల రామాచారి !
అద్భుత అద్వితీయ చిత్రకారుడు..! 
తన బొమ్మలతో దిగ్గజాలను మెప్పించిన చరితార్థుడు!
మీసాల కృష్ణుడి కుంచెకారుడు

▪️వివరాల్లోకి వెళ్తే.....

పూర్వ పాలమూరు కల్వకూర్తి దగ్గర మార్చాలా గ్రామ వాస్తవ్యులు రామాచారి. వీరు 1899 ప్రాంతంలో జన్మించారు. శ్రీనివాసాచార్యులు సోమిదేవమ్మ వీరి తల్లిదండ్రులు. వీరు కారంపూడి వంశస్తులు. కానీ గ్రామ నామంతో ప్రసిద్దులు అయ్యారు. రామాచారి పూర్వికులు తమిళనాడులోని గండికోట నుండి 300 సంవత్సరాల క్రితం పాలమూరు ప్రాంతానిమికి వలస వచ్చారు. మొదట తిమ్మాజిపేటలో నివాసం ఉన్నారు.తర్వాత వారి తాతగారు రంగాచార్యుల హయాంలోనే మార్చాలకు వచ్చి , అక్కడ ఆలయ పూజారులుగా స్థిరపడ్డారు.

▪️సకల కళాకోవిదుడు రామాచారి

పుట్టుకతో రామాచారి వారు బ్రాహ్మణులు. అయినప్పటికీ రామాచారి వారు వివిధ పనుల్లో నైపుణ్యం సాధించారు. కుల వృత్తుల వారికి ఏమాత్రం తీసిపోకుండా సకల వృత్తి పనుల్లో ఆరితేరారు. కమ్మరి పని , కుమ్మరి పని , తీవాచిలు అల్లడం, సిరిచాపలు అల్లడం , మగ్గం పని, చెప్పులు కుట్టడం, వ్యవసాయం వంటి మొదలగు పనుల్లో తన పనితనాన్ని నిరూపించుకున్నారు. తన చెప్పులు తానే కుట్టుకోవడం , తన బట్టలు తానే నేసుకోవడం, చేసేవాడు. వీరు వాస్తుశిల్పి కూడా. తాను నివసించాల్సిన ఇంటికి తానే రూపకల్పన చేసుకుని ఇల్లు కట్టించుకున్నాడు. 

ఈ అన్నీ పనులతో పాటుగా చిత్రలేఖనం కొనసాగించాడు. అసాధారణ ప్రతిభ కనబర్చాడు.

తీవాచిలు అల్లడంలో మంచి నేర్పరిగా ఉన్న రమాచారి గారు, వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలకు తీవాచిలు తయారుచేయడంలో మెళకువలు నేర్పించాడు.

చిత్రాలు గీయడంలోనే కాదు తీయడంలో కూడా రామాచారి గారు మంచి నిపుణులు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే బెస్ట్ ఫోటో గ్రాఫర్. ఈ కళను తన జీవనోపాధికి ఉపయోగించుకుంటూ పాలమూరులో కొన్నాళ్ళు ఫోటో స్టూడియో నడిపారు. ఈ క్రమంలో రామాచారిలో అత్యంత అరుదైన కళ గురించి మాట్లాడితే.... ఫోటోలు తీయడం కోసం అతడు స్వయంగా కెమెరా ఒకటి తయారు చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు.

▪️సురవరం వారి సహచరుడుగా.....
     బాపిరాజు సహభ్యాసకుడిగా......

సురవరం ప్రతాపరెడ్డితో రామాచారి గారికి మంచి స్నేహపూర్వక సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. రామాచారిలో ఉన్న కళ తో పాటుగా, అణుకువ సౌమ్యత సురవరం వారిని బాగా ఆకట్టుకున్నాయి.అందుకే రామాచారిలో ఉన్న చిత్రకళకు మరింత పదును పెట్టాలని సంకల్పిస్తూ..... రామాచారిని బందరు ఆర్ట్స్ కళాశాలలో చేరడానికి ప్రోత్సాహం అందించారు.

బందరు కళాశాలలో చిత్రకారులు అడవి బాపురాజు, గుర్రం మల్లయ్య గార్లు తోటి విద్యార్థులుగా వున్నారు 

▪️మీసాల కృష్ణుడి రూపశిల్పి

సురవరం వారి గోలుకొండ పత్రికాఫీసులో మీసాల కృష్ణుడి చిత్రం ఒకటి వేలాడదీసి ఉండేది.ఈ చిత్రం చరిత్రలో భాగంగా కొనసాగుతున్నది. రామాచారి ప్రతిభ తెలిసిన సురవరం వారు , ఆ చిత్రాన్ని ప్రత్యేకంగా రామాచారి చేత గీయించారు. సురవరం వారి ఆలోచన ప్రకారం మీసాలు లేకుడా కృష్ణుడు కనబడటం ఇష్టం లేదు. పౌరుషానికి యుద్ధతాంత్రానికి ప్రతీక అయిన కృష్ణుడు మీసాలతో ఉండాలి అనేది సురవరం వారి తలంపు. అందుకే రామాచారి చేత తనకు నచ్చిన విధంగా గీయించుకున్నాడు.

▪️గోలుకొండ కవుల సంచికలో

సురవరం ప్రతాపరెడ్డి వారు 1934 వ సంవత్సరంలో 354 మంది కవులతో ప్రకటించిన గోలుకొండ కవుల సంచికలో రామాచారి వారి కవిత 39 వ స్థానంలో ప్రార్థనము శీర్షిక కింద ప్రచురింపబడింది.

శా . శ్రీమంతంబున జెన్ను మీరుధరణీ సీమంతినీభూషణ గ్రామంబౌ మధురాపురంబున దివౌకవ్యూహ సంప్రార్థనన్ భూమేల్ జూప జనించినట్టి కరుణాభూషుండు కృష్ణుండొగిన్ ధామైశ్వర్య సుఖాదికంబొసగి ప్రోచున్ గాత నెల్లప్పుడున్

గీ .భవ్యబృందావనారణ్య భూరుహాళి సాంద్రతరునీడలందు సుశ్రావ్యమహిత
నవసుధారస కలిత మాధుర్య వేణు
గాన మొనరించ గోవులు గ్రాసముడిగి
యే మహాదివ్యమూర్తిని నెలమిగాంచు
నట్టికృష్ణుని సేవింతు ననుదినంబు

మ.కడుమౌగ్యంబున నివ్వటిల్లుపడతుల్ గాసిల్లి నిద్రించగా నడురేయొయ్యన వారి జేరికినుకన్ దద్వేణిబంధంబులన్ వడిలే దూడల దోకలన్ బిగిచి యాహ్లాదించి మోదించు నా తడుగృష్ణుండుకృపామతిన్ గనుటకై ధ్యానింతునశ్రాంతమున్

ఇవి రామాచార్యులుగారి పద్యములు. వీరి కవితలు ఇంకా ఎన్నో ఆముద్రితములుగా మిగిలిపోవడం బాధాకరం.

▪️పత్రికలు ఆదరించిన చిత్రాలు : 

సుజాత , గోలుకొండ పత్రికలో చాలా వరకు వీరి చిత్రాలు ప్రచురింపబడ్డాయి.

▪️రామాచారి గారి ప్రముఖ చిత్రాలు : 
     దివిటపల్లి ఆలయంలో చిత్రాలు : 

రామాచారి చిత్రాలు అన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతాయి. భక్తి , పురాణ పరిజ్ఞానం , వీరిలో జీవనదిలా ప్రవహిస్తూ సజీవ చిత్ర రాజాలకు ఊతం అందించింది. వివరాలు ---

సురవరం ప్రతాపరెడ్డి గారి గోలుకొండ కవుల సంచిక ముఖచిత్రం " వీణాపాణి సరస్వతి " అమ్మవారి చిత్రం

గోలుకొండ పత్రికా కార్యాలయానికి వన్నె తెచ్చిన చారిత్రక మీసాలకృష్ణుడు చిత్రం.

శ్రీరామ పట్టాభిషేకం చిత్రం
విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రాలు

దివిటిపల్లి గ్రామంలో బీంసేన్ రావు అనే ఒక భక్తుడు 1940 - 50 ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించాడు. ఈ దేవాలయంలో బీంసేన్ రావు ఆహ్వానం మేరకి రామాచారి గీసిన చిత్రాలు ఆ తరం భక్తులను అలరించాయి. వీటిలో మీరాబాయి, గీతోపదేశం, సీతారాముల పర్ణశాల, పార్వతి పరమేశ్వరులు, బ్రహ్మదేవుడు ఉన్నారు. కాగా కాలక్రమంలో వర్ణ చిత్రాలు రంగు వెలసిపోయాయి. అంజనేయ భక్తులు 1990 వ సంవత్సరంలో పాత చిత్రాల స్థానంలో కొత్త చిత్రాలు గీయించారు. ఈ కారణంగా రామాచారి చిత్రాలు కనుమరుగు అయ్యాయి. ఒక్క సీతారాముల పర్ణశాల మాత్రం నేటికిని ఉన్నట్టుగా తెలుస్తున్నది.

▪️పరిశోధకుల నిర్లక్ష్యం

సురవరం వారి గురించి , వారి గోలుకొండ పత్రిక గురించి చాలా పరిశోధకులు వెలువడ్డాయి. సురవరం వారి సమగ్ర వివరాలు అందించిన పరిశోధకులు, రామాచారి గురించి మాత్రం నిర్లక్ష్యం వహించారు అని చెప్పవచ్చు. గోలుకొండ పత్రికకు తన చిత్రాలతో ప్రాణం పోసిన రామాచారి చిరస్మరణీయుడు.

▪️చారిత్రక పొరపాటు

సురవరం 
▪️రామాచారి కుటుంబం

రామాచారి గారి సతీమణి కృష్ణవేణి. వీరికి మొత్తం 10 మంది సంతానం. ఆరుగురు కూతుళ్లు, ఐదుగురు
కుమారులు.
----రంగనాయకమ్మ, వెంకటలక్ష్మమ్మ, జానకమ్మ, సుజాత, సౌభాగ్యలక్ష్మి, లీలమ్మ.
----- శ్రీనివాసాచారి, నరసింహాచారి, రాఘవాచారి, శేషాచారి.

▪️సురవరం కూతురు సరోజనమ్మ ఔన్నత్యం

సురవరం ప్రతాపరెడ్డి గారి కూతురు సరోజనమ్మ. రామాచారి గీసిన మీసాల కృష్ణుడు బొమ్మను, తండ్రి తదనంతరం జాగ్రత్తగా భద్రపరిచి చరిత్రకు అపురూప అద్వితీయ ఆనవాలు అందించింది. వీరి స్వంత గ్రామం గంగపురం. సరోజనమ్మ అక్కడే నివసించేది. మీసాల కృష్ణుడిని ఇంట్లో దేవుడి పటాల మధ్య ఉంచి నిత్యం పూజించేది. ప్రస్తుతం ప్రస్తుతం వీరు కాలం చేశారు. కాబట్టి వీరి కూతురు ప్రవీణ మీసాల కృష్ణుడిని తనదైన బాధ్యతగా తన తాతగారి గుర్తుగా భద్రపరిచి ఉన్నది.

▪️రామాచారి వైకుంఠాధన

అతిసామాన్య జీవితం గడిపిన రామాచారి గారి 1974 లో తన 75 వ ఏటా కాల ధర్మం చెందారు. వారు లేకపోయినా వారి చిత్రాల ద్వారా తరతరాలు ఖ్యాతియై వర్ధిల్లుతూనే ఉన్నాడు.

ఎందరో మహానుభావులు
అందరికి వందనాలు
---------------------------------------------------------------------
ఆధారం : పాలమూరు పత్రిక 
              వ్యాసకర్త :గుండోజు యాదగిరి