రాణి భాగ్యలక్ష్మిదేవమ్మ
( మహిళా దినోత్సవం సందర్బంగా )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
హైదరాబాద్ రాజ్యంలో నిజాం హయాంలో స్వయంపాలన అధికారాలు కలిగిన చిన్నా పెద్ద సంస్థానాలు 14 ఉండేవి. పన్ను వసూలు అధికారాలు పొందిన భూస్వాముల గడీలు 9 ఉండేవి.
అతిపెద్ద సంస్థానంలో ఒకటైన ఆత్మకూరు సంస్థానం ( అమరచింత ) చరిత్ర పాలనలోను సాహిత్య పోషణలోనూ చెప్పుకో దగింది. పాలించడంలోనే కాదు, సాహిత్యాన్ని పోషించడంలో ఆత్మకూరు సంస్థానం తన ఉదారతను చాటుకుంది. ఈ సంస్థానం పూర్వ పాలమూరు జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఉన్నది.
సంస్థానం చివరి పాలకురాలు మహారాణి భాగ్యలక్ష్మిదేవమ్మ. వీరి భర్త శ్రీరాంభూపాల్ గారి మరణం తర్వాత పాలనా బాధ్యతలు స్వీకరించిన భాగ్యలక్ష్మిదేవమ్మ జనరంజకంగా పాలన సాగించింది.
ప్రజలను ఆదరించడం.....సాహిత్యాన్ని గౌరవించడం.... రాణీ భాగ్యలక్ష్మమ్మ ప్రత్యేకత !
▪️సంస్థానం పరిచయం
దాదాపు 190 చ.కి.మీ.ల విస్తీర్ణములో వ్యాపించి ఉన్న ఈ సంస్థానం చరిత్ర ప్రాచీనమైనది.
సంస్థానం అధీనంలో 69 గ్రామాలు , రెండు పరాగణాలు ఉండేవి. పరాగణాలు అంటే తాలూకాలు.
సంస్థానం మూల పురుషుడు ముక్కెర గోపాలరెడ్డి రాయలసీమ చిత్తూరు జిల్లా చంద్రగిరి వాస్తవ్యులు. కాకతీయ సామంతరాజు గోన బుద్దారెడ్డికి వీరు స్నేహితులు. అవిధంగా క్రీ. శ.1292 ప్రాంతంలో బుద్దారెడ్డి ఆహ్వానం మేరా తెలంగాణ ప్రాంతానికి వచ్చి , పాలమూరు పరిధిలో మగతలనాడు ప్రాంతానికి గౌడ పదవిలో నియమించడం జరిగింది. మగతలనాడు అనేది నేటి మఖ్తల్ ప్రాంతం.ముఖస్థలి అనే మరో నామం కూడా ఈ ప్రాంతానికి ఉన్నది.అంటే యాగాలు చేసే చోటు అని అర్థం. మఖ్తల్ ప్రాంతం కన్నడ దేశానికి సమీపంగా వున్నది. ఆ ప్రభావం కారణంగానే అది మగతల గా పిలవబడిందని చరిత్రకారులు తెలియ జెప్తున్నారు. ఎందుకంటే మగ అనగా కన్నడంలో కొడుకు లేదా కుమారుడు అని అర్థం. తల అనేది చోటు లేదా స్థలం అని సూచిస్తుంది. ఈ విధంగా 1680 వరకు మండలాధి పతులుగా ముక్కెర వారసులు పాలన కొనసాగిస్తూ వచ్చారు.
1680 లో పెదసోమనాద్రి గద్వాల సంస్థానం ఏర్పాటు చేస్తాడు . అదే కాలాన ముక్కెర వారసుడు చెన్నారెడ్డి కూడ సంస్థానాన్ని ఏర్పాటు చేసాడు . లభిస్తున్న చారిత్రక వివరాలు ప్రకారం 1680 ప్రాంతంలో సంస్థానం ఏర్పాటు అయ్యింది .
అమరచింత / ఆత్మకూరు సంస్థానం వారు పరిపాలన సౌలభ్యం కోసం వివిధ కాలాల్లో ఐదు ప్రాంతాలను తమ రాజధానులుగా చేసుకుని పాలించడం మూలాన సంస్థానాన్ని రాజధాని పేరుతో ఉద్దేశించడానికి కొంత గందరగోళం ఏర్పడింది.
ఈ క్రమంలో సంస్థానాధీశుల అధికారిక పత్రాలు గమనిస్తే సంస్థాన్ అమరచింత - ఆత్మకూరు అని కనిపిస్తున్నది. సురవరం ప్రతాపరెడ్డి వంటి చరిత్రకారుల గ్రంధాలు గమనిస్తే ఆత్మకూరు సంస్థానం అని కనిపిస్తున్నది.రాజధానుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1 ] అమరచింత -
1680 -1797 వరకు మొత్తం దాదాపుగా 117 సంవత్సరాలు అమరచింత సంస్థానం రాజధానిగా కొనసాగింది.
2] పరిదిపురం -
1797 నుండి 1807 వరకు అంటే మొత్తం పది సంవత్సరాలు పరిధిపురం సంస్థానం రాజధానిగా కొనసాగింది.
3]దుప్పల్లి -
1807 -1810 వరకు అంటే మొత్తం మూడు సంవత్సరాల కాలం సంస్థాన్ రాజధానిగా దుప్పల్లి కొనసాగింది.
4]తిపుడంపల్లి -
1810 -1813 వరకు అంటే మొత్తం మూడు సంవత్సరాల కాలం సంస్థాన్ రాజధానిగా తిప్పుడంపల్లి
5] ఆత్మకూరు -
1813 -1948 వరకు అంటే దాదాపుగా 135 సంవత్సరాలు సంస్థానం రాజధానిగా ఆత్మకూరు కొనసాగింది.
సంస్థానాన్ని క్రీ. శ. 1813-1834 వరకు పాలించిన రాజ పెద వెంకటరెడ్డి 1820 లో ఆత్మకూరుకు పునాదులు వేసాడు.1820లో ఊరిలో పాలన కోసం కోటతో పాటుగా.... ప్రజల కోసం పేటలు (వాడలు ) నిర్మించబడ్డాయి. ఆ తరవాత వరుసగా బాలకృష్ణారెడ్డి, సోమభూపాల్, సీతారామభూపాల్, శ్రీరాం భూపాల్, రాణి భాగ్యలక్ష్మి దేవమ్మలు ఆత్మకూరు రాజధానిగా పాలన కొనసాగించిన వాళ్లలో ఉన్నారు.
▪️భాగ్యలక్ష్మిదేవమ్మ జననం
భాగ్యలక్ష్మి దేవమ్మ దోమకొండ సంస్థానం ఆడపడుచు.ఖర నామ సంవత్సరం ఆశ్వయుజ శుక్ల షష్టినాడు వృషభలగ్నం నందు క్రీ శ. 1891 లో
దోమకొండ సంస్థానాధీశులు మహాయశవంత్ , రంగమాంబ దంపతులకు జన్మించారు .
భాగ్యలక్ష్మమ్మ చురుకైనది. తెలివైనది. మంచి విద్యావంతురాలు.చిన్నతనం నుండే రాజనీతి ఎరుగతూపెరగడం మూలాన జనరంజక పాలన అందివ్వగలిగింది.
▪️శ్రీరాంభూపాల్ తో వివాహం
ముక్కెర వారసుల్లో ఒకరైన సీతారాంభూపాల్ ఏకైక కుమారుడు శ్రీరాంభూపాల్. రామలక్ష్మమ్మ , సీతారామ భూపాల బల్వంత బహదూరు దంపతులకు సర్వధారి సంవత్సర అధిక చైత్ర శుక్ల పంచమినాడు వృశ్చిక లగ్నమందు
శ్రీరామభూపాల్ క్రీ. శ.1888 లో .
జన్మించాడు .. శ్రీరాంభూపాల్ గారు ఆంధ్రం, ,ఆంగ్లం, పార్సీ భాషలను భ్యసించాడు .
అప్పటి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ శ్రీరాంభూపాల్ ఫర్మణా అనుసరించి విశ్వావసు సంవత్సరంలో 1905 లో తన 17 వ ఏటా శ్రీరాం భూపాల్ పట్టాభిషేక్తుడు అయ్యాడు.
భాగ్యలక్ష్మ్మ గారితో వీరి వివాహం 1900 - 1910 మధ్య కాలంలో జరిగినట్టుగా పెద్దలు పేర్కొంటారు.
▪️ఆధ్యాత్మిక చింతన - భర్త వియోగం
శ్రీరాం భూపాల్ గారు స్వయంగా న్యాయధికారం వహించి ప్రజాభ్యుదయానికి పాటుబడ్డారు. వివిధ ఆలయాలకు దాన ధర్మాలు వొసగుతూ భార్య భాగ్యలక్ష్మమ్మతో కలిసి మిక్కిలి తీర్థ యాత్రలు చేసేవాడు. ఈ క్రమంలో అనంతశయనము , సేతు మొదలైన దక్షిణ దేశ యాత్రలను చేసి అక్కడి భక్తులకు వసతి సదుపాయాలు కల్పించారు.
ఇటువంటి పరిస్థితిల్లోనే ప్రమోదూత సంవత్సర వైశాఖ బహుళ అమావాస్యనాడు మరణించాడు
42 వ ఏటా 1930లో
శ్రీరాంభూపాల్ గారు తనువు చాలించాడు.
▪️సంస్థాన పాలనాదక్షురాలిగా భాగ్యలక్ష్మమ్మ
భర్త శ్రీరాం భూపాల్ మరణం తర్వాత 1934 లో
భావ సంవత్సర జ్యేష్ఠ శుక్ల పూర్ణిమ నాడు ప్రభుత్వ అనుమతి అనుసరిస్తూ భాగ్యలక్ష్మమ్మ పాలనలోకి వచ్చింది. రాజ వ్యవహారాలు చక్కదిద్దడంలో నేర్పరిగా పనిచేసింది. సమర్థులైన అధికారులను నియమించుకుని, సంస్థానంలో విద్య వైద్య సదుపాయాలను మెరుగుపరిచింది.
హైదరాబాద్ రాష్ట్రంలో క్రమంగా నిజాం వ్యతిరేకత ఉద్యమం అట్టుడికింది. ఆత్మకూరు ప్రాంతంలో కూడా నిజాం వ్యతిరేకత నివురు గప్పిన నిప్పులా మొదలయ్యింది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం , ఆ తర్వాత ఆత్మకూరులో స్థానికుల జెండా సత్యాగ్రహాలు, నిజాం వ్యతిరేక ధీక్షలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో భాగ్యలక్ష్మమ్మ అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది.ఈ పరిస్థితిలోనే 1948లో సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమై స్వయం పాలనకు స్వస్తి పలికింది.రాజరికం అంతం అయ్యింది.
▪️గోలుకొండ కవుల సంచికకు తోడ్పాటు
తెలంగాణలో కవులే లేరనే ఒక నిందావ్యాఖ్యను ఆత్మ గౌరవంగా తీసుకుని 1934లో "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని వెలువరిచాడు వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఇందులో 354 మంది కవుల పద్య గద్య కవితలు ఉన్నాయి.తెలంగాణ సాహిత్య చరిత్రలో ఇది ఒక సంచలనం.తెలంగాణ సాహిత్య వికాసం క్రమంలో వెలువడిన తొలి సంకలనం ఈ గోలకొండ కవుల సంచిక ప్రచురణలో రాణి భాగ్యలక్ష్మిదేవమ్మ ఆర్థిక సహకారం చెప్పుకోదగింది. ముద్రణ వ్యయం మొత్తం రాణిగారు అందించారు. ఇందుకు సగౌరవంగా ప్రతాప రెడ్డి గారు తన కవుల సంచికను భాగ్యలక్ష్మమ్మ గారికి అంకితం ఇచ్చారు.
తెలంగాణకవుల పరిచయ ప్రప్రథమగ్రంథాన్ని ఆదరించి అంకితంపొందినది ఆత్మకూరు మహారాణి రాణీ కావడం సంస్థానానికి గర్వకారణం. ఈ ఉజ్వల కాంతిరేఖలు సాహిత్య చరిత్రలో సుసంపన్నం.
ప్రతాప రెడ్డి గారు తన గోలుకొండ కవుల సంచికను భాగ్యలక్ష్మమ్మ గారికి అంకితం ఇస్తూ ఈ విధంగా ప్రశంసించి ఉన్నారు.
👉అంకితము
అమరచింత - ఆత్మకూరు సంస్థాన ప్రభ్విణి
శ్రీ శ్రీ శ్రీ
సవై రాణీ భాగ్యలక్ష్మమ్మ
బహదరువారికి
శ్రీవారి నిర్మల యశ స్సౌరభము
నిఖిలాంధ్ర ప్రపంచము నందు
చిరస్థాయిగా బ్రసరించు నట్లు
గోలకొండ
ఆంధ్రకవివరేణ్య కవితావిలాసపుష్పము
కృతజ్ఞతాబద్ధముగ - అనుజ్ఞాపూర్వకముగ
సమర్పితము.
👉 భాగ్యలక్ష్మమ్మ దంపతుల అన్యోన్య దాంపత్యాన్ని, భక్తి చింతనను, మహారాణిగా ఆమె పాలనా దక్షతను గురించి కూడా గోలుకొండ కవుల సంచికలో పేర్కొనడం గమనించాల్సిన విషయం.
శ్రీమంతు నవైరాజా శ్రీరామభూపాలరావు బల్వంత బహదరుగారి పట్టపు రాణి శ్రీమంతు సవైరాణి భాగ్యలక్ష్మమ్మ గారు . పతివ్రతా శిరోమణులు , దేవబ్రాహ్మణ భక్తియుక్తులు , ప్రజాపాలనా ప్రావీణ్యురాలు , న్యాయైక విచక్షణలు , ధైర్య స్థయిర్య సౌశీల్య చాతుర్య వినయాది సుగుణోపేతలు , విద్యా వివేకయుతులు , రాజనీతి నిపుణురాలు . "
▪️విద్వత్కవి గాయక సభలు
ఆత్మకూరు సంస్థానంలో సోమభూపాల్ కాలం నుండి ప్రతి యేటా ఫాల్గుణ శుక్ల తదియ , చవితి రోజుల్లో విద్వత్కవి గాయక సభలు నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నది. ఈ సభల్లో పాల్గొని తమ విద్వత్తును ప్రదర్శించేందుకు తెలుగు వివిధ ప్రాంతాల నుంచి పండితులకు ఆహ్వానాలు అందేవి. సవైరాణి భాగ్యలక్ష్మమ్మ పరిపాలన సమయంలో కూడా ఈ సభలు ఎలాంటి ఆటంకం జరగలేదు.
త్రిపురాంతక శాస్త్రి , గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి , బులుసు అప్పన్నశాస్త్రి , శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి , అవధానం చంద్రశేఖర శర్మ , పోకూరి కాశీపతి అవధాని , పెద్దమందడి వేంకట కృష్ణకవి , చెమికల చెన్నారెడ్డి తదితరులు పాల్గొనేవారు .
ఈ సభల్లో నంబాకం రాఘవాచార్యులు, తిరుమల బుక్కపట్టణం వేంకటాచార్యులు న్యాయ నిర్ణేతలుగా
వ్యవహరించే వారు . విలువైన బహుమతులు ప్రకటించబడేవి.
▪️భాగ్యలక్ష్మమ్మ ప్రశంస
గోలుకొండ పత్రికలో భాగ్యలక్ష్మమ్మ ప్రశంస ఈ విధంగా ఉన్నది.
👉స్థిర సామ్రాజ్యమనాయంబు జయలక్ష్మీ వ్యాప్తి శశ్వద్యశ
స్ఫురణంబండిత పోషనాభిరతి సంపూర్ణానుకంపాప్తియున్
ఐరమౌదార్యము నైజపాదభజన వ్యాసంగమున్ గూర్చి
శ్రీ కర కుర్మూర్తి గిరీశుడోము నిను దీక్షన్ భాగ్యలక్ష్యంబికా
-----దీక్షితుల నరసింహ శాస్త్రి
👉శ్రీమద్దివ్యరథాంగ శంఖ మహాపద్మాగిసర్వాయుధైః
శమతౌస్తుభ దివ్యహారమణిభి శ్రీవత్స చిహ్నాదిభిః యుక్త శ్రీపతి రేషనిత్యమవతు శ్రీభూమినీళాదిభిః శ్రీరామా వనిపాల మౌళి మహిషీం శ్రీ భాగ్యలక్ష్యంబికాం
---- తిరుమల బుక్కపట్టణం వేంకటాచార్యులు
👉జయతు జయతు నైజాం చక్రవర్తి రాజ్యం
జయతు జయతు రాజత్తత్ప్రజా తత్కుటుంబం జయతు జయతు తస్మానుగ్రహాలబ్ధ రాజ్యా
జయతు జయతు రాజ్ఞి భాగ్యలక్ష్మాంబికాబ్యా
-----జోస్యం వేంకటాచర్యులు
▪️సంతానలేమి - దత్తత స్వీకరణ
ఆత్మకూరు సంస్థానాన్ని పాలించిన ముక్కెర రాజుల్లో చివరివాడైన శ్రీరామభూపాలుడు - భాగ్యలక్షమ్మ దంపతులకు సంతానం లేదు . సంతానం కలిగి మరణించడం జరిగింది. ఇది అంతఃపుర కుట్రగా ఇప్పటికీ అక్కడి జానపదులు రకరకాల కథలు చెప్పుకుంటారు.కానీ తెలివైన భాగ్యలక్ష్మమ్మ ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు.
స్వయంగా తన సోదరి, దోమకొండ సంస్థానం ఆడపడుచు, తాటికొండ దేశాయ్ ల కుటుంబ కోడలు
సోమేశ్వరమ్మ అనంతరెడ్డిల కుమారుడిని తన
వారసుడుగా దత్తత తీసుకుంది.
దత్తత స్వీకార సమయంలో సత్యనారాయణరెడ్డి పేరుతో ఉన్న ఆ బాలుడికి శ్రీరామభూపాల్ తాత గారి పేరు సోమభూపాల్ ' అని పెట్టుకోవడం జరిగింది. వీరు 1929లో జన్మించారు. ఇతడు సంస్థాన బాధ్యతలు నిర్వహించలేదు. ఎందుకంటే ఇతడి సమయానికి నిజాం ప్రభువు సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసాడు.
ఇది రాణి భాగ్యలక్ష్మమ్మ మనో ధైర్యం కోల్పోని కథ - గాథ..
__________________________________________
ఆధారం :
1 )ఆంధ్ర సంస్థానములు సాహిత్య సేవ
తూమాటి దోణప్పు
2) గోలుకొండ కవుల సంచిక
సురవరం ప్రతాపరెడ్డి
3) ఆత్మకూరు సంచిక
4) వైద్యం వెంకటేశ్వర చార్యులు
5)స్థానిక జానపదులు
ఎన్నో తెలియని చారిత్రక విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. 🙏
ReplyDelete