Tuesday, March 8, 2022

కుమ్ర లక్ష్మీబాయమ్మ (గిరిజనుల భూపోరాట ధీశాలి )

కుమ్ర లక్ష్మీబాయమ్మ 
(గిరిజనుల భూపోరాట ధీశాలి )
మహిళా దినోత్సవం సందర్బంగా 
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

నాగరిక సమాజానికి దూరంగా అడవులతో మమేకమై జీవించే మహిళ.....
తన కోసం కాదు, తన కుటుంబం కోసం కష్టాన్ని నష్టాన్ని భరించుకున్న మహిళ.....
నమ్ముకున్న మట్టి రేణువుల నుండే పోరాట పాటలు నేర్చుకున్న మహిళ.....
కుమ్ర లక్ష్మీబాయమ్మ !

▪️వివరాల్లోకి వెళితే...

తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, పిప్పల్‌ధారి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న  దహిగూడ గ్రామానికి చెందిన జంగు, రాంబాయి అనే దంపతులకు కుమ్ర లక్ష్మీబాయమ్మ  జన్మించింది.

బాల్యంలోనే  అదే గ్రామానికి చెందిన కుమ్ర భీంరావ్ తో లక్ష్మీబాయమ్మ  పెళ్లి జరిగింది. చిన్నతనంలోనే సంతానం కలిగింది. ఒక కొడుకు, ముగ్గురు ఆడపిల్లలు. ఉన్నంతలో జీవితం సంతోషంగా ముందుకు సాగుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లోనే అప్పుల బాధతో భీంరావు  ఆత్మహత్య చేసుకున్నాడు. నలుగురు చిన్నపిల్లలతో లక్ష్మీబాయమ్మకి  జీవితం భారం అయ్యింది. కష్టాన్ని ఓర్చుకుంటూ పిల్లలు కోసం వ్యవసాయం కొనసాగిస్తూ
బతకడం మొదలెట్టింది.

▪️భూ ఆక్రమణలు

తల్లిదండ్రుల కాలం నుండి పోడు వ్యవసాయం లక్ష్మీబాయమ్మ  కుటుంబానికి  జీవనధారం.

అడవిలో దొరికే  కాయలు పండ్లు జిగురు చెక్కలు మొదలగు అటవీ సంపదను సమీప సంతల్లో విక్రయించి పొట్ట పోసుకునే గిరిజనులు..... తమ శాశ్వత భుక్తి కోసం అడవులను కొంతమేర నరికి చదును చేసుకుని వ్యవసాయ పొలాలుగా మార్చుకుంటారు. ఇందులో శక్తికి మించిన శ్రమ ఉంటుంది. ఎకరం పొలం తయారు చేసుకోవడం కోసం యాడాది అసాంతం కష్టపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో   ఇక్కడి కొందరు  గిరిజనులు సమీప అడవుల్లో కొన్నేండ్లు కష్టపడి  చెట్లను  బండరాళ్లను తొలగించి వ్యవసాయం కోసం  నేలని సిద్ధం చేసుకున్నారు. అదే తమ ఆస్తిగా తమ అలా సాగులోకి తెచ్చిన ఆ భూమిని తమ వారసులకు అందించారు.ఈ వరుసలో కుమ్ర లక్ష్మీబాయమ్మ  పూర్వికులు కూడా ఉన్నారు.

అటువంటి భూముల మీద కొందరు గిరిజనేతరులైన పెద్దమనుషులైన  కన్ను పడింది.
వెంటనే రంగంలోకి దిగారు. రాజకీయ పరపతి ఉపయోగించి భూములను ఆక్రమించుకున్నారు.
ఈ క్రమంలో లక్ష్మీబాయమ్మతో పాటుగా తోటి గిరిజనులు తమ పూర్వీకుల నుండి తమకు సంక్రమించిన పొలాల్లోనే కూలీలుగా మారిపోయారు.

▪️భూ పోరాటం

తమ తాతలు సమకూర్చిన  పొలాల్లోనే తాము కూలీలుగా మారిపోవడం  లక్ష్మీబాయమ్మ   సహించలేకపోయింది. న్యాయం కోసం తోటి గిరిజనులతో చర్చించింది. పరపతి ఉన్న పెద్ద మనుషులను ఎదురించడానికి తోటి గిరిజనులు ధైర్యం చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో లక్ష్మీ బాయమ్మ ఒక్కరే  తమ  భూముల మీద తమకున్న హక్కుల ప్రకారం న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది.

ఇది చూసి తోటి గిరిజనులు లక్ష్మీ బాయమ్మను భయపెట్టారు. బతికి ఉంటే బలుసాకు తినొచ్చని నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. కానీ లక్ష్మీ బాయమ్మ వినిపించుకోలేదు. అధైర్య పడలేదు. కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ భూమి కోసం 16 ఏండ్లు పోరాటం చేసింది.  అప్పటికి గిరిజనులు తమ పొలాల గురించే మర్చిపోయారు. 

 లక్ష్మీబాయమ్మ న్యాయస్థానానికి  సమర్పించుకున్న పత్రాలు, ప్రభుత్వం అధీనంలో ఉన్న పత్రాలు, భూములు  లక్ష్మిబాయమ్మకు చెందాల్సినవే అని తెలియజేస్తున్నప్పటికి  కేసు నత్త నడక సాగింది. ప్రభుత్వాలు మారాయి. అధికారులు మారారు. అయినప్పటికీ లక్ష్మీబాయమ్మ  వెనకడుగు వేయలేదు.

" నేను సచ్చేంత వరకు వస్తే రానీ పోతే పోనీ " అనుకుంటూ పోరాటం కొనసాగించింది. చివరకు న్యాయస్థానం లక్ష్మీబాయమ్మకు 
అనుకూలంగా తీర్పునిచ్చింది.

▪️భూముల అప్పగింత

ఒక్క లక్ష్మీబాయమ్మ పోరాటం వందల మంది గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపింది. ఒక్క
లక్ష్మీబాయమ్మ పొలాలే కాదు, పెద్ద తలకాయలు ఆక్రమించుకున్న మొత్తం పొలాలను
సంబంధిత గిరిజనులకు అప్పగించాలని న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది.

2016 - 2017 ప్రాంతంలో రెవెన్యూ అధికారులు  భూములను  గిరిజనులకు అప్పగించారు.

▪️విశిష్ట మహిళా పురస్కారం

లక్ష్మీబాయమ్మ పోరాటశక్తిని ప్రభుత్వం గుర్తించింది.
తెలంగాణ ప్రభుత్వం నుండి - అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా 
" తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం -2017"
అందుకున్నారు.

▪️గుడుంబా నిర్మూలన కోసం 

గిరిజనుల ఆవాసాల్లో గుడుంబా నిర్మూలన కోసం స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నప్పుడు.....తమ గిరిజన జాతిని గుడుంబాకు దూరం చేయాలని వాళ్ళకు మద్దతు పలికింది. గూడెంలో యువతని ఒక సమూహంగా ఏర్పాటు చేసి, గుడుంబా స్థావరాల మీద దాడులు నిర్వహించింది.ఈ క్రమంలో గ్రామంలోనే ఒక వర్గం లక్ష్మీబాయమ్మకు శత్రువుగా అనివార్యంగా మారిపోయింది.

▪️గంటుబాయి

ఇక్కడి గిరిజనుల కులదైవం గంటుబాయి. పొలాలు తిరిగి పొందిన గిరిజనులు లక్ష్మీబాయమ్మ ఇప్పుడు గంటుబాయమ్మగా పిలుచుకుంటున్నారు.

ఇది  కష్టాలను ఎదురించి, సమస్యలను హక్కులను పోరాడి సాధించిన  లక్ష్మీబాయమ్మ  జీవిత గాథ - కథ

No comments:

Post a Comment